ETV Bharat / international

Afghanistan Crisis: అఫ్గాన్​ ప్రజలకు ఎందుకీ దుస్థితి?

author img

By

Published : Aug 29, 2021, 10:15 AM IST

క్షణమైనా తమ పసికందులను విడిచి ఉండని పచ్చిబాలింతలు కూడా... 'మీరైనా వేరే రాజ్యంలో బాగా బతకండి' అంటూ చంటిపిల్లల్ని కాబుల్‌ విమానాశ్రయంలో(Kabul airport) విసిరేస్తున్నారంటే ఒకనాటి తాలిబన్‌(Afghanistan Taliban) ఆటవిక పాలన వారినెంత వణికిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అమెరికన్‌ విమానాలన్నీ టౌన్‌ బస్సుల్ని తలపిస్తూ కిక్కిరిసిపోవడానికీ వారిపట్ల ఉన్న భయమే మూలం! ఆ భయానికీ ఈ సమస్యకూ ముగింపు ఎప్పుడూ ఎలా అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఆ ప్రశ్నకి కాలం చెప్పే జవాబు కోసమే అందరి నిరీక్షణ. అసలు అఫ్గాన్​ అల్లకల్లోలం(Afghanistan crisis) వెనక ఉన్న కారణాలేంటి? నాటి పాలకులు ప్రజలకు చేసిన ద్రోహం ఏమిటి?

Afghanistan
అఫ్గాన్​ ప్రజలకు ఎందుకీ దుస్థితి?

అసహాయశూరులూ... అద్వితీయ యోధులూ... ఆంగ్లేయుల్ని ప్రజాపోరాటంతో చిత్తుచేసిన అసామాన్యులూ నమ్మితే ప్రాణాన్నిచ్చే స్నేహశీలురూ... కాయకష్టం తప్ప కల్లాకపటం తెలియనివాళ్లూ... ఇదంతా అఫ్గాన్‌ ప్రజల గురించేనంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా! దాంతోపాటూ 'ఇన్ని ఉన్నా... వాళ్లకి ఎందుకీ దుస్థితి?'(Afghanistan crisis) అనే ప్రశ్నా ఉదయిస్తుంది. దానికి జవాబు వెతికితే అఫ్గాన్‌కి(History of Afhganistan) సంబంధించిన ఎన్నో ప్రత్యేకతలు కళ్లెదుట నిలుస్తాయి. పాలకులని చెప్పుకున్నవాళ్లు ప్రజలకి చేసిన ద్రోహం ఏమిటో తెలుస్తుంది. రండి చూద్దాం...

