ETV Bharat / sitara

బాక్సాఫీస్ విక్రమార్కుడు.. ఈ దర్శక ధీరుడు

author img

By

Published : Oct 10, 2020, 5:21 AM IST

Director Rajamouli birthday Special Story
బాక్సాఫీసు విక్రమార్కుడు.. ఈ దర్శక ధీరుడు

టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిన దర్శకధీరుడు.. ఎస్‌.ఎస్‌.రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచం మొత్తం మన చిత్ర పరిశ్రమ గురించే మాట్లాడుకునేలా చేసిన ఘనత ఈయనది. అపజయం అన్నదే ఎరుగని దర్శకుడు రాజమౌళి. నేడు (అక్టోబరు 10) జక్కన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

శ్రీశైల శ్రీ రాజమౌళి.. తెలుగునాట లబ్ధ ప్రతిష్టులైన దర్శకుడు. వందకు వందశాతం విజయాల దర్శకుడు. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి ఒక్క వైఫల్యం అందుకోకుండా అంకిత భావంతో సినిమాలు చెక్కిన జక్కన్న. అవధుల్లేని బడ్జెట్‌... అయినా, ఆయనపై నిర్మాతలకు అంతులేని విశ్వాసం. సినిమా ఆయన చేతిలో పడితే చాలు.. దిగంతరాలు దద్దరిల్లే సక్సెస్‌ సొంతమవుతుందనే నమ్మకం. ఆయన సినిమాల్లో నటించాలని వేవేల కలలు కనే నటీనటులకు కొదవే లేదు. ఎంత చిన్న పాత్ర అయినా సరే.. ఆయన సినిమాల్లో చోటు కోసం ఆరాటపడే ఔత్సాహికులు మరెందరో? అంతటి సంచలన విజయాలు దక్కించుకున్న శ్రీశైల శ్రీ రాజమౌళి మరెవరో కాదు... ఆయనే ఎస్‌.ఎస్‌.రాజమౌళి.

ఈ పేరు వింటేనే ప్రపంచంలో ఏమూల ఉన్నా, తెలుగువారు పులకరించి పోవాల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ దర్శక ధీరుడి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా?అని ఎదురుచూడని తెలుగు వాడు ఉండడు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కరలేదు సరికదా.. ఆ మాటల్లో అస్సలు అతిశయోక్తి కూడా లేదేమో. శ్రీశైల శ్రీ రాజమౌళి సృష్టించిన ప్రతి వెండితెర అద్భుతాన్ని ఎంతో మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. అంతలా ప్రేక్షకులకు నచ్చేటట్టు సినిమాలు తీయడంలో ఈ దర్శకుడి శైలే వేరు. తీసిన ప్రతి సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడి పుట్టిన రోజు నేడు(అక్టోబర్‌ 10). ఈ సందర్భంగా రాజమౌళి గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

వ్యక్తిగత జీవితం

రాజమౌళి తల్లిదండ్రుల పేర్లు కె.వి.విజయేంద్ర ప్రసాద్, రాజా నందిని. రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. కర్ణాటకలో 1973, అక్టోబర్‌ 10న జన్మించారు. ఆయన కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతానికి చెందినది. ఈయన ప్రాథమిక విద్య కొవ్వూరులో, ఉన్నత విద్య ఏలూరులో జరిగింది. రాజమౌళి ఎన్నో ఏళ్లుగా వైజాగ్‌లో ఉన్నారు. ఎందుకంటే, ఆయన తల్లి ఆ ప్రాంతానికి చెందినవారు కాబట్టి. స్వతహాగా రాజమౌళి నాస్తికుడు.

చిన్నితెర చిద్విలాసం

సినిమాలంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. సినిమా రంగానికి సేవలు అందించాలని ఇక్కడకు వచ్చారు. మొదట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీ కోసం కొన్ని సీరియల్స్‌ను డైరెక్ట్‌ చేసేవారు. ఆ తర్వాత 'ఈటీవీ'లోనే 'శాంతినివాసం' టీవీ సిరీస్‌ను రూపొందించారు. ఈ సీరియల్‌ను రాఘవేంద్రరావు నిర్మించారు. ఆ సీరియల్‌ రాజమౌళికి ఎంతో పేరు తెచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే వెండితెరకు సరికొత్త భావజాలం ఉన్న కొత్త దర్శకుడిని ఇచ్చింది.

