Hero Vijay Devarakonda Visited Simhachalam Temple: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ
Published : Sep 5, 2023, 7:31 PM IST
Hero Vijay Devarakonda Visited Simhachalam Temple: విశాఖ సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) దర్శించుకున్నారు. విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' (Kushi) సినిమా ఇటీవల విడుదలై విజయవంతం కావడంతో విశాఖ నగర పర్యటనకు వచ్చినట్టు ఆయన తెలిపారు. అప్పన్న స్వామి ఆలయానికి వచ్చిన విజయ దేవరకొండకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అప్పన స్వామి ఆలయంలో కప్పస్తంభం ఆలింగనం చేసుకుని.. అంతరాలయంలో పూజలు నిర్వహించారు.
స్వామి దర్శనానికి రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్న విజయ్.. ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉందని తెలిపారు. అప్పన్న స్వామివారి ఆలయం చుట్టుపక్కల ప్రకృతి అందాలు.. స్వామివారి శిల్ప సంపద చాలా అపురూపంగా ఉందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. విశాఖ వచ్చిన ప్రతిసారి సింహాచలం వచ్చి అప్పన్న స్వామివారి దర్శనం చేసుకోవాలని ఉండేదని.. ఆ కోరిక ఈ రోజు తీరిందని విజయ్ సంతోషం వ్యక్తం చేశారు.