ఎస్సీ వర్గీకరణ ఆలస్యంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ : కిషన్రెడ్డి

ఎస్సీ వర్గీకరణ ఆలస్యంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ : కిషన్రెడ్డి
BJP Chief Kishan Reddy On SC Classification : ఎస్సీ వర్గీకరణపై గత ప్రభుత్వాలు ఎన్నో కమిటీలు వేసి.. సరిగ్గా పట్టించుకోలేదని బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణపై ఆలస్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఈ విషయంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు.
BJP Chief Kishan Reddy On SC Classification : ఎస్సీ వర్గీకరణ ఆలస్యంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో చాలా ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై ఎన్నో కమిటీలు వేశాయని తెలిపారు. దేశంలో ఎస్సీల వర్గీకరణ గురించి 30 సంవత్సరాలుగా పోరాటం జరుగుతోందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. దీనిపై అన్ని పార్టీలు కంటితుడుపు చర్యగా ప్రవర్తించాయని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం కూడా తుషార్ మెహతా కమిటీ వేసి వదిలేసిందని తెలిపారు.
ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కమిటీ నివేదికను కూడా చదవలేదని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ జులైలో ప్రధాని మోదీని కలిసి ఈ విషయం విన్నవించారని తెలిపారు. ఆగస్టులో ఎమ్మార్పీయస్ నాయకులను అమిత్ షా దిల్లీకి పిలిపించుకుని మాట్లాడారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టులో రెండు ధర్మాసనాలు పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని పేర్కొన్నారు. దీనిపై స్పష్టత కోసం ఏడుగురు న్యాయమూర్తులతో అక్టోబర్ 10న మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.
'అనేక రాజకీయ పార్టీల మద్ధతు ఉన్నా అనేక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పింది. తెలుగు రాష్ట్రాలను పాలించిన టీడీపీ దీన్ని నాలుగు సంవత్సరాలు అమలు చేసింది. దీనిపై కంటితుడుపు చర్యనే తప్ప ఎవరూ కూడా చిత్తశుద్ధితో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయలేదు.' - కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Kishan Reddy on Modi Governance : బీజేపీలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఎవరు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పభుత్వం చరిత్ర ఏంటని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం ఏర్పాటు తర్వాత మొట్టమొదటి సారి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని తెలిపారు. కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. అటల్ బిహారి వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారిగా ప్రధానిని చేసే అవకాశం వచ్చినప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్దుల్కలాంను రాష్ట్రపతిని చేశామని చెప్పారు. బీజేపీ ఏది చెప్తే అదే చేస్తుందని.. కాంగ్రెస్ లాగా ఒకటి చెప్పి.. మరొకటి చేసే పార్టీ కాదని ఎద్దేవా చేశారు.
చారిత్రాత్మక కట్టడాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు తానే సాటి అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై శాశ్వత పరిష్కారం కోసం బేజేపీ ప్రయత్నిస్తుందని కిషన్రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుందని.. దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వం లాంటిది కాదని తెలిపారు.
