ETV Bharat / bharat

'భారత ప్రజలారా క్షమించండి'- ఇండియాతో వివాదంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 11:19 AM IST

Updated : Mar 9, 2024, 12:17 PM IST

Mohamed Nasheed Apologies India : భారత్‌తో వివాదం తమపై ఎంతో ప్రభావం చూపిందని, మరీ ముఖ్యంగా పర్యాటక రంగాన్ని దెబ్బతీసిందని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్ తెలిపారు. మాల్దీవుల ప్రజల తరఫున తాను భారత్​కు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

Mohamed Nasheed Apologies India
Mohamed Nasheed Apologies India

Mohamed Nasheed Apologies India : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్‌ భారత్‌కు క్షమాపణలు చెప్పారు. భారత్‌తో దౌత్యవివాదం వల్ల జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల ప్రజల తరఫున భారత్‌కు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈ దౌత్యవివాదం, బాయ్‌కాట్ పిలుపు వల్ల మాల్దీవులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. వేసవి సెలవులకు భారతీయులు తమ దేశం రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఎప్పటిలాగే తమ ఆతిథ్యం ఉంటుందని, అందులో ఏ మార్పు ఉండదని పేర్కొన్నారు.

భారత దళాలు మాల్దీవుల్ని విడిచివెళ్లాలని తమ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు కోరినప్పుడు భారత్‌ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిందని మహమ్మద్​ నషీద్​ తెలిపారు. భారత్‌ తన బలాన్ని ప్రదర్శించాలని అనుకోలేదన్నారు. చైనా నుంచి రబ్బర్‌ బుల్లెట్లు, టియర్‌ గ్యాస్‌లను ముయిజ్జు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారని, అవి అవసరమని ప్రభుత్వం భావించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఇదీ వివాదం
Maldives India Row : ప్రధాని మోదీ కొద్దినెలల క్రితం లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వివాదం నడుస్తున్నా చైనా అనుకూలనేతగా పేరున్న కొత్త అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, డ్రాగన్​కు దగ్గరవుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ రెండు దేశాల మధ్య సైనిక సహకారంపై ఒప్పందం జరిగింది. మాల్దీవులకు ఉచితంగా సైనిక పరికరాలను అందించేందుకు చైనా ముందుకొచ్చింది. ఇక, మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూదని అన్నారు మయిజ్జు. కనీసం సివిల్‌ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించొద్దంటూ నోరుపారేసుకున్నారు. ఆయన తీరును విపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత ప్రజలతో తమ బంధం రాజకీయాలకు అతీతమని అక్కడి పర్యటక సంఘాలు స్పందించాయి.

మాల్దీవుల నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి
Maldives Boy Dies Denial Of Indian Plane : మాల్దీవుల ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొన్నాళ్ల క్రితం ఓ బాలుడు మృతిచెందాడు. బ్రెయిన్​ ట్యూమర్​తో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడిని భారత్​ ఇచ్చిన విమానంలో ఎయిర్​ లిఫ్ట్​ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. సరైన సమయానికి ఆస్పత్రికి వెళ్లకపోవడం వల్ల ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో మాల్దీవుల ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

పర్యటకులను పంపాలని చైనాకు మాల్దీవులు విజ్ఞప్తి- భారత్​పై మరోసారి బయటపడిన డ్రాగన్​​ వక్రబుద్ధి

'భారత్​తో వివాదం మనకే చేటు'- మాల్దీవులు అధ్యక్షుడి తీరుపై స్వదేశంలో విమర్శలు

Last Updated :Mar 9, 2024, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.