Kamal Haasan MNM DMK Alliance : తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో కమల్ హాసన్ మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం) పార్టీ కూడా చేరింది. రానున్న లోకసభ ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ తెలిపారు. అయితే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఎంఎన్ఎంకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూటమి అంగీకరించింది.
శనివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కమల్ హాసన్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున ఎంఎన్ఎం పార్టీ ప్రచారం చేయనుంది. ఈ సమావేశం అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. 'నాకు ఎలాంటి పదవులు వద్దు. దేశ ప్రయోజనాలను ఆకాంక్షించి కూటమిలో చేరా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం లేదు. డీఎంకే-కాంగ్రెస్ కూటమికే పూర్తి మద్దతు' అని కమల్ హాసన్ ప్రకటించారు.
మరోవైపు, శనివారం సాయంత్రం డీఎంకే, కాంగ్రెస్ నేతలు కీలక సమావేశంలో పాల్గొనున్నారు. దీని తర్వాత రాష్ట్రంలో విపక్ష ఇండియా కూటమి పార్టీల సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటక చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులో కాంగ్రెస్కు 10 సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సీపీఐ, సీపీఎంలకు రెండు చొప్పున స్థానాలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.