ది 1927 నవంబర్‌ 3... ఆయన పేరు అమానుల్లాఖాన్‌... అఫ్గానిస్థాన్‌ రాజు. ఆయన తన రాణి సురయాతో కలిసి ఆ రోజు ప్రపంచ పర్యటన మొదలు పెట్టాడు. భారతదేశం నుంచి ప్రారంభించి జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, ఇంగ్లండు... ఇలా సాగింది ఆయన పర్యటన. ఆమిర్‌(రాజు) తన భార్యతోపాటూ పాశ్చాత్య దేశాలకి వెళ్లాలనుకోవడం నాటి అఫ్గాన్‌లో ఓ విప్లవాత్మకమైన నిర్ణయం. అమానుల్లా అక్కడితో ఆగలేదు... తన బేగంకి పర్దా లేకుండానే అన్నిచోట్లా తిప్పాడు. సభల్లో తనతోపాటూ ఆమెనీ ప్రసంగించమన్నాడు. ఆ ఇద్దరి పర్యటన 1928 జనవరి దాకా సాగింది. అఫ్గాన్‌కి తిరిగిరాగానే తన సరికొత్త సంస్కరణలతో సంచలనం సృష్టించాడు అమానుల్లాఖాన్‌. బాల్యవివాహాలనీ, పెళ్ళిళ్లలో అమ్మాయిలకిచ్చే ఓలినీ నిషేధిస్తున్నట్టు ప్రకటించాడు. అమ్మాయిలు బడికెళ్లి చదువుకోవడం తప్పనిసరన్నాడు... అదీ అబ్బాయిలతో కలిసి చదువుకునే కోఎడ్యుకేషన్‌ పాఠశాలలే ఉండాలన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులెవ్వరికీ బహుభార్యాత్వం ఉండకూడదన్నాడు. ప్రభుత్వ కార్యాలయాలకి వచ్చేవాళ్లూ సంప్రదాయ అఫ్గాన్‌ దుస్తులు కాకుండా విదేశీ ప్యాంటూ షర్టూ వేసుకోవాలన్నాడు. న్యాయస్థానాలపైన మత పెద్దల(ఖాజీలు) అధికారాల్ని తొలగించి... ఆధునిక జడ్జిల పద్ధతి తెస్తామని ప్రకటించాడు. ఓ రకంగా అమానుల్లాఖాన్‌... నాటి అఫ్గాన్‌లోని పాత సంప్రదాయాలపైన తుపాకీ ఎక్కుపెట్టాడు. కాకపోతే, ఆ తుపాకీ అతని పైనే పేలింది. ఏడాది తిరగకుండానే అమానుల్లాపైన తిరుగుబాటు చెలరేగి కాబుల్‌ వీధులు రక్తసిక్తమయ్యాయి. అమానుల్లా ప్రాణభీతితో కుటుంబంతోపాటూ విదేశాలకి పారిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది..? అంత గొప్ప 'స్వాప్నికుణ్ణి' ప్రజలెందుకు కాలదన్నుకున్నారు? ఆ సంస్కరణల్ని అప్పట్లోనే అమలు చేసి ఉంటే ఈ పాటికి అఫ్గాన్‌ ఎంత గొప్పగా ఉండేది? అసలు తాలిబన్లనే ముష్కరులు పుట్టుకొచ్చేవాళ్లా...? ఈ ప్రశ్నలకి జవాబు కావాలంటే... అఫ్గాన్‌ ప్రజా చరిత్రని అర్థం చేసుకోవాలి...

Afghanistan
అఫ్గాన్​ రాజు అమానుల్లాఖాన్‌, రాణి సురయా

అఫ్గానిస్థాన్‌ విస్తీర్ణం ఇంచుమించు మన దక్షిణ భారతదేశం అంత ఉంటుంది. కాకపోతే కర్ణాటకలోని మైసూరు నుంచీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం దాకా అతి ఎత్తైన పర్వతాలుంటే ఎలా ఉంటుందో అఫ్గాన్‌ అలా ఉంటుంది. అఫ్గాన్‌ చరిత్రని నిర్ణయించింది ఈ హిందూకుష్‌ పర్వతశ్రేణులేనని చెప్పాలి. అఫ్గాన్‌లో ఒకదానికొకటి సంబంధంలేని విభిన్నమైన భౌగోళిక స్వరూపాలకి ఇవే ప్రధాన కారణం. ఈ పర్వతాలకి ఆవల ఉత్తర ప్రాంతం సారవంతమైన పచ్చికమైదానాలతో ఉంటుంది. నదులేవీ లేకపోవడం వల్లా రష్యా నుంచి వీచే పొడిగాలుల వల్లా ఇక్కడ జనాభా తక్కువ. ఈ పర్వతాలకి దక్షిణాన ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం. పశ్చిమం పీఠభూమి... కొండలూ, రాళ్లూ రప్పలు తప్ప ఏమీ ఉండవు. కాస్తో కూస్తో అడవులూ పచ్చదనమూ ఉండేది తూర్పు ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలోని హిందూకుష్‌ పర్వతాల అంచునే... రాజధాని కాబుల్‌ నగరం ఉంటుంది. ఇలా నాలుగురకాల నైసర్గిక స్వరూపం ఉన్నా... మళ్లీ వాటిల్లో వేటికవే చాలా విభిన్నంగా ఉంటాయి.

కాబుల్‌ చలికాలంలో -15 డిగ్రీల సెంటిగ్రేడ్‌లతో గజగజలాడిస్తే... అక్కడి నుంచి మూడుగంటల ప్రయాణంలోనే ఉన్న జలాలాబాద్‌ నగరం వెచ్చగా ఉంటుంది. ఉత్తరాన ఉన్న కుందుజ్‌ నగరం వేసవిలో 50 డిగ్రీల సెల్సియస్‌తో పెనంలా కాలితే... పక్కనే ఉన్న బదాక్షన్‌ ఎంతో చల్లగా ఉంటుంది. ఒకదానికొకటి సంబంధంలేనట్టున్న ఈ వాతావరణమే... ఇక్కడి పర్వతాల్లో వేటికవే భిన్నమైన తెగల్ని సృష్టించింది. ఆ తెగల మధ్య సంఘర్షణలే అఫ్గాన్‌ చరిత్రని నిర్ణయించాయని చెప్పాలి!

