ETV Bharat / opinion

సంపన్న దేశాల్లో విస్తృతంగా బూస్టర్​ డోసు

author img

By

Published : Nov 18, 2021, 6:50 AM IST

కొవిడ్-19 వ్యాక్సినేషన్​
covid vaccination

కొవిడ్-19 వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో ఇజ్రాయెల్ దూసుకెళ్తోంది. ఇప్పటికే దేశ జనాభాలో 44 శాతం మందికి మూడో డోసు టీకా అందించి.. అగ్రగామిగా నిలిచింది. ఇదే దారిలో అమెరికా, బ్రిటల్​ లాంటి సంపన్న దేశాలు సైతం బూస్టర్​ డోసు పంపిణీని మొదలు పెట్టాయి.

ప్రపంచంలో అందరికన్నా ముందే ఇజ్రాయెల్‌ కొవిడ్‌ బూస్టర్‌ టీకాల పంపిణీని ప్రారంభించింది. మొత్తం 92 దేశాలు మూడో మోతాదు (బూస్టర్‌) టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధరించింది. ఇంతవరకు అమెరికా, టర్కీ, చిలీలు ఎక్కువ సంఖ్యలో బూస్టర్‌ డోసులు ఇచ్చాయి. ఇజ్రాయెల్‌ తన జనాభాలో 44 శాతానికి మూడో మోతాదు టీకాలు అందించి అగ్రగామిగా నిలిచింది. ఇకపై 5-11 ఏళ్ల పిల్లలకూ వ్యాక్సిన్లు వేయడానికి ఆ దేశ నిపుణుల బృందం ఆమోద ముద్ర వేసింది. మరోవైపు పూర్తిగా రెండు మోతాదులు తీసుకున్నవారి సంఖ్య గణనీయంగా ఉన్న దేశాల్లోనే కొవిడ్‌ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీనికి డెల్టా వేరియంటే ప్రధాన కారణం. రెండు డోసులూ తీసుకున్నవారు ఈ వేసవిలో తీవ్ర లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, వారి తరవాత ఒక్క మోతాదూ తీసుకోనివారూ ఆస్పత్రి పాలయ్యారు.

60శాతంకన్నా ఎక్కువ జనాభాకు రెండు డోసులు వేసిన ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీలలోనూ జులై, ఆగస్టుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ దేశాలన్నీ బూస్టర్‌ డోసులు మొదలుపెట్టాయి.

జాగ్రత్తలు తప్పనిసరి

ఇప్పటిదాకా భారత జనాభాలో దాదాపు 38.50 కోట్ల మందికే రెండు డోసుల టీకాలు అందాయి. మిగిలిన అందరికీ వాటిని చేరువ చేశాకే బూస్టర్‌ డోసు గురించి ఆలోచించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద వయసు వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, రెండు మోతాదులు తీసుకున్న ఆరు నెలలకు వారిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్లు ఇజ్రాయెల్‌, అమెరికా తదితర దేశాల పరిశోధనల్లో తేలింది. అలాంటి వారికి అక్కడ బూస్టర్‌ డోసులు ప్రారంభించారు.

కరోనా వైరస్‌ రూపాంతరం చెందినప్పుడూ బూస్టర్‌ డోసు అవసరమవుతుందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల చెబుతున్నారు. ముక్కు ద్వారా టీకాను బూస్టర్‌ డోసుగా ఇస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆయన పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశం తన మొత్తం జనాభాకు రెండు డోసుల టీకా రక్షణ కల్పించేందుకు ప్రాధాన్యమిస్తోంది. మరోవైపు అల్పాదాయ దేశాలు కనీసం ఒక్క మోతాదుకూ నోచుకోకుంటే సంపన్న దేశాలు మూడో డోసుకు పరుగులు తీయడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుపడుతోంది. అల్పాదాయ దేశాల జనాభాలో కేవలం 4.5శాతానికే ఒక్క మోతాదు టీకా అందగా; సంపన్న, మధ్యాదాయ దేశాలు 60శాతానికిపైగా ప్రజలకు రెండు డోసులూ ఇచ్చి, మూడో విడత ఇవ్వాలని చూస్తున్నాయి. అమెరికాలో 65 ఏళ్లు పైబడిన ప్రతి ముగ్గురిలో ఒకరికి బూస్టర్‌ డోసు వేశారు.

నేడు ప్రపంచవ్యాప్తంగా వేస్తున్న టీకాల్లో మూడో వంతు బూస్టర్‌ డోసులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అత్యధిక వ్యాక్సినేషన్‌ రేట్లు సాధించిన దేశాల్లోనూ కొవిడ్‌ కేసులు విజృంభించడాన్నిబట్టి- కేవలం టీకాలతోనే పని జరగదని, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

ఆ దేశమే ప్రయోగశాల!

ఇజ్రాయెల్‌లో పెద్ద వయసు వారికి నిరుడు డిసెంబరులో ఫైజర్‌-బయాన్‌ టెక్‌ టీకాలు వేయడం ఆరంభించారు. ఈ ఏడాది వేసవిలో డెల్టా వేరియంట్‌ విజృంభించినప్పుడు వారిలో తీవ్ర రోగ లక్షణాలు పొడచూపాయి. జులై నుంచి డెల్టా కేసులు మొదలై సెప్టెంబరు మధ్యకల్లా గరిష్ఠ స్థాయికి చేరాయి. దాంతో రెండు డోసులు వేసుకున్న పెద్దవారిలో ఆరు నెలలకల్లా యాంటీబాడీలు తగ్గిపోయినట్లు తేలింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌ 60 ఏళ్లు పైబడివారికి ఆగస్టు నుంచి బూస్టర్‌ డోసుల కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది ప్రపంచంలోనే ప్రథమం. అయినా అతి ధీమా పనికిరాదని గ్రహించి, మాస్కులను తప్పనిసరి చేసింది. వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు, కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు ధ్రువీకరించే గ్రీన్‌ పాస్‌ పద్ధతిని మరింత కట్టుదిట్టం చేసింది.

రెస్టారెంట్లు, ఈత కొలనులు, వ్యాపార సంస్థల కార్యాలయాలు తదితరాల్లో ప్రవేశానికి ఆ పాస్‌ను తప్పనిసరి చేసింది. రెండు మోతాదులు పూర్తయ్యి, బూస్టర్‌ డోసు తీసుకోవాల్సి ఉన్నా తీసుకోనివారికి అక్కడి ప్రభుత్వం అక్టోబరులో గ్రీన్‌ పాస్‌లు రద్దు చేసింది. కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చినవారు 24 గంటల్లో మళ్ళీ పాస్‌ తీసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. రెండు డోసులూ పూర్తయ్యాక కొవిడ్‌ కేసులు పెరగడం అమెరికా, ఐరోపాలకన్నా ఇజ్రాయెల్‌లోనే ముందు కనిపించింది. ఇప్పుడు మూడో మోతాదులను అందరికన్నా ఎక్కువగా వేయడంతో వాటి ప్రభావం ఎన్నాళ్లు ఉంటుందో తెలుసుకోవడానికి ఆ దేశమే ప్రయోగశాలగా నిలవనుంది. బూస్టర్‌ డోసు ప్రభావంపై ఇజ్రాయెల్‌లో అప్పుడే పరిశోధనలు మొదలయ్యాయి. ఆ ఫలితాలు రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు దిక్సూచి అవుతాయి.

- వరప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.