ETV Bharat / state

No Response For Vaccine: ఒకప్పుడు బారులు.. ఇప్పుడేమో పరుగులు

author img

By

Published : Oct 26, 2021, 5:17 AM IST

కరోనా టీకా తీసుకునేందుకు జనాలు ముందుకు రావడం లేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లినా స్పందన కరవవుతోందని చెబుతున్నారు. ప్రజలు ఏమాత్రం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీకా తీసుకోని వారి జాబితాలను ఆరోగ్యశాఖ సిద్ధం చేస్తోంది. వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయినప్పటికీ మహబూబ్​నగర్​ జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

people no response for to taken corona vaccine
మహబూబ్​నగర్​ జిల్లాలో మందకొడిగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్

కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు టీకాల కోసం బారులు తీరిన జనం ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి అభ్యర్థిస్తున్నా ముందుకు రావడం లేదు. ఇంటికి వెళ్తే ముఖం మీదే తలుపు వేస్తున్నారని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 శాతం మొదటి డోస్‌ పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న తీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.


కరోనా తీవ్రత అధికంగా ఉన్న రోజుల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. అందుబాటులో టీకా నిల్వలు లేక వచ్చిన జనాన్ని తిప్పి పంపిన రోజులున్నాయి. ప్రస్తుతం 100 శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నా జనం ముందుకు రావడం లేదు. అనారోగ్యం బారిన పడటం, టీకా పట్ల భయం, అవగాహనలేమి, అనాసక్తి వంటి కారణాలతో మొదటి డోసు తీసుకోని వారి సంఖ్య 30 శాతానికి పైగా ఉంది. ఇళ్లలోకి వెళ్తే కొందరు టీకా తీసుకునేదే లేదని తెగేసి చెబుతున్నారు. కొంతమంది ఇళ్లకు వెళ్తే ముఖం మీదే తలుపులు మూసేస్తున్నారు. తమ పరిధిలో ఒకటికి పదిసార్లు సర్వేలు చేసి అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండటం లేదని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు. 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సర్వేలు నిర్వహించి తాము అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1684 గ్రామాలకు గానూ 900 కి పైగా పల్లెల్లో 100 శాతం వాక్సినేషన్ పూర్తైనట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. పురపాలికల్లో మాత్రం ఆ లక్ష్యం పూర్తికాలేదు. మొదటి డోసు తీసుకున్న వాళ్లు 65 శాతం ఉండగా, వారిలో రెండో డోసు కేవలం 15 శాతం మంది మాత్రమే తీసుకున్నారు. టీకా తీసుకోబోమని తేల్చి చెప్పే వారి జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని అధికారులు శ్రమిస్తున్నారు. సరిపడా టీకాలు ఉన్నా జనం ఆసక్తి కనబర్చడం లేదని వైద్యులు తెలిపారు. వైరస్‌ను పూర్తిగా జయించాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఇదీ చూడండి:

corona vaccine: వేళకు రెండో డోసు తీసుకుంటేనే యాంటీబాడీలు: డీహెచ్‌

Covid Vaccine 2nd Dose: 'నిర్లక్ష్యం వద్దు.. ఆలస్యమైనా టీకా తీసుకోవడమే మేలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.