ETV Bharat / science-and-technology

రోబోలు నడిపే న్యూస్​ ఛానల్.. ప్రపంచంలోనే ఫస్ట్.. ఫేక్​ న్యూస్​కు నో ఛాన్స్​!

author img

By

Published : Mar 16, 2023, 5:20 PM IST

Updated : Mar 16, 2023, 6:55 PM IST

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వార్తాజీపీటీని ప్రవేశపెట్టింది న్యూస్​జీపీటీ సంస్థ. దీంతో మీడియా రంగంలో పని చేసే ఉద్యోగులకు ముప్పు రానుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

Etv Bharat
ప్రపంచంలోనే మొట్టమొదటి వార్తా జీపీటీ

చాట్​జీపీటీ.. కొద్దిరోజుల నుంచి దాదాపు అందరికీ పరిచయమైన పదం. సాంకేతికత అభివృద్ధిలో భాగంగా ఇటీవలే ప్రారంభమయిన ఈ చాట్​బాట్​ ప్రపంచవ్యాప్తంగా ఆశాజనకమైన ఫలితాలనిస్తున్నా.. కొన్ని చోట్ల విఫలమవుతోంది. అయినప్పటికీ భవిష్యత్​లో గూగుల్​కు పోటీగా వచ్చే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మీడియా రంగంలోనూ ఈ తరహా టెక్నాలజీని తీసుకొచ్చింది న్యూస్​జీపీటీ. దాని పేరే న్యూస్​జీపీటీ(వార్తాజీపీటీ). పూర్తి కృత్రిమ మేధతో(ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​)తో రూపొందించిన ఈ వార్తాజీపీటీ మున్ముందు మీడియా రంగంలో పని చేసే వారు ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుందని సాక్షాత్తు దీని రూపకర్త సంస్థ సీఈఓ అలాన్​ లెవీ పేర్కొన్నారు.

పూర్తిగా కృత్రిమ మేధతో రూపొందిన ఈ న్యూస్​బాట్ ప్రపంచంలోనే మొట్టమొదటి వార్తాజీపీటీగా నిలవనుంది. దీని ఆవిష్కరణతో మీడియాలో పనిచేసే వారి ఉద్యోగ భద్రతకు కచ్చితంగా ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వార్తాజీపీటీ కృత్రిమ మేధస్సుతో ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా ఓ వార్తా ఛానెల్​లా పనిచేస్తుందని సంస్థ తెలిపింది. మొత్తంగా మీడియా ప్రపంచంలో ఈ న్యూస్​బాట్​ ఓ గేమ్​ ఛేంజర్​గా మారనుందని లేవీ అన్నారు.

"ప్రస్తుతం ఉన్న వార్తా సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పక్షపాత ధోరణితో ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ న్యూస్​జీపీటీతో మేము అటువంటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతాము. ఎటువంటి పక్షపాత బుద్ధిని ప్రదర్శించకుండా, పూర్తి పారదర్శకతతో ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తాము."
- అలాన్​ లెవీ, న్యూస్​జీపీటీ సీఈఓ

