ETV Bharat / sports

IPL 2022: గత సీజన్​లో తేలిపోయారు.. ఈసారి మురిపిస్తారా?

author img

By

Published : Mar 22, 2022, 3:40 PM IST

IPL 2022
IPL 2022

IPL 2022: డేవిడ్ వార్నర్, మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య, నికోలస్ పూరన్... పొట్టి ఫార్మాట్​లో బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలు చూపించే వీరంతా.. గత ఐపీఎల్ సీజన్​లో పూర్తిగా తేలిపోయారు. తమ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు. మరి ఈ సీజన్​లోనైనా వీరు రాణిస్తారా? అని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

IPL 2022: వారంతా గొప్పగొప్ప ఆటగాళ్లే.. ఎల్లలు దాటే రేంజ్‌ ఫాలోయింగ్‌, ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల సత్తా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులు.. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ఈ లెక్కలు చూసే రూ.కోట్లు కుమ్మరించి మరీ ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేశాయ్‌. అయినా ఏం లాభం..? 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌' అన్నట్టుగా గత ఐపీఎల్‌లో వారి ప్రదర్శన చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అయినప్పటికీ ఐపీఎల్‌-2022 సీజన్‌లోనూ చూపులన్నీ వారిపైనే..!!

బౌన్స్ బ్యాక్‌ అవుతాడా..?

తన సారథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్‌ ట్రోఫీని తెచ్చిపెట్టిన ఘనుడు డేవిడ్‌ వార్నర్‌. 848, 641, 692, 548.. వంటి భారీ పరుగులతో పలు సీజన్‌లలో మెరిసిన వార్నర్‌.. 2021 ఏడాది ఐపీఎల్‌లో మాత్రం పరుగుల కోసం చాలా కష్టాలే పడ్డాడు. ఆ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ కేవలం 195 పరుగులే చేశాడు. టోర్నీ మొత్తంలో రెండు హాఫ్‌ సెంచరీలు నమోదు చేసినప్పటికీ బ్యాటింగ్‌ సగటు 24.37గా ఉండటం గమనార్హం. అయితే, ఏ కారణం లేకుండా హైదరాబాద్‌ జట్టు నుంచి తప్పించడం, కెప్టెన్సీ నుంచి తనను తొలగించడం బాధించాయని సీజన్‌ తర్వాత వార్నర్‌ వాపోయాడు. అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడు 289 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియాకు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

IPL 2022
వార్నర్

ఇదిలా ఉంటే.. ఈసారి ఐపీఎల్‌-2022 మెగా వేలంలో వార్నర్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఐపీఎల్‌లో ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చానని వార్నర్‌ ఇటీవల సంతోషం వ్యక్తం చేశారు. మరి మార్చి 26 నుంచి 10 జట్లతో అతిత్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఈ స్టార్ బ్యాటర్‌ ఎలా విజృంభిస్తాడో? తన విమర్శకుల నోరు ఎలా మూయిస్తాడో వేచిచూడాలి.

మిస్టర్‌ కూల్‌ కూడా..!

అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన తర్వాత మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ మొదటిది. తన సారథ్యంలో 2021 ఏడాదిలో జట్టుకు మరో కప్పు అందిచినప్పటికీ వ్యక్తిగతంగా ధోనీ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు. 2021లో మొత్తం 16 మ్యాచ్‌ల్లో 14 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ 106.54 స్ట్రైక్ రేట్‌తో మొత్తంగా కేవలం 114 పరుగులే చేశాడు. మిడిలార్డర్‌లో వచ్చినప్పటికీ ధోనీ అత్యధిక పరుగులు 18 నాటౌట్‌గా ఉండటం గమనార్హం. అయితే, కెరీర్‌లో అత్యంత విజయమంతమైన ధోనీని ఈ లెక్కలు చూసి ఓ అంచనా వేయలేం విపత్క పరిస్థితుల్లోనూ తన ఆలోచన శక్తితో జట్టును విజయ తీరాలకు చేర్చే సత్తా ఈ మహేంద్రుడికే చెల్లుతుంది. అందువల్లే ఈ సీజన్‌లో ధోనీని వేలంలో వదులుకోకుండా కెప్టెన్‌గా అంటిపెట్టుకుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌.

IPL 2022
ధోనీ

హార్దిక్‌ నడిపిస్తాడా..?

ఫామ్‌లేమితో గత రెండేళ్లుగా పెద్దగా క్రికెట్‌ ఆడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య ఐపీఎల్‌-2022లో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇన్నాళ్లు ముంబయి ఇండియన్స్‌లో పేస్‌-ఆల్‌ రౌండర్‌గా ఉన్న హార్దిక్‌.. గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేదు. మొత్తంగా 12 మ్యాచ్‌లు 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 127 పరుగులే చేశాడు. జట్టులో ఆల్‌రౌండర్‌గా ఉన్నప్పటికీ గత రెండు సీజన్లలో హార్దిక్‌ బౌలింగ్‌పై ముంబయి ఎప్పుడూ ఆధారపడలేదు. అయితే, ప్రస్తుతం బాగా సన్నద్ధమయ్యానని ఈ గుజరాతీ కొత్త కెప్టెన్‌ గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌లో కీలక ఆల్‌రౌండర్‌గా ఒకప్పుడు వెలుగొందిన హార్దిక్‌.. ప్రస్తుత సీజన్‌లో కొత్త జట్టును ఎలా నడిస్తాడో అనేది ఆసక్తిగా మారింది.

