ఎదురుచూపులు 'డబుల్‌'.. నిర్మాణాలు పూర్తయినా అందని ద్రాక్షగానే..!

author img

By

Published : Dec 26, 2022, 7:55 AM IST

double bedroom houses

Delay In Double Bedroom Houses Distribution : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్ రూం ఇళ్లు పేదలకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఇళ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా.. అర్హుల ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లు 1.18 లక్షలు కాగా.. అందులో లబ్ధిదారులకు 17.7 శాతమే అప్పగించారు. మరికొన్ని చోట్ల పనులు పూర్తయినా ఏడాది నుంచి మూడేళ్లుగా నిరీక్షిస్తున్నవారు ఎందరో ఉన్నారు.

Delay In Double Bedroom Houses Distribution : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జీ+3 విధానంలో 544 ఇళ్లు కట్టారు. నిర్మాణం పూర్తయి మూడున్నర ఏళ్లవుతోంది. అర్హుల ఎంపిక మాత్రం పూర్తికాలేదు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతున్నా తీవ్ర జాప్యం అవుతోంది. పలుచోట్ల ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది. ఏడాది మొదలు మూడేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నవారు ఎందరో!

ప్రభుత్వం ఉచితంగా కట్టించి ఇచ్చే డబుల్‌ బెడ్ రూం ఇళ్లపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంజూరుచేసినవే తక్కువ కాగా అందులో అసలు మొదలుపెట్టనివి పెద్దసంఖ్యలో ఉన్నాయి. మొదలుపెట్టిన వాటిలోనూ పనులు బాగా ఆలస్యంగా జరుగుతున్నాయి. నిర్మాణం పూర్తయిన వాటిని కూడా చాలాచోట్ల అర్హులకు అప్పగించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లు 1.18 లక్షల్లో 17.7శాతమే లబ్ధిదారులకు అప్పగించారు. 90 శాతానికిపైగా పూర్తయిన వాటికి మిగిలిన కొద్ది పనులూ పూర్తిచేస్తే మొత్తంగా కలిపి 1,66,762 ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికీ 97,708 ఇళ్లకు అర్హుల ఎంపిక జరగలేదు.

..

ముందున్న సిద్దిపేట: పట్టణ విభాగంలో చూస్తే సిరిసిల్లలో అప్పగించిన ఇళ్లు కేవలం ఆరే. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే రంగారెడ్డిలో అత్యల్పంగా 80 మందికే ఇచ్చారు. పట్టణాలు, గ్రామీణం... ఈ రెండు విభాగాల్లోనూ అత్యధికంగా ఇళ్లు అప్పగించడంలో సిద్దిపేట ముందుంది. పట్టణ విభాగంలో 2,547.. గ్రామీణ విభాగంలో 1,853 ఇళ్లను అర్హులకు అప్పగించారు.

..

గ్రామీణంలో జిల్లాల వారీగా ఇచ్చిన ఇళ్లు: సిద్దిపేట 1,853, ఖమ్మం 1,570, కొత్తగూడెం 1,365, సంగారెడ్డి 1,228, మహబూబాబాద్‌ 986, కామారెడ్డి 651, జగిత్యాల 593, సిరిసిల్ల 533, వరంగల్‌ 390, కరీంనగర్‌ 388, వనపర్తి 383, ములుగు 323, నిర్మల్‌ 295, హనుమకొండ 224, సూర్యాపేట 222, జనగామ 219, నిజామాబాద్‌ 207, నల్గొండ 155, మెదక్‌ 128, రంగారెడ్డి 80.

నగర, పట్టణాల్లో ఇచ్చినవి: సిద్దిపేట 2,547, ఖమ్మం 1,636, మహబూబ్‌నగర్‌ 741, వనపర్తి 199, జనగామ 195,సూర్యాపేట 192, వరంగల్‌ 182, జగిత్యాలలో 169, కొత్తగూడెం 80, సంగారెడ్డి 33, మంచిర్యాల 30, సిరిసిల్ల 6.

..

