ETV Bharat / sports

'మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా'.. ఏది క్రీడా స్ఫూర్తి?

author img

By

Published : Sep 26, 2022, 7:22 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో వన్డేల సిరీస్​ను భారత్​ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో జరిగిన రనౌట్​పై చర్చ జరుగుతోంది. భారత్​ జట్టు క్రీడా స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని ఇంగ్లాడ్​ మద్దతుదారులు విమర్శస్తున్నారు. కానీ ఇదే వాళ్లు చేసిన దానిపై మాత్రం నోరు మొదపట్లేదు. ఈ విషయంపై ఎంసీసీ వివరణ ఇచ్చింది.

deepti sharma run out controversy
deepti sharma run out controversy

Ind vs Eng Women T20 : ఇంగ్లాండ్‌ మహిళలతో చివరి వన్డే సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం ప్రపంచ క్రికెట్లో పెద్ద చర్చకే దారి తీసింది. దీప్తి శర్మ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని, భారత జట్టు తర్వాత కూడా అప్పీల్‌ను వెనక్కి తీసుకోకపోవడం దారుణమని ఇంగ్లాండ్‌ మద్దతుదారులు విమర్శించారు. విజయం కోసం భారత జట్టు క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కిందని వారు వ్యాఖ్యానించారు.

ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ క్రిస్‌ బ్రాడ్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సామ్‌ బిల్లింగ్స్‌ సహా పలువురు భారత జట్టు తీరును సామాజిక మాధ్యమాల్లో తప్పుబట్టారు. అయితే ఈ తరహాలో రనౌట్‌ చేయడాన్ని తప్పయితే.. బౌలర్‌ బంతి వేయడానికి ముందే క్రీజు వదిలి బయటికి వెళ్లడం ద్వారా పరుగు తీయడంలో బ్యాటర్‌ అదనపు ప్రయోజనం పొందడం తప్పు కాదా అన్నది ప్రశ్న. డీన్‌ అంతకుముందు రేణుక బౌలింగ్‌లోనూ ఇలాగే బంతి వేయడానికి ముందే క్రీజు వదిలి వెళ్లడం దీప్తి గమనించింది.

ప్రతి పరుగూ చాలా కీలకంగా మారిన స్థితిలో డీన్‌ను రనౌట్‌ చేసింది. అసలు 'మన్కడింగ్‌'తో ఔట్‌ చేయడం ఎప్పుడూ నిబంధనలకు విరుద్ధం కాదు. కొన్ని నెలల కిందటే ఐసీసీ మరోసారి ఈ విషయం స్పష్టంగా చెప్పింది. కొన్నేళ్ల కిందట ఐపీఎల్‌లో అశ్విన్‌.. బట్లర్‌ను మన్కడింగ్‌ చేసినపుడు పెద్ద దుమారమే రేగింది. అయితే ఒకసారి హెచ్చరించాక కూడా బట్లర్‌ బంతి వేయకముందే క్రీజును వీడడంతో అశ్విన్‌ అతణ్ని ఔట్‌ చేశాడు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా అశ్విన్‌ వెనక్కి తగ్గలేదు. ఈ రనౌట్‌ తరచుగా వివాదాస్పదం అవుతుండడంతో ఐసీసీ మరోసారి స్పష్టతనిచ్చింది.

అయినా సరే.. కొత్తగా ఇలా ఎవరు రనౌట్‌ చేసినా చేసినా క్రీడా స్ఫూర్తి అంశం చర్చకు వస్తోంది. ఇప్పుడు భారత అమ్మాయిలను తప్పుబడుతున్న ఇంగ్లాండ్‌ క్రికెటర్లు తాము క్రీడా స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన ఉదంతాలు గుర్తు లేకపోవడం విడ్డూరం. స్టువర్ట్‌ బ్రాడ్‌ ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్‌లో ఫస్ట్‌ స్లిప్‌ ఫీల్డర్‌ చేతుల్లోకి బంతిని ఆడాడు. అయితే బంతి వికెట్‌ కీపర్‌ చేతికి తాకిందనుకుని అంపైర్‌ ఔటివ్వలేదు. ఆస్ట్రేలియాకు సమీక్షలు అయిపోవడంతో అప్పీల్‌ చేయలేకపోయింది. తాను ఔట్‌ అని స్పష్టంగా తెలిసినా.. బ్రాడ్‌ క్రీజును వీడలేదు.

మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ ఎలియట్‌కు ఇంగ్లాండ్‌ బౌలర్‌ సైడ్‌బాటమ్‌ అడ్డం పడితే అతను కింద పడిపోగా.. వేరే ఫీల్డర్‌ నుంచి బంతిని అందుకున్న ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ రనౌట్‌ చేశాడు. అప్పుడు అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటారా అని అంపైర్‌ అడిగినా.. నాటి కెప్టెన్‌ కాలింగ్‌వుడ్‌ వెనక్కి తగ్గకపోవడంతో ఎలియట్‌ కుంటుకుంటూ పెవిలియన్‌ బాట పట్టాడు.

పాత ఉదంతాల వరకు ఎందుకు..? ప్రస్తుత సిరీస్‌లోనే ఇంగ్లాండ్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎమీ జోన్స్‌.. స్మృతి మంధాన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి కింద పడ్డా.. ఆ విషయాన్ని దాచేసింది. స్మృతి తాను ఔట్‌ అనుకుని డగౌట్‌కు కదిలింది. రీప్లే స్క్రీన్‌ మీద కనిపించాక కానీ ఎమీ బాగోతం అందరికీ అర్థం కాలేదు. తర్వాత అంపైర్లు స్మృతిని వెనక్కి పిలిచారు. ఇలాంటి ఉదంతాలు తమ వెనుక పెట్టుకుని నిబంధనల ప్రకారం చేసిన రనౌట్‌ను చూపించి క్రీడా స్ఫూర్తి గురించి ఇంగ్లాండ్‌ క్రికెటర్లు, వారి మద్దతుదారులు మాట్లాడడం గురువింద నీతే!

ఆ రనౌట్‌లో తప్పేం లేదు: ఎంసీసీ
ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లట్‌ డీన్‌ను భారత బౌలర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడంలో ఎలాంటి తప్పు లేదని క్రికెట్‌ నిబంధనల రూపకర్త మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) స్పష్టం చేసింది. "మొన్నటి ఉత్కంఠభరిత మ్యాచ్‌కు కొంచెం భిన్నమైన ముగింపు లభించింది. కానీ అందులో అన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయి. అంతకుమించి ఎక్కువగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాన్‌ స్ట్రైక్‌ బ్యాటర్లకు ఎప్పుడూ చెప్పేదే చెబుతున్నాం. బంతి బౌలర్‌ చేతి నుంచి వెళ్లే వరకు క్రీజులోనే ఉండండి. అప్పుడు ఇలాంటి రనౌట్లు జరగడవు" అని ఎంసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇవీ చదవండి: బీసీసీఐలో మోగిన ఎన్నికల నగారా.. గంగూలీ బరిలోకి దిగేనా?

'ఈసారి ప్రపంచకప్ మనదే'.. ఫేస్​బుక్​ లైవ్​లో కుండబద్దలు కొట్టిన ధోనీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.