ETV Bharat / state

China Loan Apps: రూ.173 కోట్ల పెట్టుబడి.. రూ.11,717 కోట్ల దోపిడీ

author img

By

Published : Mar 2, 2022, 10:31 AM IST

China Loan Apps: ఆన్​లైన్​ యాప్​ల ద్వారా రుణాలు మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న చైనా ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడాదిలోనే వేలాది కోట్లను కొల్లగొట్టి దొడ్డిదారిలో విదేశాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. రూ.173 కోట్ల పెట్టుబడితో వేధింపులే లక్ష్యంగా సాగిన చైనా రుణ యాప్‌ సంస్థల నిర్వాహకులు మాత్రం ఏకంగా రూ.11,717 కోట్లు ఆర్జించారు. ఆ సొమ్ముల్ని దొడ్డిదారిలో చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, సింగపూర్‌ తదితర విదేశాలకు తరలించినట్టు ఈడీ తాజాగా గుర్తించింది. అప్పుల మంజూరు, వసూళ్లలో రుణ సంస్థలు అనేక దారుణాలకు పాల్పడినట్టు తేల్చింది.

China Loan Apps: రూ.173 కోట్ల పెట్టుబడి.. రూ.11,717 కోట్ల దోపిడీ
China Loan Apps: రూ.173 కోట్ల పెట్టుబడి.. రూ.11,717 కోట్ల దోపిడీ

China Loan Apps: రూ.173 కోట్ల పెట్టుబడితో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తే ఏడాదిలో ఎంత సంపాదించొచ్చు? బారువడ్డీ, చక్రవడ్డీ వేసినా దాదాపు రెట్టింపు చేసుకోవచ్చు. వేధింపులే లక్ష్యంగా సాగిన చైనా రుణ యాప్‌ సంస్థల నిర్వాహకులు మాత్రం ఏకంగా రూ.11,717 కోట్లు ఆర్జించారు. ముంబయికి చెందిన నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ పీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(పీసీఎఫ్‌ఎస్‌) పేరిట ఆర్‌బీఐ జారీచేసిన లైసెన్స్‌ను అడ్డం పెట్టుకొని యాప్‌ ద్వారా చైనా సంస్థ సాగించిన మాయాజాలమిది. పీసీఎఫ్‌ఎస్‌లోకి అడ్డదారిలో విదేశీ పెట్టుబడుల్ని రప్పించి మరీ ఆ మేరకు కొల్లగొట్టినట్టు, ఆ సొమ్ముల్ని మళ్లీ దొడ్డిదారిలో చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, సింగపూర్‌ తదితర విదేశాలకు తరలించినట్టు ఈడీ తాజాగా గుర్తించింది. అప్పుల మంజూరు, వసూళ్లలో రుణ సంస్థలు అనేక దారుణాలకు పాల్పడినట్టు తేల్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు..

అప్పులో 15-25 శాతం ప్రాసెసింగ్‌ రుసుం

Loan Apps : క్యాష్‌బీన్‌ యాప్‌ ద్వారా రుణాలు మంజూరు వ్యవహారం నడిచింది. రుణ సంస్థల ప్రతినిధులు ఈ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరించి రుణాలు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో దరఖాస్తుదారులకు తెలియకుండానే వారి ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవారు. రుణ మంజూరు మొత్తం నుంచి 15-25 శాతం వరకు ప్రాసెసింగ్‌ రుసుం పేరిట ముందస్తుగానే తీసుకునేవారు. మంజూరు చేసిన రుణం చెల్లింపునకు కొన్ని సందర్భాల్లో రెండు వారాల వ్యవధినే గడువుగా విధించారు. కట్టలేని పక్షంలో ఏడాదికి 1500-2000 శాతం వడ్డీ వేశారు. అంతమొత్తం కట్టలేని వారిపై వేధింపులకు పాల్పడ్డారు. అప్పటికే సేకరించుకున్న నంబర్ల ద్వారా రుణ గ్రహీతల సంబంధీకులకు ఫోన్లుచేసి హేళనగా మాట్లాడుతూ వేధించేవారు. దాని కోసమే ఏకంగా కాల్‌సెంటర్లనూ ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏడాదిలోనే రూ.11,717 కోట్లు కొల్లగొట్టారు.

బోగస్‌ ఎయిర్‌వే బిల్లులతో విదేశాలకు..

