ETV Bharat / state

POLO CLUB: పేరుకే అది పోలో క్లబ్‌.. లోపలంతా అసాంఘికమే

author img

By

Published : Nov 11, 2021, 12:11 PM IST

అది పేరుకు మాత్రమే సర్కారు భూమి. అక్షరాలా రూ.180 కోట్ల ప్రభుత్వ ఆస్తి. కానీ ఓ బడా వ్యక్తి ఆ భూమిని చేజిక్కించుకుని అక్రమాలకు అడ్డాగా మార్చాడు. పోలో క్లబ్‌ పేరిట.. ఆ ప్రదేశంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. నిత్యం అర్ధరాత్రి వరకు విందులు, డీజే సౌండ్‌లతో ఈ ప్రాంతం మారుమోగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Polo Club‌
పోలో క్లబ్‌

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌నగర్‌లో సరికొత్త దందా సాగుతుంది. అక్షరాలా రూ.180 కోట్ల ఆస్తి గల భూమిని కొంతమంది పేదలు వ్యవసాయం చేసుకోవడానికి నాటి సర్కారు పంపిణీ చేసింది. అందులో కొంత భూమిని ఓ బడా వ్యక్తి చేజిక్కించుకుని తనదేనని వాదిస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమేనని జిల్లా సంయుక్త కలెక్టర్‌ కూడా గతంలోనే నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉంది. 111 జీవో పరిధిలో ఉన్న ఈ భూముల్లో నిర్మాణాలు చేయకూడదు. సదరు వ్యక్తి ఏకంగా పోలో క్లబ్‌ పేరుతో గుర్రాల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి నిర్మాణాలు చేపట్టారు. అక్కడ నేర్పేది గుర్రపు స్వారీ అని చెబుతున్నా.. విందులు, వినోదాలు, మద్యం, హుక్కా, గంజాయి, మత్తు పదార్థాల వినియోగానికి కేంద్రంగా మారిందన్న ఆరోపణలున్నాయి. నిత్యం అర్ధరాత్రి వరకు విందులు, డీజే సౌండ్‌లతో ఈ ప్రాంతం మారుమోగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం..
గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం..

నగర శివారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని సర్వే నంబరు-177లో 162.08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఇందులో 143.07 ఎకరాలను 1961లో ప్రభుత్వం 46మంది రైతులకు పంపిణీ చేసింది. ఈ భూమిలో సాగు మాత్రమే చేసుకోవాలని, ఇతర అవసరాలకు వినియోగించినా, విక్రయించినా స్వాధీనం చేసుకుంటామన్న నిబంధనతోనే పట్టాలు ఇచ్చింది. తరువాత ఆ రైతుల్లో కొందరు భూమిని వేరేవారికి విక్రయించడంతో 1996లో 112.31 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ స్థలంపై కన్నేసిన ఓ బడా వ్యక్తి తనకు ఇక్కడ 12 ఎకరాలు ఉందంటూ అప్పట్లో ఆర్డీవో కోర్టుకు వెళ్లారు. 2010లో అప్పటి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ అది పట్టా భూమంటూ ఆదేశాలిచ్చారు. 2011లో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అప్పటి జేసీ ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని తిరిగి ఆదేశాలిచ్చారు. అప్పటికే సదరు వ్యక్తి అక్కడ హైదరాబాద్‌ పోలో అండ్‌ హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌ను ఏర్పాటుచేశారు. తరువాత చేపట్టిన కొన్ని నిర్మాణాలను స్థానిక రెవెన్యూ అధికారులు తొలగించారు. ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వివాదం కోర్టు పరిధిలో ఉండగా, కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆ వ్యక్తి మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించారు. గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఏకంగా క్లబ్బుగా మార్చేశారు.

క్లబ్‌, బార్‌ తదితరాల బోర్డులు..
క్లబ్‌, బార్‌ తదితరాల బోర్డులు..

ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే చర్యలు..

ఇక్కడి గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంలో కొద్ది రోజుల కిందట 30మంది అర కిలో గంజాయితో చిక్కిన విషయం వాస్తమేనని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.రాజు ఈటీవీ భారత్​కు తెలిపారు. క్లబ్‌ కార్యదర్శి రియాజ్‌, మరో 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. క్లబ్‌పై నిఘా పెట్టామని తెలిపారు. దీనిపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌ను ప్రశ్నిస్తే.. ఖచ్చితంగా ప్రభుత్వ భూమేనన్నారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అజీజ్‌నగర్‌ పంచాయతీ గ్రామ కార్యదర్శి దీపలతను వివరణ కోరగా.. 111 జీవో పరిధిలో ఉండటంతో ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. కొత్తగా నిర్మాణాలు చేయకుండా చూస్తున్నామన్నారు. పాత వాటిపై తక్షణ చర్యలకు అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరామన్నారు. ఆదేశాలు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇతరులు రాకుండా చెక్‌పోస్టుతో భద్రత
ఇతరులు రాకుండా చెక్‌పోస్టుతో భద్రత

అధికారులు ఈ జోలికి వెళితే ఒట్టు!

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రోడ్డుకు ఆనుకొనే ఈ భూమి ఉంది. ఎకరా రూ.15కోట్లకు పైమాటే. ఈ లెక్కన ఈ భూమి విలువ కనీసం రూ.180కోట్లని అంచనా. స్థలం కబ్జాచేసిన ఆ బడా వ్యక్తి 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. లోపల బార్‌ ఏర్పాటు చేశారు. పోలో రైడింగ్‌ పోటీలను నిర్వహిస్తూ రాజకీయ, సినీ, పోలీసు విభాగాల ఉన్నతాధికారులను ఆహ్వానిస్తూ తన కార్యకలాపాలకు ఎవరూ అడ్డు రాకుండా చూసుకుంటున్నారు. ఆ క్లబ్‌లో సభ్యత్వానికే రూ.10లక్షలు వంతున తీసుకుంటుండటం గమనార్హం. సభ్యులకు ఇక్కడి బార్‌లో రాయితీపై మద్యం అందిస్తున్నారు. రాత్రిళ్లు విందులకు అద్దెకు ఇస్తున్నారు. ఇలా తీసుకుంటున్న వారు పేకాట ఆడటంతో పాటు గంజాయి, ఇతరత్రా మత్తు పదార్థాలను తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిన అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు.

ఇదీ చదవండి: Sajjanar interview: అల్లు అర్జున్​కి నోటీసులేంటి? అసలేం జరిగింది?.. సజ్జనార్​తో స్పెషల్ ఇంటర్వ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.