ETV Bharat / state

సొంతూళ్లకు వలస కార్మికులు.. నత్తనడకన యాదాద్రి అభివృద్ధి పనులు

author img

By

Published : May 10, 2021, 12:28 PM IST

కరోనా రెండోదశ ప్రజల్లో ప్రాణభయాన్ని కలిగిస్తోంది. సెకండ్​ వేవ్​లో వైరస్​ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. కొవిడ్​ సోకితే తమ పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో పలువురు సొంతూళ్ల బాటపడుతున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగమైన కార్మికులు తమ స్వరాష్ట్రాలకు పయనమవుతుండటం యాడా అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సుమారు 200 మంది కార్మికులు ఇంటిముఖం పట్టడంతో ఆలయ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

yadadri
yadadri

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి చేపట్టిన క్షేత్రాభివృద్ధి పనులకు కొవిడ్ అడ్డుకట్ట వేస్తోంది. వైరస్​ విజృంభణతో భయాందోళనకు గురవుతున్న కార్మికులు సొంతూళ్లకు పయనం కావడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది.

విశ్వఖ్యాతి గాంచేలా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రాన్ని రూపొందించాలన్న ప్రణాళికకు కరోనా ఆటంకం కలిగిస్తోంది. కార్మికుల లేమితో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొండపై ఆలయాల విస్తరణ, రక్షణ గోడ, కొండకింద గండి చెరువు వద్ద జరుగుతోన్న పనులతో సహా వీవీఐపీల బస కోసం నిర్మితమవుతోన్న ప్రెసిడెన్షియల్ సూట్ల పనుల నిర్వహణకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాతో పాటు కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది కార్మికులు వచ్చారు.

పనులన్ని చకచకా జరుగుతున్న తరుణంలో కరోనా అడ్డుకట్ట వేసింది. వైరస్​ విజృంభణ దృష్ట్యా సుమారు 200 మంది కార్మికులు సొంతూళ్ల బాటపట్టారు. దీంతో పనుల్లో వేగం అటకెక్కింది. కార్మికుల లేమితో గుత్తేదారులు సైతం ఎటూ పాలుపోని స్థితిలో పడ్డారు. మరోవైపు ఈ నెలాఖరులో జరగనున్న స్వామి వారి జయంతి మహోత్సవాల్లోగా ఆలయ విస్తరణ పనులన్నీ పూర్తి కావాలన్న సీఎం సూచనలతో యాడా తీవ్రంగా శ్రమిస్తోంది. అందుబాటులో ఉన్న 400 మంది కార్మికులతోనే నిర్మాణాలు చేపడుతున్నట్లు యాడా అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి.. అడ్డంకులు ఎదురైనా.. లక్ష్యాన్ని అధిగమించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.