ETV Bharat / state

బీ అలర్ట్​... అక్కడ పతంగులు ఎగిరేస్తే జైలుకేనట!

author img

By

Published : Jan 13, 2023, 10:49 AM IST

Flying Kites In Hyderabad: పతంగుల పండగ రానే వచ్చింది. చిన్నాపెద్దా అంతా కలసి ఎంతో ఉత్సాహంగా జరుపునే పండగ ఈ సంక్రాంతి.. అందులోనూ గాలిపటాలను ఎగరేయడం అంతే మరీ ఇష్టపడతారు. అయితే ఈసారి మాత్రం గాలిపటాల ఎగరవేతను నగరంలోని కొన్ని ప్రదేశాల్లో నిషేధించారు.

Etv Bharat
Etv Bharat

Prohibition Of Flying Kites In Special Places In Hyderabad: సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 14, 15 తేదీల్లో ప్రార్థన స్థలాల చుట్టుపక్కల ప్రాంతాలు, రహదారులపై గాలిపటాలు ఎగరేయడం నిషేధమని హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. శాంతి భద్రతలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల అనుమతి లేకుండా డీజేలు, లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించొద్దని ఆదేశించారు.

భోగి మంటల కోసం బలవంతంగా కలపను సేకరించొద్దని, యజమానుల అంగీకారంతోనే తీసుకోవాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ ఉదయం 6 వరకూ తామిచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్‌ పోలీసు చట్టం ప్రకారం చర్యలుంటాయని నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులోని వివరాలివీ..!

అమల్లో ఉండే నిబంధనలు:

  • బహిరంగ ప్రదేశాల్లో రెచ్చగొట్టే ఉపన్యాసాలు, సంగీతంపై నిషేధం.
  • బహిరంగ సమావేశాల్లో వక్తలు, ఇతర మైకుల శబ్దాలు పరిమితి దాటొద్దు. వాణిజ్య ప్రాంతాల్లో ఉదయం 65, రాత్రి 55 డెసిబుల్స్‌ దాటొద్దు.
  • నివాస ప్రాంతాల్లో ఉదయం 55, రాత్రి 45 డెసిబుల్స్‌ దాటొద్దు.
  • సున్నిత ప్రాంతాల్లో ఉదయం 50, రాత్రి 40 డెసిబుల్స్‌ మించొద్దు.
  • సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ రెండు రోజులు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు అనుమతించబోం.
  • ప్రహరీ లేని మేడలపై చిన్నారులు పతంగులు ఎగరేయకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి.
  • తెగిన గాలిపటాల కోసం చిన్నారులు రహదారులు, ఇతర ప్రాంతాల్లో పరుగెత్తకుండా.. విద్యుత్‌ స్తంభాలకు వేలాడే వాటిని తీసుకోకుండా అవగాహన కల్పించాలి.

చైనా మాంజాలపై నిషేధం: సంక్రాంతి పండగ వచ్చిందంటే అంటే చాలు చిన్నాపెద్దా అందరూ రంగురంగుల పతంగులను ఎగరవేయడానికి ఇష్టపడతారు. పోటాపోటీగా గాలిపటాలను ఎగరవేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడతారు. అయితే ఈ గాలి పటాలకు ఉపయోగించే మాంజాపై అప్రమత్తంగా ఉండాలంటోంది అటవీ శాఖ. ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగించే.. సింథటిక్‌ చైనీస్‌ మాంజా వల్ల మానవులకు, మూగజీవులకు, పక్షులకు హాని కలుగుతుందని వాటిని వాడవద్దని అధికారులు సూచిస్తున్నారు. చైనా మాంజాల వాడకాన్ని జాతీయహరిత ట్రైబ్యునల్​ ఉత్తర్వుల- 2016 ప్రకారం నిషేధించామని.. వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

చైనా మాంజా విక్రయిస్తే ఐదేళ్ల ఖైదు, లక్ష జరిమానా ఉందని తెలిపారు. మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష రూ.10 వేల జరిమానా విధిస్తారని అధికారులు తెలిపారు. ఎవరైనా ఈ మాంజాను ఉపయోగిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 040 -23231440, 1800 4255 364 లకు ఫోన్​ చేసి తెలియజేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.