విలేకరులు లేకుండా, అలాగే ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులు, వీక్షకులకు నిష్పాక్షికమైన, వాస్తవ ఆధారిత వార్తలను అందిస్తామని న్యూస్​జీపీటీ పేర్కొంది. న్యూస్​జీపీటీని newsGPT.ai అని టైప్​ చేసి దీని సేవలను ఉచితంగా పొందొచ్చని సంస్థ తెలిపింది.
మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సహాయంతో వార్తాజీపీటీ ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని సంఘటనలను గుర్తించి పూర్తి వివరాలను సరైన సమయానికి ప్రజలకు అందించగలదు. దీని కృత్రిమ మేధ(ఏఐ) అల్గారిథమ్‌లు సోషల్ మీడియా, న్యూస్ వెబ్‌సైట్‌లు, ప్రభుత్వ ఏజెన్సీలతో సహా అనేక రకాల మార్గాల నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి పాఠకులకు వివరించగలవు. అంతేగాక కచ్చితమైన, తాజా, నిష్పాక్షికమైన వార్తలను రూపొందించే సామర్థ్యం దీనికి ఉందని సంస్థ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ పరిణామాలు, ఆర్థిక శాస్త్రం, సైన్స్​ అండ్​ టెక్నాలజీతో పాటు అనేక అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు అందించే శక్తి సామర్థ్యాలు న్యూస్​జీపీటీకి ఉన్నాయి. మిగతా మీడియా సంస్థల్లా న్యూస్​జీపీటీలో వచ్చే వార్తలు అడ్వర్టైజర్లు​, రాజకీయ నాయకులు లేదా వ్యక్తిగత అభిప్రాయాల ద్వారా ప్రభావితం కావని సంస్థ స్పష్టం చేసింది. దీని అంతిమ లక్ష్యం నిరంతరం కచ్చితత్వంతో కూడిన విశ్వసనీయమైన సమాచారాన్ని వీక్షకులకు చేరవేయడమే అని సంస్థ తెలిపింది. ప్రతిఒక్కరు తప్పుడు సమాచారాన్ని కాకుండా సత్యాన్ని తెలుసుకోవడానికే దీనిని తీసుకువచ్చామని లేవీ అన్నారు. మైక్రోసాఫ్ట్​కు సంబంధించి ఓపెన్ఏఐతో 'జీపీటీ-4' అనే టెక్నాలజీతో న్యూస్​జీపీటీలోని వార్తలు ఫొటోలు, టెక్స్ట్​ను స్వీకరిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.

మరో చాట్​జీపీటీ.. బైదు ఎర్నీబాట్​..
సాంకేతికత విప్లవంలో భాగంగా వచ్చిన చాట్​జీపీటీకి సవాలు విసిరేందుకు మరో చాట్​బాట్​ అందుబాటులోకి వచ్చింది. అదే ఎర్నీబాట్. ఎర్నీ అంటే ఎన్​హాన్స్​డ్​ రిప్రెసెంటేషన్​ ఆఫ్​ నాలెడ్జ్​ ఇంటిగ్రేషన్​. చైనాకు చెందిన బైదు అనే సంస్థ దీనిని ఆవిష్కరించింది. దీన్ని రూపొందించడానికి 650 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని సంతకాలు కుడా చేసిందీ సంస్థ.

చైనా సెర్చ్​ ఇంజన్​ దిగ్గజం బైదు తన కృత్రిమ మేధ సహాయంతో ఎర్నీబాట్​ అనే చాట్​బాట్​ను మార్కెట్​లోకి అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్​ తెచ్చిన చాట్​జీపీటీకి దీటుగా పనిచేస్తుందని చాట్​జీపీటీ, ఎర్నీబాట్​ల మధ్య తేడాలను చూపిస్తూ ఓ వీడియోను కూడా బైదు కంపెనీ విడుదల చేసింది. కానీ, ఇక్కడకు వచ్చిన పెట్టుబడిదారులను ఎర్నీబాట్​ పనితీరు కాస్త నిరాశపరిచింది.

అయితే ప్రస్తుతం ఎర్నీబాట్​ ఇంకా పరిపూర్ణంగా పనిచేయట్లేదని, చాట్​జీపీటీకి ఉన్న డిమాండ్​ కారణంగా తమ సంస్థ ఎర్నీబాట్​ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసిందని బైదు సీఈఓ రాబిన్​ లీ వివరణ ఇచ్చారు. కాగా, ఎర్నీ బాట్ మొదటి వెర్షన్​ను 2019లోనే అభివృద్ధి చేశామని లీ చెప్పారు. ఫిబ్రవరీలోనే ఎర్నీబాట్​ ప్రయోగ దశ పూర్తయిందని ఆయన అన్నారు. ఇకపోతే ఎర్నీబాట్​ను అభివృద్ధి, పరిశోధన కోసం మొత్తం 3.4 బిలియన్​ డాలర్లు ఖర్చు చేశామని సంస్థ ప్రకటించింది. ఇది దాని ఆదాయంలో ఐదో వంతుకు సమానమని తెలిపింది.

Last Updated :Mar 16, 2023, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.