Loan Apps Scams : ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్మును విదేశాలకు తరలించేందుకు రుణ సంస్థలు కుయుక్తులు పన్నాయని, బోగస్‌ ఎయిర్‌వే బిల్లులతోపాటు కల్పితమైన క్లౌడ్‌ సీసీటీవీ స్టోరేజీ అద్దె ఛార్జీ పత్రాలను సృష్టించాయని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ముంబయిలోని ఎస్‌బీఐ, ఎస్‌బీఎంలకు చెందిన కొన్ని ఎంపిక చేసిన శాఖల ద్వారా సొమ్మును విదేశాలకు తరలించినట్లు తేలింది. విదేశీ ఎగుమతులకు సంబంధించిన సరైన ఆధారాల్లేకుండానే డొల్ల కంపెనీలకు చెందిన 621 బోగస్‌ ఫామ్‌-15సీబీ పత్రాలను సృష్టించినట్లు బహిర్గతమైంది. విదేశాల నుంచి సాఫ్ట్‌వేర్లను దిగుమతి చేసినట్లుగా చూపి అందుకోసం చెల్లింపుల పేరిట సొమ్మును చైనా సహా పలు దేశాలకు తరలించారని దర్యాప్తు సంస్థ తేల్చింది.
సూత్రధారి చైనాలో బిగ్‌షాట్‌

చైనా రుణ యాప్‌ సంస్థలకు సూత్రధారి ‘జౌయాహుయి’ అని ఈడీ గుర్తించింది. ఇతను చైనాలో ప్రముఖ వ్యాపార వేత్త. ఆ దేశంలోనే పెద్ద వెబ్‌గేమ్‌ డెవలపర్‌ సంస్థ కున్‌లున్‌ టెక్‌ కంపెనీ అధిపతి కూడా. ఇతడు ఛైర్మన్‌గా ఉన్న గ్రూపులోకే రుణ యాప్‌ల సొమ్ము చేరినట్లు దర్యాప్తు క్రమంలో ఈడీ నిర్ధారణకు వచ్చింది. అతనికి 2.2 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల నికర విలువ గల ఆస్తులున్నట్లు సమాచారం సేకరించింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.

కొత్త పేర్లతో మాయ

వ్యక్తిగత పూచీకత్తు లేకుండా రుణాలిస్తున్న చైనా రుణ సంస్థలు బాధితుల నుంచి 70 శాతం వడ్డీ వసూలు చేసుకుని యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లోంచి తొలగిస్తున్నాయి. రుణం తీసుకున్న వారిపై వేర్వేరు రూపాల్లో వేధింపులు కొనసాగిస్తున్నాయి. ఒక్క తెలంగాణలోనే రెండు నెలల్లో రూ.300 కోట్లకుపైగా కొల్లగొట్టాయి. ఒక యాప్‌ను గుర్తించేలోపే మరో యాప్‌తో ప్రచారం చేస్తూ ఎరవేస్తున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు పెరుగుతుండడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా సంస్థలు ఉపయోగించిన యాప్‌ల వివరాలు ఇవ్వాలంటూ గూగుల్‌ సంస్థకు ఇటీవలే లేఖలు రాశారు. క్యాష్‌ బీయింగ్‌, ఈజీలోన్‌, లక్కీరుపీ, ఇన్ఫినిటీ క్యాష్‌, మినిట్‌ క్యాష్‌ వంటి 150 కొత్తయాప్‌లను గుర్తించామని, మొత్తం ఎన్ని ఉన్నాయో తెలపాలని ఆ లేఖలో కోరారు.

ఒక అప్పు..దాన్ని తీర్చాలంటూ మరో అప్పు

‘సులభంగా రుణాలిస్తామంటూ సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చైనీయులు ప్రచారం చేస్తున్నారు. రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ ఇస్తామని..15 నుంచి 21 రోజుల్లోపు రుణం పూర్తిగా చెల్లించాలంటూ షరతులు విధిస్తున్నారు. అప్పు తీర్చడం ఆలస్యమైతే..వారికి మరికొన్ని యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తూ మొదటిసారి ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. అలా బాధితులను రుణ ఊబిలోకి నెట్టేస్తున్నారు. వాటిని చెల్లించాలంటూ పదేపదే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. బాధితుల్లో యువకులు, మహిళలున్నట్టయితే వారి తాలూకూ మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపుతున్నారు. వాటి కింద అసభ్య రాతలు రాస్తున్నారు’ అని పోలీసులు తెలిపారు. అలాంటి యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.