IPL 2022
పాండ్య

నికోలస్ లెక్క తప్పలేదా..!

టీ20 క్రికెట్‌లో అత్యంత విధ్వంసకర పవర్‌ హిట్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు విండీస్ ఆటగాడు నికోలస్‌ పూరన్‌. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన ఈ పవర్‌ హిట్టర్‌ ఆ సీజన్‌లో నాలుగు డకౌట్‌ల చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. పైగా 12 మ్యాచుల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడి మొత్తంగా 85 పరుగులే చేశాడు. దీంతో ఈసారి పూరన్‌ను పంజాబ్‌ వదులుకుంది. ఫలితంగా ఈసారి ఐపీఎల్‌ మెగావేలంలో విండీస్‌ ఆటగాళ్లలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. 2022 వేలంలో రూ.10.75 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నికోలస్‌ను కొనుగోలు చేసింది. ఈ మేరకు తన లెక్క తప్ప లేదని ఇటీవల టీమ్‌ఇండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో పూరన్‌ విధ్వంసర బ్యాటింగ్‌తో బదులు చెప్పి అందరీ దృష్టిని మళ్లీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

IPL 2022
పూరన్

అయినా ఖరీదైన ఆటగాడిగా..

ముంబయి ఇండియన్స్‌ టాప్‌-ఆర్డర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా గతేడాది 10 మ్యాచులే ఆడి మొత్తంగా 241 పరుగులే చేశారు. అదనపు బౌలర్‌ను ఆడించడానికి పలు సందర్భాల్లో ఇషాన్‌ను జట్టు పక్కనపెట్టాల్సి వచ్చింది. దీని బట్టి అతడు గతేడాది జట్టులో పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అయినప్పటికీ 2022 మెగా వేలంలో ముంబయి రూ.15.25 కోట్లతో ఇషాన్‌ కిషన్‌ తిరిగి కొనుగోలు చేసుకుంది. ఈ మేరకు ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో భారతీయ ఆటగాడిగా కిషన్ నిలిచాడు.

IPL 2022
ఇషాన్

మరికొందరు..

పేపర్‌పై విజయ్‌ శంకర్‌ మంచి ఆటగాడే. డెత్‌ ఓవర్లలో ఫినిషర్‌గా బ్యాటింగ్‌, చక్కని ఫీల్డర్‌, కొద్దిగా బౌలింగ్‌ చేయగలడు. అయితే, గత సీజన్‌లలో హైదరాబాద్‌ తరఫున ఆడిన విజయ్‌ శంకర్‌ నుంచి ఇదేదీ పెద్దగా కనిపించలేదు. పైగా 7 మ్యాచుల్లో కేవలం 28 పరుగులే చేశాడు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ విజయ్‌ శంకర్‌ను రూ.1.40 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌ 2020లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా రాహుల్‌ తెవాటియా అందరి దృష్టి ఆకర్షించారు. కానీ, 2021 సీజన్‌లో మాత్రం పెద్దగా రాణించలేదు. గతేడాది మొత్తంగా 14 మ్యాచుల్లో 8 వికెట్లు, 11 ఇన్నింగ్స్‌ల్లో 155 పరుగులే చేశాడు. ఈసారి గుజరాత్‌ టైటాన్స్ తెవాటియాను రూ.9 కోట్ల భారీ ధరతో కొనుగులు చేసుకుంది.

  • గతేడాది దిల్లీ తరఫున ఆడిన రైట్‌ఆర్మ్‌ స్పిన్నర్‌ రవీచంద్రన్‌ అశ్విన్‌ 13 మ్యాచుల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. తాజా మెగా వేలంలో అశ్విన్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది.
    IPL 2022
    అశ్విన్
  • హైదరాబాద్‌ తరఫున ఆడిన భువనేశ్వర్‌ 11 మ్యాచుల్లో ఆరు వికెట్లే పడగొట్టాడు. అయినా ఈ రికార్డును పక్కనపెట్టి మళ్లీ హైదరాబాద్‌ 2022 మెగా వేలంలో రూ.4.2 కోట్లతో తిరిగి భువీని వెనక్కి తీసుకుంది.
  • ముంబయి తరఫున ఆడిన కృనాల్‌ పాండ్యా 13 మ్యాచులు ఆడి 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 140 పరుగులు తీసి, ఐదు వికెట్లు తీశాడు.

ఇక ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. మైదానంలో అడుగు పెట్టాక అవన్నీ తారుమారు అవుతాయి. గతేడాది సీజన్‌ లెక్కలే ఇందుకో ఉదాహరణ. ఒక సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసినంతా మాత్రాన ఆటగాళ్ల ఆటతీరులో ఎటువంటి మార్పు ఉండదు. ఇలా పడిన వాళ్లే ఎన్నోసార్లు బౌన్స్‌ బ్యాకై చరిత్ర సృష్టించారు. అందువల్లే ఒక సీజన్‌ లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా ఆటగాళ్ల దీర్ఘకాలిక ఆట తీరును బట్టే ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు చెల్లిస్తుంటాయనేది విదితమే.

ఇదీ చదవండి:

IPL 2022 Delhi Capitals: యువకుల జట్టు కొట్టేనా కప్పు!

IPL 2022 Ricky Ponting: 'ఆ బాధ్యతంతా రిషభ్​ పంత్​పైనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.