ETV Bharat / state

‍‌స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం: సీఎం

author img

By

Published : Mar 12, 2021, 6:38 PM IST

‍‌స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం: సీఎం
‍‌స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం: సీఎం

‍‌స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణను సాకారం చేసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌ వేదికగా రాష్ట్రంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌' వేడుకలకు సీఎం అంకుర్పారణ చేశారు. జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశభక్తిని పెంపొందించేలా వివిధస్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

‍‌స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం: సీఎం

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022 ఆగస్టు 15 నాటికి.. 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్​ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రత్యేక పోలీసుదళం కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్, హైదరాబాద్ సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్ దళాలు గౌరవ వందనం సమర్పించాయి.

గాంధీ ఉద్యమ స్ఫూర్తి మననం...

పబ్లిక్ గార్డెన్స్ వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్య్ర ఉద్యమానిది మహోన్నత ఘట్టమని వ్యాఖ్యానించారు. ఉప్పు సత్యాగ్రహం.. దేశాన్ని ఏకం చేసిందన్న సీఎం.. గాంధీతోపాటు హైదరాబాద్‌ ముద్దుబిడ్డ సరోజినీనాయుడు దండియాత్రలో పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించే సమయంలో గాంధీ ఉద్యమ స్ఫూర్తిని మననం చేసుకున్ననట్లు కేసీఆర్ తెలిపారు. నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా స్వాతంత్య్ర ఉద్యమ పంథాలో రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నట్లు వివరించారు.

75 వారాల పాటు...

రాష్ట్రవ్యాప్తంగా 75 వారాల పాటు అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు నిర్వహిస్తామని... ఇందుకు ఇప్పటికే రూ.25 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. రమణచారి నేతృత్వంలోని కమిటీ వేడుకలను నిర్వహిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలను ప్రారంభించిన సందర్బంగా మూడు రంగుల గాలిబుడగలను ముఖ్యమంత్రి ఆకాశంలోకి వదిలారు.


ఇదీ చూడండి: ' 'వోకల్​ ఫర్​ లోకల్'​తో స్వాతంత్ర్య యోధులకు ఘన నివాళి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.