ETV Bharat / state

BRS: తెలంగాణ భవన్‌లో బీఆర్​ఎస్ ఆవిర్భావ వేడుకలు.. పలు తీర్మానాలకు ఆమోదం

author img

By

Published : Apr 27, 2023, 1:41 PM IST

Updated : Apr 27, 2023, 8:01 PM IST

BRS
BRS

BRS Formation Day Celebrations in Hyderabad: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించి.. సుదీర్ఘ పోరాటం అనంతరం గమ్యాన్ని ముద్దాడిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇటీవల భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని మరో వసంతంలోకి అడుగుపెట్టింది. బీఆర్ఎస్​గా మారిన తర్వాత తొలిసారి జరుపుకుంటున్న ఆవిర్భావ వేడుకను ఆ పార్టీ నాయకత్వం ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంపై అధినేత గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం.. పార్టీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి హాజరైన కేసీఆర్.. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ అంశాలపై చర్చిస్తున్నారు.

తెలంగాణ భవన్‌లో బీఆర్​ఎస్ సర్వసభ్య సమావేశం

BRS Formation Day Celebrations in Hyderabad: ఏటా పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ప్లీనరీ, సభ నిర్వహించే బీఆర్​ఎస్... ఈ ఏడాది భిన్నంగా జరుపుకుంది. వేడుకల్లో భాగంగానే ఇప్పటికే విస్తృత ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన గులాబీ దళం... ఈ నెల 25న నియోజకవర్గాల స్థాయిలో పార్టీ మినీ ప్లీనరీలను నిర్వహించారు. ఏటా నిర్వహించే ప్లీనరీకి బదులుగా అక్టోబరు 10న వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరగనుండగా... ఆవిర్భావం దినోత్సవాన్నితెలంగాణ భవన్‌లోనే ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముందుగా తెలంగాణ తల్లికి, ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూల మాల వేసిన అధినేత, సీఎం కేసీఆర్... ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అమరవీరులకు నివాళి అర్పించారు.

బీఆర్​ఎస్​గా మారిన తర్వాత తొలి సర్వసభ్య సమావేశం: అనంతరం, బీఆర్​ఎస్ కార్యాలయంపై గులాబీ జెండాను ఎగురవేశారు. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎమ్​ఎస్ ఛైర్‌పర్సన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఎదిగిన టీఆర్​ఎస్.. నేడు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశలో జాతీయ పార్టీగా బీఆర్​ఎస్ ఎదిగిన క్రమాన్ని అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.

పలు తీర్మానాలు ప్రవేశపెట్టిన కేటీఆర్: అనంతరం బీఆర్​ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. దేశంలో రైతు రాజ్యం స్థాపించి... ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలని తీర్మాణంలో పేర్కొన్నారు. అలాగే... 24 గంటల పాటు దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసే కొత్త పాలసీ అమలు చేయాలని... మన దేశ బ్రాండ్‌తో విదేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయాలని తీర్మానంలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా దళితబంధు అమలు, భారీ స్థాయిలో మౌలిక వసతుల కల్పన, దేశంలో బీసీ జనగణన జరపడంతో పాటు ద్వేషాన్ని విడిచి.. ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలని పేర్కొన్నారు. ఆయా అంశాలపై అధినేత ప్రసంగం, విస్తృత చర్చ అనంతరం సమావేశం ఆమోదించింది.

ఇవీ చదవండి:

Last Updated :Apr 27, 2023, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.