ETV Bharat / sitara

వినోదానికి కొత్త భాష్యం- స్మార్ట్‌ ఫోనే మల్టీప్లెక్స్‌!

author img

By

Published : Sep 10, 2021, 7:50 AM IST

కరోనా లాక్​డౌన్​తో డిజిటల్​ వినోదానికి ఆదరణ బాగా పెరిగింది. పిల్లల నుంచి పెద్దలు వరకు అందరూ ఇదే దారి పడుతున్నారు. ఒకప్పడు సినిమా రిలీజ్​ అంటే.. టికెట్ల కోసం థియేటర్లు వద్ద బారులు తీరే జనం.. ఇప్పుడు దర్జాగా ఇంట్లోనే కొత్త సినిమాలు చూస్తున్నారు. వినోదానికి కొత్త ఒరవడి నేర్పిన ఓటీటీలు(OTT annual subscription) ఎన్నో..! సినిమాలు, వెబ్​సిరీస్​ల కంటెంట్​తో ఆడియన్స్​ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇల్లే ఓ సినిమా హాల్​గా మారిపోతుంది! స్మార్ట్​ఫోనే మల్టీప్లెక్స్​ అయిపోయింది.

otts
ఓటీటీలు

ఏమీ తోచడం లేదు.. పొద్దు గడవడం లేదు అనేవారు ఇప్పుడు తగ్గిపోతున్నారు! కరోనా లాక్‌డౌన్‌తో రోజుల తరబడి ఇంట్లోనే బందీలవ్వాల్సి వచ్చినా ప్రశాంతంగానే గడిపేశారు. రైళ్లు, బస్సుల్లో సుదీర్ఘ ప్రయాణాలనూ విసుక్కోకుండా ఆనందిస్తున్నారు..! ఎందుకంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోనే ఇప్పుడు ఓ మల్టీఫ్లెక్స్‌. స్మార్ట్‌టీవీ ఉంటే ఇంకా సౌకర్యం. హోం థియేటర్‌ ఉంటే ఇక ఇల్లే ఓ సినిమా హాలు! తెలుగే కాదు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీషు, స్పానిష్‌, ఫ్రెంచి, కొరియా.. ఒకటేంటి వివిధ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టాక్‌షోలు, డాక్యుమెంటరీలు అందిస్తున్న ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ)(ott yearly subscription)లు ఈ కొత్త వినోదాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరించాయి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+హాట్‌స్టార్‌, జీ5, సన్‌నెక్స్ట్‌, ఆహా లాంటి రెండు మూడు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ఇంటర్నెట్‌ డేటా ఉంటే చాలు ఇంట్లో కూర్చునే వినోదాల ప్రపంచంలో విహరించొచ్చు. కొన్ని లక్షల గంటల నిడివిగల కంటెంట్‌తో అన్ని వయసుల వారినీ ఓటీటీలు అలరిస్తున్నాయి. హిందీలో అమితాబ్‌ నటించిన 'పింక్‌' సినిమాను తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో 'వకీల్‌సాబ్‌'గా తీస్తున్నారని, తమిళంలో సూపర్‌ హిట్టయిన 'అసురన్‌'ను తెలుగులో వెంకటేష్‌ 'నారప్ప'గా రీమేక్‌ చేస్తున్నారని తెలిసి.. వాటిని ఆంగ్ల సబ్‌టైటిల్స్‌తో మనవాళ్లు ముందే చూసేశారు. తర్వాత 'వకీల్‌సాబ్‌'నీ, 'నారప్ప'నీ కూడా వదల్లేదనుకోండి. ఇలా దేశాలు, ప్రాంతాలు, భాషల మధ్య భేదాల్ని చెరిపేసి, ఎల్లలు దాటిన వినోదానికి సరికొత్త చిరునామాగా మారిన ఓటీటీలపై ప్రత్యేక కథనం.

OTTs year plan
ఓటీటీల వార్షిక చందా

అవన్నీ.. మర్చిపోండి

థియేటర్‌లో సినిమా చూడాలంటే ఆన్‌లైన్‌లోనో, క్యూలో నిలబడో టిక్కెట్‌ కొనుక్కుని వెళ్లాలి. నచ్చిన సినిమా టీవీలో చూడాలన్నా వాళ్లు వేసే వరకు నిరీక్షించి, ఆ సమయానికి టీవీకి అతుక్కుపోవాలి. మధ్యలో వ్యాపార ప్రకటనలనూ భరించాలి. ఓటీటీల్లో అవన్నీ మర్చిపోవచ్చు. మీ ఇష్టం వచ్చినప్పుడు, ఎక్కడైనా, ఎప్పుడైనా చూసేయొచ్చు. సన్నివేశాలు సాగదీతగానో, చిరాకు తెప్పిస్తుంటేనో ఫార్వర్డ్‌ చేసేయొచ్చు. టీవీలోనే కాదు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కడైనా చూడొచ్చు. పైగా సినిమా టికెట్‌ ఖర్చుతో పోలిస్తే ఓటీటీల్లో వినోదం చాలా చాలా చౌక. థియేటర్లలో విడుదలైన సినిమా.. అక్కడ తీసేయగానే ఓటీటీల్లో వచ్చేస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడటంతో తెలుగు, తమిళ, మలయాళమే కాదు బాలీవుడ్‌ సినిమాలూ చాలావరకు నేరుగా ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. థియేటర్లు తెరిచినా ఇప్పటికీ టక్‌ జగదీష్‌ లాంటి పలు సినిమాలు ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి.

