ETV Bharat / state

Telugu Students in Ukraine : 'బాంబుల మోతతో మా ప్రాంతం దద్దరిల్లుతోంది'

author img

By

Published : Feb 26, 2022, 9:20 AM IST

Telugu Students in Ukraine : "అమ్మా.. తమ్ముడు టీవీ సౌండ్ కొంచెం ఎక్కువ పెడితే గొడవపడేదాన్ని. కానీ ఇక్కడ ఇప్పుడు పక్కనే బాంబులు పేలుతున్నాయి. సైరన్ మోతతో చెవులు దద్ధరిల్లుతున్నాయి. ఏ క్షణంలో ఎటువైపు నుంచి చావు ముంచుకొస్తుందో తెలియడం లేదు. అయినా నేను భయపడటం లేదు. ధైర్యంగా ఉన్నాను. శాయశక్తులా నేను బతికుండటానికి ప్రయత్నిస్తాను. నా గురించి మీరు బెంగపడొద్దు. నేను ఇక్కడ క్షేమంగానే ఉంటాను. మళ్లీ మనింటికి సురక్షితంగా తిరిగివస్తాను. మీరు భయపడొద్దు. 15 రోజులకు సరిపడా నిత్యావసరాలు కొన్నాను. మంచినీళ్లు.. అవసరమైన మిగతా సామగ్రి తెచ్చుకున్నాను. సైరన్ మోగితే బంకర్లలోకి వెళ్తాను. నేను సేఫ్‌గా ఉంటాను. మీరు టెన్షన్ పడొద్దు. ఇక్కడి అధికారులతో మాట్లాడాను. వీలైనంత త్వరగా మమ్మల్ని ఇండియాకి పంపిస్తామన్నారు." ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఓ విద్యార్థిని ఓవైపు.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ.. మరోవైపు భారత్‌లో ఉన్న తన తల్లిదండ్రులకు ధైర్యం చెబుతోంది. దాదాపు అక్కడ చిక్కుకుపోయిన వారందరి పరిస్థితి ఇదే. ఓ వైపు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తూ.. మరోవైపు తమకేం కాదని కన్నవాళ్లకు భరోసానిస్తున్నారు. గంటగంటకు ఫోన్ చేస్తూ తమ క్షేమసమాచారాలు అందిస్తున్నారు.

Telugu Students in Ukraine
Telugu Students in Ukraine

Telugu Students in Ukraine : సైరన్‌... బాంబుల మోతతో మా ప్రాంతం దద్దరిల్లుతోంది. ఎమర్జెన్సీ ప్రకటించగానే పదిహేను రోజులకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేశాం. అపార్ట్‌మెంట్‌లో కాలం వెళ్లదీస్తున్నాం.. అని రాగం మధుమిత్ర వాపోయారు. మెదక్‌ పట్టణంలోని జంబికుంటకు చెందిన రాగం శ్రీనివాస్‌, పద్మ దంపతుల రెండో కుమారుడు రాగం మధుమిత్ర బోగోమోలెట్స్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చివరి సంవత్సరం చదువుతున్నారు. కరీంనగర్‌కు చెందిన నిఖిల్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన రాజ్‌మోహన్‌తో కలిసి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. గతేడాది జూన్‌లో స్వదేశానికి వచ్చిన మధుమిత్ర సెప్టెంబరులో తిరిగి వెళ్లారు. రాకెట్లు మా ప్రాంతం నుంచి వెళ్తున్నాయని, బాంబుల మోత విన్పిస్తుందన్నారు. బంకర్‌లో తలదాచుకోవాలన్నా.. అవి చాలా దూరంలో ఉన్నాయని విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ తరచూ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్ఢి.. విద్యార్థి తండ్రికి ధైర్యం చెప్పారు.

కంట్రోల్‌రూం ఏర్పాటు..

Medak Students in Ukraine : జిల్లాకు చెందిన వ్యక్తులు ఉక్రెయిన్‌లో ఉంటే.. సమాచారాన్ని స్థానిక పోలీసుస్టేషన్‌ లేదంటే జిల్లా పోలీస్‌ కార్యాలయ కంట్రోల్‌రూంకు అందించాలని ఇన్‌ఛార్జి ఎస్పీ రమణకుమార్‌ కోరారు. 08452-223533, 221667 లేదా వాట్సాప్‌ నంబరు 73306-71900కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఉక్రెయిన్‌లో విద్యార్థులు.. కుటుంబీకుల ఆందోళన

దినేశ్

వికారాబాద్‌ :

