ETV Bharat / sports

మళ్లీ పెళ్లి చేసుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉంటా : శిఖర్​ ధావన్​

author img

By

Published : Mar 26, 2023, 7:26 PM IST

టీమ్​ఇండియా మాజీ ప్లేయర్​ శిఖర్​ ధావన్​ తన వైవాహిక జీవితంపై మొదటిసారి మాట్లాడాడు. భవిష్యత్​లో తాను మళ్లీ పెళ్లి చేసుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు. ఇంకేమన్నాడంటే..

shikar dhawan latest comments on his failed marriage
తన విడాకులపై స్పందించిన శిఖర్​ ధావన్

ఒకప్పుడు భారత క్రికెట్​ జట్టులో అత్యంత క్రేజ్​ ఉన్న ఆటగాళ్లల్లో శిఖర్​ ధావన్​ ఒకడు. జట్టులో కొన్ని సంవత్సరాల పాటు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ, వయసు పెరుగుదలతో పాటు మంచి ఆటతీరు​ను కనబర్చకపోవడం వల్ల క్రమంగా టీమ్​ఇండియా​కు దూరమయ్యాడు. క్రికెట్​ కెరీర్​కు రిటైర్మెంట్​ ప్రకటించనప్పటికీ ప్రస్తుతం ఉన్న యువ ప్లేయర్స్​తో పోటీ పడి జట్టులోకి తిరిగి రావడమనేది ధావన్​కు కాస్త కష్ట సాధ్యమైన పనే. ఇదిలా ఉంటే తాజాగా తన వైవాహిక జీవితంపై స్పందించాడు ఈ వర్సటైల్​ ప్లేయర్​.

ధావన్​ పర్సనల్​ లైఫ్​ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా ప్రముఖ కిక్​బాక్సర్ అయేషా ముఖర్జీని 2012లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు ధావన్​.​ వయసులో ఆయేషా.. ధావన్​ కంటే 10 ఏళ్లు పెద్దది. అప్పటికే అయేషాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధావన్​ను పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరికి 2014లో జొరావర్‌ ధావన్ జన్మించాడు. దాదాపు ఎనిమిదేళ్లు కలిసి ఉన్న వీరిద్దరు 2021 సెప్టెంబర్‌లో వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అప్పటినుంచి తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే తాజాగా తన విడాకులపై నోరు విప్పాడు ధావన్​.

''పెళ్లి అనే పరీక్షలో నేను గెలవలేకపోయాను. ఎందుకంటే ఇది ఒక్కరి చేతుల్లో ఉండదు. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి రాసే పరీక్ష. తను(ఆయేషా) తప్పు చేసిందని నేను అనట్లేదు.. అలాగని నేను తప్పు చేశానని కూడా ఒప్పుకోవట్లేదు. నాకు పెళ్లి అనేది ఓ కొత్త ప్రపంచం. ఇందులో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో కూడా నాకు తెలీదు. నేను రెండు దశాబ్దాల నుంచి క్రికెట్ ఆడుతున్నా కాబట్టి దాని గురించి నాకు బాగా తెలుసు. క్రికెట్​ ఆట గురించి ఏం అడిగినా అనర్గళంగా మాట్లాడతా ఎందుకంటే అది అనుభవంతో వచ్చింది."

--శిఖర్​ ధావన్​, క్రికెటర్

తన విడాకుల కేసు ఇంకా పెండింగ్​లోనే ఉందని తెలిపాడు ధావన్​. ఒకవేళ భవిష్యత్తులో తాను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆచితూచి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అంతేగాక అమ్మాయి సెలక్షన్​ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటానని అన్నాడు. తన 27 ఏళ్ల వయసు వరకు తాను సింగిల్​గానే ఉన్నానని.. ఎవరితోనూ రిలేషన్​లో లేనని.. కాకపోతే స్నేహితులతో బయటకు వెళ్లి ఎంజాయ్​ చేసేవాడినని చెప్పాడు ధావన్​.

"నేను ఆయేషాతో ప్రేమలో పడిన తర్వాత నాకు ప్రతి విషయం మధురంగానే అనిపించింది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ ముందుకు సాగిపోయా. అయితే మన కళ్లకు అలుముకున్న ప్రేమ అనే తెర తొలిగిపోతే మాత్రం అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి. ఈ తరం కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. రిలేషన్‌లో ఉంటే కోపాలు, బాధలు, నవ్వులు, బ్రేకప్స్​ ఇలా అన్ని మనల్ని పలకరిస్తాయి. వీటన్నింటినీ అనుభవించాల్సి వస్తుంది. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి పెళ్లీ మాత్రం చేసుకోకండి."

--శిఖర్​ ధావన్​, క్రికెటర్

"కొన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉండి, తన గురించి నువ్వు, నీ గురించి తను అర్థం చేసుకున్నాకే పెళ్లి గురించి ఆలోచించండి. ఈ వ్యవహారం కూడా ఓ క్రికెట్ మ్యాచ్ లాంటిదే. ఇందులో రాణించడానికి కొందరికి నాలుగైదు మ్యాచుల ఆడాల్సి ఉంటుంది. మరికొందరు ఒక్క మ్యాచ్‌తోనే సత్తా చాటుతారు. ఇంకొందరికి ఇంకా చాలా సమయమే పట్టొచ్చు. చివరగా పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం" అని తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు ధావన్​.

తన క్రికెట్​ కెరీర్​ విషయానికి వస్తే.. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌తో అరంగేట్రం చేశాడు శిఖర్​ ధావన్‌. టీమ్​ఇండియా తరఫున మొత్తం 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఈనెల 31 నుంచి జరగబోయే ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు ధావన్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.