డేటా ధరలు తగ్గడం వల్ల..

రిలియన్స్‌ జియో ఇంటర్నెట్‌లో విప్లవం తీసుకొచ్చింది. కొండెక్కి కూర్చున్న డేటా ఛార్జీలను నేలకు దింపింది. 2015లో దేశంలో ఒక జీబీ మొబైల్‌ డేటా రూ.313 ఉంటే.. ఇప్పుడు రూ.4కే దొరుకుతోందని ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ సంస్థ తాజా అధ్యయనం పేర్కొంది. డేటా ఖర్చుతోపాటు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీల ధరలూ తగ్గాయి. రూ.5-6 వేలకే స్మార్ట్‌ఫోన్‌, రూ.15 వేల నుంచే 32 అంగుళాల తెర ఉన్న స్మార్ట్‌ టీవీలూ దొరుకుతున్నాయి. పాత హెచ్‌డీ టీవీల్నీ ఫైర్‌స్టిక్‌ల వంటి ఉపకరణాలు ‘స్మార్ట్‌’గా మార్చేస్తున్నాయి. ఇవన్నీ ఓటీటీలకు అందివచ్చాయి.

చౌకలోనే కావాల్సినంత వినోదం

ఓటీటీల ప్రభంజనానికి చౌక ధరలే ముఖ్య కారణం. ఒక కుటుంబంలోని నలుగురు మల్టీప్లెక్స్‌కి వెళ్లి సినిమా చూసొస్తే కనీసం వెయ్యి రూపాయలవుతుంది. ఆ సొమ్ముతో అమెజాన్‌ ప్రైమ్‌కు ఏడాది చందా కట్టేయొచ్చు. అంటే రోజుకు రూ.2.75 ఖర్చుతో (డేటా ఛార్జీలు అదనం) కావాల్సినంత వినోదం. ప్రైమ్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌తో పాటు, అమెజాన్‌లో కొనుగోళ్లకు డెలివరీ ఛార్జీల మినహాయింపు వంటి అదనపు ఆఫర్లూ ఈ వెయ్యి రూపాయలతో అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌, జియో వంటి సంస్థలు తమ కొనుగోలుదారులకు కొన్ని ఓటీటీల సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నాయి.

తాజా కంటెంట్‌ కోసం వేట

ఉన్న చందాదారుల్ని కాపాడుకోవడానికి, కొత్తవారిని ఆకర్షించేందుకు ఓటీటీలు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను తెస్తున్నాయి. ఆహా వంటి సంస్థలు తమిళం, మలయాళంలో వచ్చిన సినిమాల్ని డబ్‌ చేసి అందజేస్తున్నాయి. యువతే లక్ష్యంగా ఓటీటీల కంటెంట్‌ నిర్మాణం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. తాజా ఫ్యాషన్‌ పోకడలు, మాటతీరు, పబ్‌ సంస్కృతి, రొమాన్స్‌ ముసుగులో సెక్స్‌, మితిమీరిన హింస, యథేచ్ఛగా మద్యం, మత్తుపదార్థాల వినియోగం, పాశ్చాత్య సంస్కృతి వంటివి ఎక్కువ చూపిస్తున్నారు. సెన్సార్‌ లేకపోవడంతో కొన్ని వెబ్‌సిరీస్‌లు హద్దు మీరి అసభ్య దృశ్యాలు, అశ్లీల సంభాషణలకూ వేదికలవుతున్నాయి.

  • లండన్‌కు చెందిన ప్రముఖ మీడియా అధ్యయన సంస్థ ఒమిడియా అధ్యయనం ప్రకారం మన దేశంలో అత్యంత ఎక్కువ (41%) చందాదారులున్న ఓటీటీ వేదికగా డిస్నీ+హాట్‌స్టార్‌ నిలిచింది. నిరుడు ఏప్రిల్‌లో దీని సబ్‌స్క్రైబర్ల సంఖ్య 80 లక్షలుంటే, ఏడాది చివరికి 2.5 కోట్లకు చేరింది.