Telangana Students in Ukraine : జిల్లా కేంద్రంలోని రామయ్యగూడకు చెందిన దినేష్‌ ఉక్రెయిన్‌లోని జాఫ్రోజియాలో వైద్య విద్య చివరి సంవత్సరం చదువుతున్నాడు. మే నెలలో తుది పరీక్షలు ఉండడంతో అక్కడే ఉండిపోయాడు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో రామయ్యగూడ ఎంఐజీలో ఉంటున్న తండ్రి రాంచంద్రయ్య, ఇతర కుటుంబ సభ్యులతో దినేష్‌ శుక్రవారం గంట గంటకూ వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాన్ని తెలుపుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భారత రాయబార కార్యాలయ అధికారుల సూచనల ప్రకారం ఇతర విద్యార్థులతో కలిసి ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

తాండూరు టౌన్‌ :

Russia Ukraine War : పట్టణానికి చెందిన నర్సింలు కుమారుడు సృజన్‌ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదవడానికి ఆరు నెలల క్రితం వెళ్లాడు. అక్కడి చర్చిల్‌ విల్‌ సిటీలోని విల్‌మెన్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఈ నెల 24న భారత్‌కు రావాల్సి ఉండగా యుద్ధం వల్ల అక్కడే చిక్కుకు పోయాడని వాపోయారు. అక్కడి విద్యార్థులను క్షేమంగా తీసుకు రావాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. చిన్న కొడుకు పృథ్వీరాజ్‌ జార్జియాలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరు కొడుకులు విదేశాల్లో ఉంటున్నారు.

సృజన్‌

సంగారెడ్డి అర్బన్‌ :

Russia Ukraine War News : సంగారెడ్డి పట్టణానికి చెందిన సాయి విశాల్‌ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ ప్రస్తుతం భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం సాయివిశాల్‌తో మాట్లాడామని, అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిపాడని ఆ విద్యార్థి తండ్రి రమేశ్‌ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్‌.. జిల్లా అధ్యక్షుడు పవన్‌తో కలిసి సాయివిశాల్‌ నివాసానికి వెళ్లి ధైర్య వచనాలు తెలిపారు.

క్షణక్షణం ఉత్కంఠగా..

మనాలి

Russia Ukraine War Updates : ఉక్రెయిన్‌పై బాంబుల దాడితో రష్యా విరుచుకుపడుతోంది. దీంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ వైద్యవిద్య అభ్యసించడానికి వెళ్లిన జిల్లా విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. వారి తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి స్థితిగతులపై ఆరా తీస్తూ ఆవేదనకు గురవుతున్నారు. గజ్వేల్‌ నియోజవర్గానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉక్రెయిన్‌లో అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన మరో ముగ్గురు చిక్కుకుపోయారు.

విశాల్‌కిరణ్‌

హుస్నాబాద్‌కు చెందిన తగరం లక్ష్మణ్‌, కవిత దంపతుల కుమార్తె మనాలి వైద్యవిద్య (రెండో సంవత్సరం) చదువుతోంది. మరో ముగ్గురు విద్యార్థినులతో కలసి ఉంటున్నారు. మనాలి.. తన తల్లిదండ్రులతో చరవాణి ద్వారా మాట్లాడారు. ఆహారానికి, తాగునీటి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గదుల్లో లైట్లు ఆఫ్‌ చేసి ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని, సైరన్‌ వినిపిస్తే బంకర్లలోకి వెళ్లాలని సూచించారన్నారు. శుక్రవారం తమకు భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిందని.. బస్సులో మరో ప్రాంతానికి తరలించి.. అక్కడ నుంచి స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారని లక్ష్మణ్‌ వివరించారు. గంటకోసారి కూతురితో మాట్లాడుతూ ధైర్యం చెబుతున్నామని పేర్కొన్నారు. మనాలి కుటుంబసభ్యులను పురపాలిక అధ్యక్షురాలు ఆకుల రజిత, ఉపాధ్యక్షురాలు అనిత, కౌన్సిలర్‌ భాగ్యారెడ్డి కలసి ధైర్యం చెప్పారు.

శ్రీశాంత్‌


రావడానికి సిద్ధమై..

కోహెడకు చెందిన పున్నం శ్రీశాంత్‌... వైద్య విద్య ప్రథమ సంవత్సరానికి సంబంధించి మూడు నెలల క్రితమే చేరారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన నలుగురితో కలసి హాస్టల్‌లో ఉంటున్నారు. ఈనెల 26న తిరిగి వచ్చేందుకు విమాన టికెట్‌ బుక్‌ చేశామని అతని తండ్రి రాజు తెలిపారు. ఇంతలో యుద్ధం మొదలైంది. తినడానికి సరైన ఆహారం, నీరు దొరకడం లేదన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే బంకర్లలోకి వెళ్లాలని చెబుతున్నారన్నారు.

హుస్నాబాద్‌కు చెందిన జనగాని తిరుపతి కుమారుడు విశాల్‌ కిరణ్‌ వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. శుక్రవారం ఉదయం వరకు క్షేమంగా ఉన్నట్లు చరవాణిలో మాట్లాడారని తిరుపతి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.