డబ్బుల వసూలు.. ఫిర్యాదులు.. కేసులు

* ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 20,123 ఇళ్లు మంజూరయితే నిర్మాణం పూర్తయిన వాటి సంఖ్య 7,800. అందులో లబ్ధిదారులకు ఇచ్చినవి రెండు వేలు మాత్రమే. జిల్లా కేంద్రం శివారులోని దివిటిపల్లిలో 1,024 ఇళ్లను నిర్మించారు. గతేడాది జూన్‌ 22న మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ ఈ ఇళ్లను ప్రారంభించారు. వంద మందికే ఇళ్ల పట్టాలిచ్చారు. మిగతా ఇళ్లను త్వరలోనే అప్పగిస్తామని ప్రకటించి ఏడాదిన్నర అవుతోంది. ఎంపిక అధికారికంగా చేపట్టలేదు. దరఖాస్తుదారులు ఎక్కువమంది ఉన్నప్పుడు లక్కీడిప్‌ తీసి ఎంపిక చేయాలి. కానీ, రాజకీయనేతల ఒత్తిడితో ఇప్పటికే ఇక్కడ సుమారు 600 మందికి లోపాయికారీగా కేటాయించారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఎంతమందికి కేటాయించారనే వివరాలను రెవెన్యూ అధికారులు చెప్పట్లేదు. ఇటీవల ఇక్కడ ఇళ్లు ఇప్పిస్తామని పలువురు డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.

* గద్వాల మండలం గోన్‌పాడు, పర్మాల శివారులో 1,275 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి రెండున్నరేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. కిటికీలు ధ్వంసం అవుతున్నాయి. పరిసరాల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. కొన్నిచోట్ల పగుళ్లు వచ్చాయి. అర్హుల సంఖ్య అధికంగా ఉండడంతో కేటాయించడంలో ఆలస్యం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల జోక్యంతోనే ఎంపిక ఆగిపోయినట్లు సమాచారం.

* సిరిసిల్ల పట్టణ ప్రజలకు తంగళపల్లి మండలంలో 1,800 ఇళ్లు కట్టించి అర్హుల్ని ఎంపికచేస్తే స్థానిక ప్రజాప్రతినిధులపై డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విడతలవారీగా లబ్ధిదారుల్ని ఎంపికచేస్తున్నారు. రెండు విడతలు పూర్తయి..మూడో విడత నడుస్తోంది.

ఎందుకు ఈ పరిస్థితి?: కట్టిన, కడుతున్న ఇళ్ల కంటే వచ్చిన దరఖాస్తులు అనేక రెట్లు ఎక్కువ ఉన్నాయి. అన్నీ పంపిణీ చేస్తే రానివారి నుంచి అసంతృప్తి, వ్యతిరేకత వంటి సమస్యలు ఉంటాయని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగానే పంపిణీ చేయిస్తున్నారు.

200 రోజులుగా ఆందోళన: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో ఏడాది క్రితమే 72 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారిలో 26 మందికి, ఇళ్లు లేని 46 మందికి కేటాయించారు. గ్రామంలో ఇళ్లు లేని కుటుంబాలు మరో 86 ఉన్నట్లు సర్వేలో తేలింది. వారంతా తమకూ ఇళ్లు కట్టించి ఇవ్వాలని 200 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో అధికారులు ఇళ్ల పంపిణీని నిలిపివేశారు. ఇళ్ల కిటికీల అద్దాలను ఆకతాయిలు పగలగొట్టారు. ఎవరో డ్రెయినేజీ, తాగునీటి పైపులైన్లను కూడా ధ్వంసం చేశారు. చీకటిపడితే మద్యం బాబులకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

* ఇదే జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్‌లో 50 ఇళ్ల నిర్మాణం పూర్తయి ఏడాది దాటింది. విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చాక అర్హులను ఎంపిక చేస్తామంటున్నారు అధికారులు. ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తే కనెక్షన్‌ ఇస్తామంటోంది విద్యుత్తు శాఖ.

అత్యధికంగా ఇక్కడే: పలుజిల్లాల్లో అత్యధిక ఇళ్ల నిర్మాణం పూర్తయినా అప్పగించకుండా అలాగే ఉన్నాయి. అందులో సిద్దిపేటలో 5,869, సిరిసిల్లలో 3,334, కామారెడ్డిలో 2,795, ఖమ్మంలో 2,145 ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో వీటి సంఖ్య 53,671.

..

ఇవీ చదవండి: టీ కాంగ్రెస్​లో ఏడాదిన్నరగా ఎవరికి వారే.. సిద్ధమైన దిగ్విజయ్​సింగ్​ నివేదిక

'అగ్నివీర్' అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రారంభం.. 2,850 మందికి ఆరు నెలల శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.