మరో పదేళ్లలో రూ.93 వేల కోట్ల మార్కెట్‌

భారత్‌లో ఓటీటీ మార్కెట్ల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 30.7% ఉన్నట్టు ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ సంస్థ పేర్కొంది. 2021లో మన దేశంలోని ఓటీటీ మార్కెట్‌ విలువ రూ.11,166 కోట్లు. 2025కి రూ.29,776 కోట్లకు, 2030కి రూ.93,050 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

కొత్త అవకాశాలకు వేదిక

  • సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన, అసలు అవకాశాలే దక్కని నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు ఓటీటీ అద్భుతమైన వేదిక.
  • చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదని ఆవేదన చెందే నిర్మాతలు ఇప్పుడు నేరుగా ఓటీటీలకే విక్రయిస్తున్నారు.
  • తక్కువ బడ్జెట్‌లోనే సినిమాలు, కంటెంట్‌ తీసే అవకాశం ఉండటంతో ప్రయోగాలకు వెసులుబాటు లభిస్తోంది.
  • సత్తా ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కొనుగోలుకు ఓటీటీలు రూ.పదుల కోట్లు వెచ్చిస్తున్నాయి.
  • మరో భాగస్వామితో అవగాహన కుదుర్చుకుని ఒకేసారి రెండు వేదికలపైనా విడుదల చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌- సన్‌నెక్స్ట్‌ అలాగే కొన్ని కొత్త సినిమాలకు అవగాహన కుదుర్చుకున్నాయి. జియో సినిమా 12 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని, వాటి కంటెంట్‌ను తమ ప్లాట్‌ఫాంపై అందిస్తోంది.

ఏడాదిలో చందాదారులు రెట్టింపు

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలను దెబ్బతీసిన కరోనా ఓటీటీలకు మాత్రం వరంగా మారింది. వీటికి నాలుగైదేళ్లలో రావలసిన ఊపు కరోనా వల్ల ఏడాదిలోనే వచ్చింది. 2019 చివరికి దేశవ్యాప్తంగా 3.2 కోట్లున్న ఓటీటీ చందాదారుల సంఖ్య 2020 చివరికి 6.2 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనం.

  • నెట్‌ఫ్లిక్స్‌కు 2019లో 24 లక్షల మంది చందాదారులుంటే 2020కి 44 లక్షలకు పెరిగారు.

కంటెంట్‌లో కొత్త పుంతలు

  • ఓటీటీ వేదికలు.. యాక్షన్‌, అడ్వెంచర్‌, రొమాన్స్‌, కామెడీ, డ్రామా, సైన్స్‌ఫిక్షన్‌ ఇలా భిన్నమైన జానర్లలో, నాణ్యమైన, సృజనాత్మక కంటెంట్‌ను అందించేందుకు పోటీ పడుతున్నాయి.
  • ఇతరులు తీసిన సినిమాల్ని కొనడంతో పాటు, కొన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు సొంతంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తున్నాయి. ఇంగ్లిషు, కొరియన్‌, స్పానిష్‌ వంటి భాషల్లో వచ్చిన సినిమాల్ని.. భారతీయ భాషల్లోకి డబ్‌ చేేస్తున్నాయి. లేదంటే ప్రాంతీయ భాషల్లో సబ్‌టైటిళ్లు ఉంటున్నాయి. దీంతో ఎవరికి నచ్చింది వారు ఏ భాషలో ఉన్నా చూసేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన స్పానిష్‌ వెబ్‌సిరీస్‌ మనీ హైస్ట్‌ను ఇప్పుడు తెలుగులోకి డబ్బింగ్‌ చేసి ప్రసారం చేస్తున్నారు.
  • జీ గ్రూప్‌ వంటి సంస్థలు టీవీ ఛానళ్లలో ప్రసారానికి ఒక రోజు ముందే ‘బిఫోర్‌ టీవీ’ పేరుతో సీరియల్‌ ఎపిసోడ్‌లను ఓటీటీల్లో పెడుతున్నాయి. సొంత శాటిలైట్‌ ఛానళ్లున్న సంస్థలు వాటి కంటెంట్‌ అంతా కలిపి ఓటీటీలను ప్రారంభించాయి.
  • సొంత క్రీడా ఛానళ్లున్న డిస్నీ హాట్‌స్టార్‌, సోనీ లివ్‌ వంటివి ఓటీటీల్ని వీక్షకులకు చేరువ చేసేందుకు వాటిని వాడుకుంటున్నాయి. క్రికెట్‌ మ్యాచ్‌లతో పాటు, తాజాగా ఒలింపిక్స్‌ పోటీల్నీ ప్రత్యక్ష ప్రసారం చేసి విశేష వీక్షకాదరణ పొందాయి.
  • ప్రముఖ నిర్మాణ సంస్థలూ వెబ్‌సిరీస్‌ల నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాయి. ఓటీటీలకున్న మార్కెట్‌, భవిష్యత్తు దీనిదేనన్న అంచనాలు, ఆకర్షణీయమైన పారితోషికం ప్రముఖ హీరో, హీరోయిన్లు, దర్శకులనూ లాక్కొస్తున్నాయి. నాలుగు రకాల భిన్నమైన ఇతివృత్తాలను తీసుకుని ఒక్కోటి ఒక్కో ఎపిసోడ్‌గా ప్రముఖ దర్శకులు, నటీనటులతో ఆంతాలజీ (సంకలనం) పేరిట వెబ్‌సిరీస్‌లు రూపొందించటం ఇప్పుడో ట్రెండ్‌.
  • ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌ (ఐఎండీబీ)లో నమోదయిన వినియోగదారులు ఇచ్చే రేటింగ్‌ అత్యంత ప్రామాణికమైందిగా పరిగణిస్తుంటారు. దీని రేటింగ్‌ ఆధారంగా ప్రేక్షకులు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తుంటారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.