భారత్‌ నుంచే...

మనలాగా అఫ్గాన్‌కి జీవనదుల్లేవు. ఒక్క కాబుల్‌ నది తప్ప... హిందుకుష్‌ పర్వతాల్లో పుట్టిన చిన్నాచితకా నదులు కాస్తా పాకిస్థాన్‌కో, పక్కనే ఉన్న ఇరాన్‌కో వెళ్లి ఎడారిలోనే ఆవిరైపోతాయి. కాబట్టి నది పక్కన ఏర్పడే సస్యశ్యామల పంట క్షేత్రాలూ, వాటితో సమకూరే వ్యవసాయ సమృద్ధి, వాటి ఫలితంగా రూపొందే నగర, పట్టణ సంస్కృతీ అఫ్గాన్‌కి పరిచయం కాలేదు. ఇక వర్షాలూ అంతంతమాత్రమే. మనదేశంలో కురిసే ఈశాన్య రుతుపవనాలు డిసెంబరు నెల చిట్టచివర్లో 'పోతేపోనీ' అన్నట్టు అఫ్గానిస్థాన్‌ తూర్పున నాలుగు చినుకులు రాల్చిపోతాయంతే. ఇక్కడ చలికాలంలో కొండలపైన కురిసే మంచే పంటలకి ప్రధానమైన తడిని అందిస్తుంది. అందుకే అఫ్గాన్‌ ప్రజలు 80 శాతం గిరిజనులుగా కొండలకే పరిమితమయ్యారు. ఇక్కడి ప్రజలందరూ కాలాలకతీతంగా అలాగే ఉండిపోయుంటే... మనమంతా అఫ్గానిస్థాన్‌ గురించి ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. కానీ అందరూ అలా ఉండిపోలేదు. 90 శాతం మంది పల్లెల్లోనే ఉన్నా... కొందరు మాత్రం ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని దాటుకుని చిన్నవో పెద్దవో నగరాలని ఏర్పరుచుకోగలిగారు. అందుకు ప్రధాన కారణం... భారీస్థాయి వ్యవసాయం కాదు... భారతదేశం!

Afghanistan
అఫ్గాన్​ను వీడుతున్న ప్రజలు

అదిగదిగో ఇండియా...

చరిత్ర పూర్వకాలం నుంచీ భారతదేశంపైన ఏ విదేశీయులు దండయాత్ర చేయాలన్నా అఫ్గానిస్థాన్‌ నుంచే రావాలి. అలా దాటడానికి అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రధాన అవరోధాలైతే... మరో ప్రధాన పెద్ద సమస్య అక్కడి గిరిజన తెగలే! హిందూకుష్‌ పర్వతశ్రేణుల్లో వీళ్లతో యుద్ధంచేయడం అసాధ్యం. అందుకే భారతదేశం వైపు రావాలనుకునే ప్రతి ఒక్కరూ వీళ్లతో రాజీ కుదుర్చుకుంటారు, లేదా 'దోచుకున్నవాళ్లకి దోచుకున్నంత' అంటూ తమసైన్యంలో కలుపుకుని కొత్త రాజ్యాల్లో చిక్కే సంపదనంతా వీళ్లకి పంచుతారు. గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌ కూడా అలా వాళ్లని మంచి చేసుకుని వచ్చినవాడే... మనదేశానికి ఎవరు వచ్చినా అఫ్గాన్‌లతో ఇదే ఒప్పందం చేసుకున్నారు. వీళ్లిచ్చిన ఈ సంపదతోనే ఇక్కడ తూర్పు ప్రాంతంలో కాబుల్‌, దక్షిణాన కాందహార్‌, పశ్చిమాన హిరాత్‌ నగరాలు ఏర్పడ్డాయి. క్రమంగా ఈ గిరిజన గ్రామాలకి చెందిన పష్తూన్‌ తెగలవాళ్లు గొప్ప సైనికులుగా మారారు. పఠాన్‌లుగా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నారు.