వెండితెరపైకి

రాజమౌళి మొదట దర్శకత్వం వహించిన సినిమా 'స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌'. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఈ చిత్రం 2001లో రిలీజ్‌ అయింది. ఈ సినిమా రాజమౌళికి, జూనియర్‌ ఎన్టీఆర్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత డైరెక్టర్‌గా రాజమౌళి, హీరోగా జూనియర్‌ ఎన్టీఆర్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిందీలో ఈ సినిమా 'ఆజ్‌ కా ముజ్రిమ్‌' అన్న పేరుతో డబ్‌ అయింది. హిందీ ప్రేక్షకులనూ ఈ చిత్రం ఆకట్టుకొంది.

అయితే, 'స్టూడెంట్‌ నెంబర్‌ 1' తర్వాత 'సింహాద్రి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ దర్శకుడికి రెండేళ్ల సమయం పట్టింది. ఆ రెండేళ్ల గ్యాప్‌లో మలయాళ నటుడు మోహన్‌ లాల్‌తో ఓ పౌరాణిక చిత్రం తీయాలని భావించారు దర్శక ధీరుడు. కానీ, ఆ చిత్రం పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇక 'సింహాద్రి' విషయానికొస్తే, భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఓ బ్లాక్‌ బస్టర్‌ అయింది.

రాజమౌళి మూడవ సినిమా 'సై'. ఈ చిత్రంలో నితిన్, జెనీలియా హీరోహీరోయిన్లుగా నటించారు. రగ్బీ ఆట నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. టాలీవుడ్‌లో ఆ ఆట నేపథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌తో రాజమౌళి మొదట పని చేసిన సినిమా ఇది. 'ఆర్‌ పార్.. ది జడ్జిమెంట్‌ డే'గా హిందీలోకి ఈ సినిమా డబ్‌ అయింది.

రాజమౌళి రూపొందించిన నాలుగో చిత్రం 'ఛత్రపతి'. ప్రభాస్, శ్రియ శరన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించగా.. సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. ఈ మూవీ 'డార్లింగ్‌' ప్రభాస్‌కు ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో మాస్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఇందులో ప్రత్యేక గీతంలో ఆర్తీ అగర్వాల్‌ అలరించింది. 'హుకుమత్‌ కి జంగ్‌'గా హిందీలోకి డబ్‌ అయిన ఈ సినిమా బాలీవుడ్‌లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

2006లో రాజమౌళి, మాస్‌ మహారాజ రవితేజ కలయికలో వచ్చిన మూవీ 'విక్రమార్కుడు'. ఈ చిత్రం నమోదు చేసుకున్న విజయం అంతాఇంతా కాదు. రాజమౌళి స్టైల్‌లో మరో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా హీరో కనబరిచిన సాహసం అనన్యసామాన్యం. సమాజంలో పోలీసు వృత్తి పట్ల మరింత గౌరవం పెరిగేటట్టు చేసిన చిత్రంగా 'విక్రమార్కుడు' నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 'రౌడీ రాథోడ్‌'గా ఈ సినిమా హిందీలోకి రీమేక్‌ అయింది. అక్కడ విజయాన్ని అందుకుంది.

రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలయికలో వచ్చిన మరొక సినిమా 'యమదొంగ'. ఈ చిత్రం ద్వారా మరో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రాజమౌళి. మమతా మోహన్‌ దాస్, ప్రియమణి హీరోయిన్లుగా నటించగా... రంభ ప్రత్యేక గీతంలో కనిపించారు. 'లోక్‌... పర్‌ లోక్‌'గా ఈ సినిమా హిందీలోకి డబ్‌ అయింది.

2009... రాజమౌళికి ప్రత్యేకం

దర్శకుడిగా రాజమౌళి అందుకున్న విజయాలు ఎన్నో. అయితే, 2009వ ఏడాదిలో రామ్ చరణ్, కాజల్‌ అగర్వాల్‌లను పెట్టి పూర్వ జన్మల నేపథ్యంలో రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'మగధీర' సినిమాను రూపొందించారు రాజమౌళి. ఈ సినిమా సృష్టించిన సంచలనాలు ఎన్నో.

రాజమౌళి 'మర్యాద రామన్న'

అంతపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత ఏ దర్శకుడైనా అగ్ర హీరోతో భారీగా సినిమాను రూపొందించాలని చూస్తారు. కానీ ఈ దర్శక ధీరుడి రూటే సెపరేటు. 'మగధీర' సినిమా తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన సినిమా 'మర్యాద రామన్న'. హాస్యనటుడు సునీల్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ప్రేక్షకులను నవ్వులలో ముంచెత్తిన ఈ సినిమా హిందీలోకి 'సన్‌ ఆఫ్‌ సర్దార్‌' పేరుతో డబ్‌ అయింది.

