ETV Bharat / state

bhatti Vikramarka: 'రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరం'

author img

By

Published : May 1, 2023, 7:29 PM IST

bhatti People's March Padayatra: పేద ప్రజలు తిండి లేక అల్లాడిపోతుంటే.. ప్రభుత్వం మాత్రం రాజ భవనాలు కట్టుకొని తెలంగాణ వెలిగిపోతోందని చెప్పటం సిగ్గుచేటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఆలేరు రైల్వే గేట్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఎండా, వానలు లెక్క చేయకుండా రైతులు ధాన్యం ఎప్పుడు కొంటారా అని కాలరాత్రులు గడపడం కోసమేనా రాష్ట్రం తెచ్చుకున్నదని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్​ కుటుంబం, ప్రభుత్వ పెద్దలు దోచుకున్నందు వల్లే ధనిక రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలైందని మండిపడ్డారు.

bhatti padayatra in alair
'ఇదేనా తెలంగాణ మోడల్ అంటే'

bhatti People's March Padayatra: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆలేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలేరు రైల్వే గేట్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్​లో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి కొట్లాడిన తెలంగాణ ప్రజలకు.. సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని భట్టి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి దశాబ్ద కాలం అవుతున్నా బీఆర్ఎస్ పరిపాలనలో నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలు నెరవేరకపోవడంతో పాటు ఆత్మగౌరవం కూడా దక్కకపోవడంతోనే తెలంగాణ ప్రజల బాగు కోసం పాదయాత్ర మొదలుపెట్టానని చెప్పారు.

ప్రజల అవసరాలా.. పాలకుల రాజ భవనమా: 'ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ భార్య పిల్లలతో రాత్రుళ్లు రోడ్లపైన టార్పాలిన్ పట్టాలు కప్పుకొని బిక్కుబిక్కుమంటూ ధాన్యం ఎప్పుడు కొంటారని ఎదురుచూస్తూ కాలరాత్రులు గడపడం కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నదని భట్టి వివర్శించారు. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర.. ఆలేరు చేరుకునేంత వరకు ఏ గ్రామంలో చూసినా ప్రజలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. కొలువులు లేక గడ్డాలు పెంచుకొని విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల మీద పిచ్చోళ్ల మాదిరిగా తిరుగుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారన్నారు. అనేక గ్రామాల్లో పేద ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారని.. ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఈ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున సెక్రెటేరియెట్ కట్టాం.. తెలంగాణ వెలిగిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు తీర్చడం ముఖ్యమా? పాలకులు కూర్చునేందుకు రాజ భవనం కట్టుకోవడం అవసరమా? ఆలోచన చేయండి అన్నారు.'

బీఆర్ఎస్ పరిపాలన వద్దు.. ఇందిరమ్మ రాజ్యం కావాలి: బీఆర్ఎస్ పరిపాలన వద్దని.. ఇందిరమ్మ రాజ్యం కావాలని పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో ప్రజలు నాతో చెప్పారని భట్టి పేర్కొన్నారు. సోనియా గాంధీ నేతృత్వంలో తీసుకువచ్చిన ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా ఆదివాసీ గిరిజనులకు పంచిన భూములను ధరణి తీసుకువచ్చి ఆదివాసులకు, గిరిజనులకు ఆ భూమిపై హక్కు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాన్ని వదిలించుకొని వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకునేందుకు ఆదిలాబాద్ అడవి బిడ్డలు సమాయత్తం అవుతున్నారని చెప్పుకొచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణతో ఉద్యోగాలు కొల్లగొడుతున్న దుర్మార్గ ప్రభుత్వాన్ని దింపుతామని పిడికిలి బింగించి సింగరేణి కార్మికులు నాతో చెప్పిన మాటలు మీతో పంచుకుంటున్నానని అన్నారు. కొలువుల కోసం కొట్లాడిన రాష్ట్రంలో.. లేకలేక ఒక నోటిఫికేషన్ వేసి ప్రశ్నాపత్రాలు లీక్ చేసి తమ జీవితాలతో చెలగాటమాడిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని కాకతీయ యూనివర్సిటీ సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ఆక్రోశాన్ని వెళ్లగక్కారని భట్టి చెప్పుకొచ్చారు.

ఇదేనా తెలంగాణ మోడల్ అంటే: తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం, ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారని.. అందుకే ధనిక రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్ల అప్పు అయ్యిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏమైనా బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మాణం చేసిందా? పెద్ద పరిశ్రమలు తీసుకువచ్చిందా? ఔటర్ రింగ్ రోడ్డు కట్టిందా? అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేసిందా? పేదలకు ఇల్లు కట్టిచ్చి ఇచ్చిందా? ఎందుకని రూ.5 లక్షల కోట్ల అప్పు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణను అద్భుతంగా చేస్తున్నామని చెప్పడం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమేనా అంటూ విమర్శించారు. బెల్ట్ షాపులు పెట్టి తాగించడం, అప్పులు చేయడమే దేశానికి తెలంగాణ మోడల్ అంటూ ఎద్దేవా చేశారు.

ఆమె భూమి పంచితే.. ఈమేమో..: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఆరుట్ల కమలాదేవి ఈ ప్రాంతంలో భూములు పంచితే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సునీతకు నియోజకవర్గంలోని ప్రజల మీద ప్రేమ కంటే భూములపైన, ఇక్కడ వెలుస్తున్న వెంచర్లపైన, భూ కబ్జాలపైన ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లిస్తున్నట్లుగా.. గొంగిడి టాక్స్ కట్టిన వారికే ఆలేరు నియోజకవర్గంలో పనులు అవుతున్నాయంట అని ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా చేసే పని ఇదేనా అని నిలదీశారు. ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి దంపతులను స్ఫూర్తిగా తీసుకొని ఆలేరును అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే గొంగిడి టాక్స్ పెట్టడం దుర్మార్గం అని విమర్శించారు.

అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆలేరు​ను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేస్తామన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, కూలీలకు కూలీబంధు, ఏడాదికి కూలీల ఖాతాలో రూ.12 వేలు జమ చేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని.. అమ్మ హస్తం పథకాన్ని తీసుకొస్తామని వివరించారు. ప్రతి ఒక్కరికీ నిర్బంధ విద్యను అమలు చేసి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేలా చర్యలు తీసుకుంటామని భట్టి స్పష్టం చేశారు.

'ఇదేనా తెలంగాణ మోడల్ అంటే'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.