ETV Bharat / state

గిరిజన హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుల విద్యార్హతల్లో మార్పులు.. ఆందోళనలో ఆ అభ్యర్థులు..!

author img

By

Published : Dec 26, 2022, 10:35 AM IST

Unemployed are worried
Unemployed are worried

గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్​ పోస్టులకు నోటిఫికేషన్​తో టీఎస్​పీఎస్సీ ఇటీవల ఓ శుభవార్త చెప్పింది. దీంతో చాలా మంది ఎగిరిగంతేశారు. అయితే వారి సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. నోటిఫికేషన్​కు సంబంధించి అర్హత విషయంలో మార్పు చేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది.

రాష్ట్రంలో గిరిజన సంక్షేమ వసతి గృహాల వార్డెన్‌ పోస్టుల అర్హతల్లో మార్పులతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. నాలుగేళ్ల క్రితం జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న అర్హతలకు, 2022లో ఇచ్చిన ప్రకటనలో సూచించిన అర్హతల్లో పలు మార్పులు చేయడంతో దాదాపు పెద్దసంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. విద్యార్హతల్లో మార్పుల విషయాన్ని గిరిజన సంక్షేమశాఖ ముందస్తుగా స్పష్టం చేయకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

విద్యార్హతల్లో స్పష్టత లేకపోవడంతో 106 గిరిజన సంక్షేమ వసతి గృహ అధికారుల గ్రేడ్‌-2 పోస్టులకు అభ్యర్థులు పోటీపడే అర్హత కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో 581 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరని తెలిపింది. దివ్యాంగుల శాఖలో కొన్ని ఉద్యోగాలకు డీఈడీ అర్హత అని పేర్కొంది. ఈ మేరకు పది కేటగిరీల ఉద్యోగాల వారీగా విద్యార్హతలను కమిషన్‌ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

అయితే గిరిజన సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 వార్డెన్‌ పోస్టుల విద్యార్హతలపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018లో గిరిజన సంక్షేమశాఖ జీవో నంబరు 45 (28-06-2011) ప్రకారం గ్రేడ్‌-2 వార్డెన్‌ పోస్టులకు డిగ్రీతో పాటు డీఈడీ లేదా బీఈడీ అర్హతగా అప్పట్లో కమిషన్‌ పేర్కొంది. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో డిగ్రీతో పాటు బీఈడీ తప్పనిసరి ఉండాలని అర్హతగా పేర్కొనడంతో ఈ పోస్టులకు డీఈడీ చేసిన అభ్యర్థులు అనర్హులవుతున్నారని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. విద్యార్హతల్ని సవరించి అందరికీ అవకాశమివ్వాలని టీఎస్‌పీఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖను అభ్యర్థిస్తున్నారు.

సర్వీసు నిబంధనల్లో మార్పులు...!: గిరిజన సంక్షేమశాఖ గ్రేడ్‌-2 వార్డెన్‌ పోస్టులకు డిగ్రీతో పాటు డీఈడీ లేదా బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులని గతంలో ఉండేది. కానీ ఎస్సీ, బీసీ సంక్షేమశాఖల్లో బీఈడీ తప్పనిసరిగా సర్వీసు నిబంధనలు ఉన్నాయి. ఒక్క గిరిజన సంక్షేమశాఖలో సర్వీసు నిబంధనల్లో అర్హతలు వేరుగా ఉండటంతో నియామక ప్రక్రియలో ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ పూర్తిచేయడానికి మరింత సమయం పడుతుందని భావించి అన్ని సంక్షేమశాఖలకు ఒకేతరహాలో విద్యార్హతలు ఉండాలని సంక్షేమశాఖలు నిర్ణయించాయి. ఇదే సమయంలో ఒక న్యాయవివాదంలో కోర్పుతీర్పు మేరకు అందరికీ ఒకేవిధమైన విద్యార్హతలు అమలు చేసేలా గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల సర్వీసు నిబంధనల్లో మార్పులు చేసినట్లు గిరిజన సంక్షేమ వర్గాలు వెల్లడించాయి.

"గిరిజన సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 వార్డెన్‌ పోస్టులకు ప్రభుత్వం అర్హతలు మార్చడం సరికాదు. మొత్తం 106 పోస్టులకు డీఈడీ అభ్యర్థులు పోటీపడేలా అవకాశమివ్వాలి. ఈ మేరకు అర్హతలపై ప్రభుత్వం పునఃసమీక్ష నిర్వహించి అర్హులందరికీ న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలి."-రామ్మోహన్‌రెడ్డి, బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.