'ఈగ'తోనూ కలెక్షన్లు

అప్పటివరకు కుటుంబ తరహా నేపథ్యంలో హై ఓల్టేజ్‌ డ్రామాలు, యాక్షన్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్స్‌ మాత్రమే తెరకెక్కించిన రాజమౌళి 'ఈగ' అనే ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. నాని, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగించింది. రిలీజ్‌ తర్వాత బాక్సాఫీసుని షేక్‌ చేసిన ఈ సినిమా 'మక్కీ' పేరుతో హిందీలోకి డబ్‌ అయింది. 'ఈగ' సినిమాకు జాతీయ స్థాయిలో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు లభించింది.

బాక్సాఫీసును బద్దలు కొట్టిన 'బాహుబలి'

ఒక్క పరాజయం కూడా ఎరుగని తమ అభిమాన దర్శకుడు అత్యంత భారీగా తెరకెక్కిస్తోన్న 'బాహుబలి' చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఎదురు చూశారంటే అందులో సందేహం ఉండదేమో. 'ఈగ' తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన 'బాహుబలి - ది బిగినింగ్‌' చిత్రం 2015లో విడుదలవగా.. ఆ చిత్ర సీక్వెల్‌ 'బాహుబలి - ది కంక్లూజన్‌' సినిమా 2017లో విడుదల అయింది.

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచేసిన సినిమాలు ఇవి. తెలుగు సినిమా పరిశ్రమ ఊహకు అందనంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు ఇవి. ఎంత భారీగా తెరకెక్కాయో అంతకంటే భారీగా వసూళ్లను రాబట్టిన సినిమాల్లా ఇవి నిలిచాయి. 2015వ ఏడాదిలో 'బాహుబలి - ది బిగినింగ్‌' చిత్రం బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఎంపికయింది. ఇక 'బాహుబలి - ది కంక్లూజన్‌' సినిమా 'బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌'గా 2017లో అవార్డుని జాతీయ స్థాయిలో అందుకుంది.

పురస్కారాలు

ప్రతిభ ఉంటే ప్రశంసలే కాదు పురస్కారాలూ వచ్చిపడతాయి. ఇప్పటికే రాజమౌళి ఖాతాలో ఎన్నో పురస్కారాలు వచ్చి పడ్డాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు 'ఫిలింఫేర్‌' పురస్కారాలు నాలుగు సార్లు లభించాయి. ఉత్తమ దర్శకుడికి ఫిలింఫేర్‌ అవార్డులను 'మగధీర', 'ఈగ', 'బాహుబలి - ది బిగినింగ్‌', 'బాహుబలి - ది కంక్లూజన్‌' సినిమాలకు అందుకున్నారు.

'నందు'లు కూడా

ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులను 'మగధీర', 'ఈగ' సినిమాలకు అందుకున్నారు జక్కన్న. 'ఈగ' సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2014లో 'బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి నేషనల్‌ అవార్డు'నూ దక్కించుకున్నారు రాజమౌళి. 'బాహుబలి - ది బిగినింగ్‌' సినిమాకు మొదటిసారి 'ఐఫా' బెస్ట్‌ డైరెక్టర్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆ సినిమాకే ఉత్తమ దర్శకుడిగా సైమా పురస్కారాన్ని కూడా 2015లో అందుకున్నారు. 2009లో 'మగధీర' చిత్రానికి, 2015లో 'బాహుబలి - ది బిగినింగ్‌' చిత్రానికి బెస్ట్‌ డైరెక్టర్‌గా 'మా' అవార్డులు వరించాయి.

'ఆర్‌.ఆర్‌.ఆర్‌'పై ఆసక్తి

ప్రస్తుతం రాజమౌళి అత్యంత భారీగా రూపొందిస్తోన్న సినిమా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌లు మొదటి సారి స్కీన్ర్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ ఇద్దరు స్టార్లు రాజమౌళి దర్శకత్వంలో నటించారు. అయితే, మొదటిసారి ఇద్దరు కలిసి ఒకే స్కీన్ర్‌పై.. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాలో వర్క్‌ చేయడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోన్న అంశం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.