ETV Bharat / state

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిద్దాం.. ఎంపీలకు కేసీఆర్​ దిశానిర్దేశం

author img

By

Published : Jan 31, 2022, 3:54 AM IST

TRSPP Meeting: "దేశంపై తమ గుత్తాధిపత్యం కోసం భాజపా ప్రయత్నిస్తోంది. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటోంది. రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. పన్నుల వాటాలోనూ రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది. సెస్సుల రూపంలో రాష్ట్రాలకు నిధులు రాకుండా అడ్డుకుంటోంది. భాజపా రాష్ట్రాల గురించి ఆలోచించకుండా ఏక్షపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సమాఖ్య, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. దీనికి తగిన ఫలితం అనుభవిస్తుంది. అయిదు రాష్ట్రాల ఎన్నికలతో ఆ పార్టీకి పతనం ప్రారంభమవుతుంది."  - సీఎం కేసీఆర్‌

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిద్దాం.. ఎంపీలకు కేసీఆర్​ దిశానిర్దేశం
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిద్దాం.. ఎంపీలకు కేసీఆర్​ దిశానిర్దేశం

TRSPP Meeting: కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తెరాస నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాల్లో తెరాస సత్తా చూపాలని, దేంట్లోనూ వెనక్కి తగ్గకూడదని, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా.. బయటా గట్టిగా పోరాడాలని, బలమైన వాణి వినిపించాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సుమారు అయిదున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. భాజపాతో ఇక యుద్ధమేనని, అమీతుమీ తేల్చుకుందామని ఈ సందర్భంగా సీఎం వారికి చెప్పారు. తెరాస ధర్నాలతో పార్లమెంటుతో పాటు దేశం మొత్తం దద్దరిల్లాలన్నారు. పట్టుపడితే తానేమి చేస్తానో, తన బలమేమిటో ప్రధానమంత్రి మోదీకి తెలుసని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం తీవ్ర ఒత్తిడి తేవాలన్నారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడున్నరేళ్లుగా తెలంగాణకు చేసిందేమీ లేదని, రాష్ట్రంపై కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందని, విభజన హామీలను పూర్తిగా విస్మరించిందని కేసీఆర్‌ విమర్శించారు.

ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి కేంద్ర ప్రభుత్వం ఉండడం దురదృష్టకరం. గత ఏడున్నర సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్‌ సమయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతున్నా ఏం మాత్రం పట్టింపు లేదు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలోని ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నా మొండిచేయి చూపింది. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది. కేంద్రం, ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగా షెడ్యూల్‌ 9,10లోని ప్రభుత్వ సంస్థల విభజన ఇంకా అసంపూర్తిగానే ఉంది. రాష్ట్రంలో శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా కేంద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లలో ఒక ఏడాది బకాయిలు ఇంకా ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ప్రతిపాదించిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌.ఐ.డి.)ను రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు. రాష్ట్రానికి ఒక్క వైద్యకళాశాల కూడా మంజూరు చేయలేదు. రాష్ట్రంలోని గిరిజనులు, ముస్లింల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ కోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా స్పందన లేదు. ధాన్యం సేకరణకు సంబంధించి యాసంగిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల విషయంలోనూ నిబంధనలను సవరించి, రాష్ట్రాల పాలనలో జోక్యానికి పూనుకుంది. దేశాన్ని పాలించేది ఇలాగేనా? భాజపా ప్రభుత్వంపై వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఉంది. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అది ప్రస్ఫుటమవుతుంది. ఆ పార్టీ ఓటమిపై ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. -సీఎం కేసీఆర్​

బడ్జెట్‌పై ఆశల్లేవు

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా తెరాస పోరాటాలకు ప్రజల నుంచి, వివిధ పార్టీల నుంచి స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో తెరాస ఎంపీలు కేంద్రాన్ని గట్టిగా నిలదీశారన్న సీఎం... ఇదే స్ఫూర్తి కొనసాగాలన్నారు. కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై రాష్ట్రానికి పెద్దగా ఆశలు లేవన్నారు. ఆ పార్టీ తమకు ప్రయోజనాలున్న రాష్ట్రాలకే పెద్దపీట వేస్తుందన్న ఆయన.. బడ్జెట్‌ కేటాయింపుల్లో అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామానాగేశ్వరరావు, ఎంపీలు లక్ష్మీకాంతరావు, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, గడ్డం రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, పోతుగంటి రాములు, బడుగుల లింగయ్య, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, బొర్లకుంట వెంకటేశ్‌ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హన్మంతు షిండే, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

పొగడ్తలు తప్ప ఏమీ ఉండదు..

"పార్లమెంటు సమావేశాల్లో తొలిరోజే బహిష్కరణ ద్వారా మన వైఖరి తెలియజేద్దాం. రాష్ట్రపతి ప్రసంగంలో పొగడ్తలు తప్ప ఏమీ ఉండదు. దాంతో ఒరిగేదేమీ లేదు. తెరాస ఆందోళనలకు ఇతర పార్టీల మద్దతు తీసుకుందాం. భాజపా రాష్ట్ర నాయకుల ధోరణి దారుణంగా ఉంది. తెలంగాణకు మేలు చేద్దామని వారికేమాత్రం లేదు. అవసరం లేని విషయాల్లో రాద్ధాంతం చేస్తున్నారు. ప్రజలు వారి వైఖరిని అసహ్యించుకున్నారు. పార్లమెంటులోనే గాక వివిధ సమావేశాల్లో తెరాస సభ్యుల ప్రసంగాలు, ఆందోళన కార్యక్రమాలపై విస్తృతస్థాయి ప్రచారం చేయాలి. దీనికి సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలి." -సీఎం కేసీఆర్​

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.