ETV Bharat / sports

విదేశీ లీగ్​ల్లో భారత క్రికెటర్ల సందడి

author img

By

Published : Nov 18, 2020, 2:12 PM IST

భారత్​లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఐపీఎల్​ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రికెటర్లు పాల్గొంటారు. అయితే భారత ఆటగాళ్లు మాత్రం విదేశీలీగ్​ల్లో ఆడేందుకు అవకాశం లేదు. ఇందుకు బీసీసీఐ నిబంధనలే అడ్డుగా నిలుస్తున్నాయి. అయితే క్రికెట్​కు వీడ్కోలు పలికిన పలువురు క్రికెటర్లు మాత్రం విదేశాల్లో క్రికెట్​ ఆడారు. గతంలో యువీ, ఇర్ఫాన్​ టీ20 లీగ్​ల్లో పాల్గొనగా.. తాజాగా మునాఫ్​ పటేల్​ పొట్టి ఫార్మాట్​లో సందడి చేయనున్నాడు.

Indian Cricketers Who Have Participated In Foreign T20 Leagues
విదేశీ లీగుల్లో ఆడుతున్న టీమ్​ఇండియా మాజీ క్రికెటర్లు

విదేశీ టీ20 లీగ్​ల్లో భారత ఆటగాళ్లు పాల్గొనడానికి బీసీసీఐ నుంచి అనుమతి లేదు. మిగిలిన దేశాల క్రికెట్​ బోర్డులు తమ ఆటగాళ్లను ఫారెన్​ లీగుల్లో ఆడటానికి అనుమతిస్తుండగా.. గాయాలు, అంతర్జాతీయ కట్టుబాట్ల కారణంగా వేరే లీగుల్లో ఆడటానికి మన క్రికెటర్లపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటిస్తే మాత్రం విదేశీ లీగ్​ల్లో ఆడేందుకు అనుమతి ఉంది. ఇప్పటికే యువరాజ్, ఇర్ఫాన్​​ పలు లీగ్​ల్లో ఆడగా.. తాజాగా మునాఫ్​ మైదానంలో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు.

సీపీఎల్​లో ఇర్ఫాన్​ పఠాన్​

టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. గతంలో ఇతడు కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​లో చోటు దక్కించుకున్నాడు. తాజాగా లంక ప్రిమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఆడనున్నాడు. కాండి టస్కర్స్‌ జట్టుకు ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Indian Cricketers Who Have Participated In Foreign T20 Leagues
ఇర్ఫాన్​ పటేల్​

టీమిండియా తరఫున 2012లో చివరి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడు ఇర్ఫాన్​. ఆ తర్వాత జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. అదే విధంగా ఐపీఎల్​లో 2017లో గుజరాత్ లయన్స్​కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం జరిగిన రెండు సీజన్లలోనూ ఏ ఫ్రాంఛైజీ ఇతడిని తీసుకోలేదు.

ఎల్​పీఎల్​లో మునాఫ్​ పటేల్​

నవంబరు 26 నుంచి ప్రారంభంకానున్న లంక ప్రీమియర్​ లీగ్​ (ఎల్​పీఎల్​)లో టీమ్​ఇండియా మాజీ బౌలర్​ మునాఫ్​ పటేల్​ పాల్గొననున్నాడు. టోర్నీలోని కాండి టస్కర్స్​ జట్టులో ఆడేందుకు ఇటీవలే ఒప్పందపై సంతకం చేశాడు. 2011 ప్రపంచకప్​లో భారత్​ విజేతగా నిలిచిన తర్వాత క్రికెట్​కు వీడ్కోలు పలికిన మునాఫ్​.. మళ్లీ లంక ప్రీమియర్​ లీగ్​లో సందడి చేయనున్నాడు.

Indian Cricketers Who Have Participated In Foreign T20 Leagues
మునాఫ్​ పటేల్​

మునాఫ్​ పటేల్​.. 13 టెస్టులు, 70 వన్డేలు, మూడు టీ20ల్లో భారత్​ తరపున ప్రాతినిధ్యం వహించాడు. రాజస్థాన్​ రాయల్స్​, ముంబయి ఇండియన్స్​, గుజరాత్​ లయన్స్​ తరపున ఐపీఎల్​లో మొత్తంగా 63 మ్యాచ్​లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు.

Indian Cricketers Who Have Participated In Foreign T20 Leagues
యువరాజ్​ సింగ్​

బిగ్​బాష్​ లీగ్​లో యువీ

ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ బిగ్​బాష్​ లీగ్​(బీబీఎల్​)లో టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ గతంలో భాగమయ్యాడు. 2018లో క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన యువీ.. ఐపీఎల్​లోనూ ప్రాతినిధ్యం వహించడం లేదు. బీసీసీఐ నుంచి ఎన్​ఓసీ ధ్రువీకరణపత్రం పొందిన తర్వాత 2019లో కెనడా వేదికగా జరిగిన గ్లోబల్​ టీ20 లీగ్​లో బరిలోకి దిగాడు. ఇందులో టొరంటో జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు. అనంతరం అబుదాబిలో జరిగే టీ10 మ్యాచ్​ల్లోనూ సందడి చేశాడు.

సీపీఎల్​, టీ10 లీగుల్లో ప్రవీణ్​ తాంబే

2018లో అబుదాబి వేదికగా జరిగిన టీ10 లీగ్​లో సింథిస్‌ తరఫున ఆడాడు తాంబే. ఇందుకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అనుమతి తీసుకోలేదు. ఐపీఎల్‌, భారత జట్టు తరఫున ఆడాలనుకునే ఏ క్రికెటర్‌ విదేశీ లీగుల్లో పాల్గొనకూడదనేది బోర్డు నిబంధన.

Indian Cricketers Who Have Participated In Foreign T20 Leagues
ప్రవీణ్​ తాంబే

ఒకవేళ బయట దేశాల్లో ఆడాలనుకుంటే క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించాలి. లేదంటే బీసీసీఐ నుంచి ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​) తీసుకోవాల్సి ఉంటుంది. ఇవేమి చేయకుండా తాంబే నిబంధనలు ఉల్లంఘించాడని ఇతడిపై వేటు వేసింది బీసీసీఐ. ఫలితంగా ఐపీఎల్​-2020లో ఆడే అవకాశం కోల్పోయాడు. అయితే ఈ ఏడాది జరిగిన కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​లో ట్రిన్​బాగో నైట్​రైడర్స్​ జట్టుకు ఎంపికయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.