ETV Bharat / state

BRS: రాష్ట్ర సాధనే ఆశయంగా ఆవిర్భవించి.. దిల్లీ పీఠమే లక్ష్యంగా అడుగులేస్తూ..

author img

By

Published : Apr 27, 2023, 7:17 AM IST

BRS Prasthanam
BRS Prasthanam

BRS 23rd Foundation Day Today : రాష్ట్ర సాధనే ఆశయంగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ.. ఇప్పుడు దిల్లీ పీఠం లక్ష్యంగా ముందుకెళ్తోంది. అనేక ఆటుపోట్లను, గెలుపోటములను చవిచూసి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు 22 ఏళ్ల అనుభవ పాఠాలనే రంగరించి దిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు.

రాష్ట్ర సాధనే ఆశయంగా ఆవిర్భవించిన గులాబీ పార్టీ'

BRS 23rd Foundation Day Today : తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన గులాబీ పార్టీ.. నూతన లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగురవేశారు. గులాబీ పార్టీ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు ఉన్నాయి. కేసీఆర్‌తో పాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికలు మొదలు.. క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది.

2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రకటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది.

2014లో మొదటిసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్: 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవ తెలంగాణ భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తూ వచ్చింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన గులాబీ నాయకత్వం.. కాంగ్రెస్, తెలుగుదేశం సహా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించింది.

2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీ: పదవీ కాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ పార్టీ 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ రెండో మారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది.

దిల్లీ పీఠం లక్ష్యంగా బీఆర్ఎస్: ఇప్పుడు గులాబీ పార్టీ లక్ష్యం.. దిల్లీ పీఠం. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో జెండా, అజెండా, కారు గుర్తు విషయంలో గందరగోళం తలెత్తకుండా.. కేవలం పార్టీ పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా మారుస్తూ.. గతేడాది అక్టోబరు 5న పార్టీ తీర్మానం చేసింది. ఆ మరుసటి రోజు పేరు మార్చాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసింది. గతేడాది డిసెంబరు 8న ఎన్నికల కమిషన్ ఆమోదించడంతో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్​గా రూపాంతరం చెందింది. దిల్లీలో గతేడాది నవంబరు 14న పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. తెలంగాణ మోడల్ అభివృద్ధి అబ్‌ కీ బార్ కిసాన్ సర్కార్‌.. దేశంలో గుణాత్మక మార్పు వంటి నినాదాలతో గులాబీ పార్టీ ముందుకెళ్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.