ETV Bharat / sukhibhava

షుగర్​ ఉన్నవాళ్లు మద్యం తాగొచ్చా?.. ఒకవేళ తాగాల్సి వస్తే..?

author img

By

Published : Aug 10, 2022, 7:02 AM IST

షుగర్​తో బాధపడుతున్న వారు మద్యం తాగొచ్చా? మద్యం సేవించాక మధుమేహం ట్యాబ్లెట్లు వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకుంటే దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా? వీటిన్నంటిపైన నిపుణులు ఏమంటున్నారంటే..

sugar-patients-will-drink-alcohol-or-not
sugar-patients-will-drink-alcohol-or-not

Sugar Patients Alcohol: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వారిలో కొందరు అప్పుడప్పుడు మద్యం తాగుతుంటారు. అయితే మధుమేహులు.. మద్యం తాగాక షుగర్​ మందులు వేసుకోవచ్చా? సాధారణంగా మద్యం తాగాక ఏవైనా మాత్రలు వేసుకోవచ్చా? దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా? ఈ సందేహలన్నింటిపైన నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

"మధుమేహం ఉన్నవారు అసలు మద్యం తాగనే కూడదు. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. కాబట్టి మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా? అన్న ప్రశ్నకు తావేలేదు. మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. ఎందుకంటే మద్యంతో నాడులు దెబ్బతింటాయి. మామూలుగానే మధుమేహులకు నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఎంత ఎక్కువకాలం నుంచి మధుమేహంతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముంది. దీని మూలంగానే చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లు, మంట పెట్టటం, సూదులు పొడిచినట్టు అనిపించటం వంటి వాటితో బాధపడుతుంటారు. దీనికి మద్యం కూడా తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినొచ్చు. కాళ్లు మొద్దుబారి, పుండ్లు పడొచ్చు. పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావొచ్చు."
-- డా.ఎస్​.మనోహర్​, జనరల్​ ఫిజీషియన్

ఒకవేళ ఎప్పుడైనా మద్యం తాగాల్సి వస్తే విధిగా భోజనం చేసి ఆ తర్వాత మాత్రలు వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు."మద్యం తాగాక భోజనం చేయకపోతే మందులు వేసుకోవద్దు. మామూలుగా కాలేయం నిరంతరం గ్లూకోజును ఉత్పత్తి చేస్తూ.. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేలా చూస్తుంది. మద్యంలోని ఆల్కహాల్‌ ఈ ప్రక్రియను దెబ్బతీస్తుంది. దీంతో తగినంత గ్లూకోజు ఉత్పత్తి కాదు. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పడిపోతాయి. ఆల్కహాల్‌ తాగాక భోజనం చేస్తే ఇది కొంతవరకు కుదురుకుంటుంది. అయితే చాలామంది భోజనం చేయరు. దీంతో గ్లూకోజు మోతాదులు పడిపోయి హైపోగ్లైసీమియాలోకి వెళ్లిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. సత్వరం చికిత్స లభించకపోతే ప్రాణాంతకంగానూ పరిణంచొచ్చు." అని నిపుణులు చెప్పారు.

"ఇక ఇతరత్రా మందులు విషయంలో- యాంటీబయాటిక్స్‌, నొప్పిని తగ్గించే మందుల వంటివి జీర్ణాశయ పూత (గ్యాస్ట్రయిటిస్‌) సమస్యకు దారితీస్తాయి. మద్యం కూడా దీన్ని తెచ్చిపెట్టొచ్చు. మందులు, మద్యం రెండూ కలిస్తే సమస్య ఇంకాస్త ఎక్కువవుతుంది. దీంతో ఛాతీలో మంట, వాంతులు తలెత్తొచ్చు. కొందరికి రక్తం వాంతులూ కావొచ్చు. కాబట్టి మందులు వేసుకునేటప్పుడు మద్యం జోలికి వెళ్లకూడదని గుర్తుంచుకోవాలి."అని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: మంకీపాక్సా? ఆటలమ్మా? గుర్తించడం ఎలా?

ముఖంపై మచ్చలు, మొటిమలా? నిమ్మ, పెరుగు, ఆలూతో ఇలా చేస్తే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.