18వ శతాబ్దంలో మొఘల్‌ సామ్రాజ్యం పతనావస్థకి చేరుకునే దశలో... అదే అదనుగా ఇరాన్‌ నుంచి నాదిర్‌ షా భారతదేశం మీద దండయాత్రకి బయల్దేరాడు. అఫ్గానిస్తాన్‌కి చెందిన అహ్మద్‌ ఖాన్‌ అతనికి అంగరక్షకుడిగా వెళ్లాడు. నాదిర్‌ షా పంజాబ్‌నీ, కశ్మీర్‌నీ జయించి దిల్లీనీ హస్తగతం చేసుకున్నాడు. కాకపోతే ఆ ఆనందం ఎంతోసేపు మిగలకుండానే అతను హత్యకి గురయ్యాడు. ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న అంగరక్షకుడు అహ్మద్‌ఖాన్‌ తనని ఆమిర్‌గా ప్రకటించుకున్నాడు. తన రాజ్యానికి 1750ల్లో అఫ్గానిస్తాన్‌ అని పేరుపెట్టింది ఇతనే. అప్పటి నుంచీ ఇప్పటిదాకా పష్తూన్‌ తెగకి చెందిన అనేక ఉపతెగలే అఫ్గాన్‌ని పరిపాలిస్తూ వస్తున్నాయి. తాలిబన్‌లు కూడా ఈ తెగవారే. వాళ్ల దాకా వెళ్లే ముందు... మధ్యలో జరిగిన కొన్ని కీలకపరిణామాల గురించి చెప్పుకోవాలి...

ఆంగ్లేయులు చిత్తు... చిత్తు!

1840ల్లో తొలి అఫ్గాన్‌ రాజు అహ్మద్‌ షా వంశానికి చెందిన షా సుజా అధికారంలోకి వచ్చాడు. అతనికి కుడిభుజంగా ఉంటూ వచ్చిన దోస్త్‌ మహ్మద్‌ తిరుగుబాటు చేసి తనను 'ఆమిర్‌'గా ప్రకటించుకున్నాడు. షా సుజా భారతదేశానికి పారిపోయి బ్రిటిష్‌వాళ్ల శరణుజొచ్చాడు. ఆ పంచాయతీ తీర్చడానికే తొలిసారి ఆంగ్లేయులు అక్కడి కొచ్చారు. అలా తొలిసారి అఫ్గాన్‌కి వచ్చిన ఆంగ్లేయులు... తమ సైనిక బలంతో దోస్త్‌ మహ్మద్‌ని జైల్లో పెట్టి షా సుజాని రాజుగా ప్రకటించారు. పాలనని తమ చేతుల్లోకి తీసుకున్నారు. విదేశీయులైన ఆంగ్లేయులు తమ రాజకీయాల్లో తలదూర్చడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. భారీ ఎత్తున నిరసనకి దిగి ఆయుధాలని చేతబూని 1842లో సైన్యాన్ని తరిమికొట్టారు! అలా ఒక్కసారి కాదు... 1868లో మరోసారీ, 1919లో చివరిసారీ బ్రిటిష్‌ సైన్యంతో తలపడి పైచేయి సాధించారు. ఆ చివరి యుద్ధం జరిగింది అమానుల్లాఖాన్‌ నేతృత్వంలో. ఆ ఊపుతోనే తన రాణితో కలిసి ఐరోపా పర్యటనకి వెళ్లిన అమానుల్లాఖాన్‌ అక్కడున్న ఆధునికతని ఇక్కడా హై-స్పీడ్‌లో తేవాలనుకుని... చివరకు రాజ్యాన్నే కోల్పోయాడు.

తిండే లేకుంటే...

బలమైన గిరిజన సమూహాల కలయికే అఫ్గాన్‌ అనుకున్నాం కదా! అఫ్గాన్‌ని ఎవరు పరిపాలించినా... చుట్టూ ఉన్న గిరిజన గ్రామాల స్వయంప్రతిపత్తినీ వాళ్ల కట్టుబాట్లనీ ఒప్పుకుని తీరాల్సిందే. ఆ కట్టుబాట్లతో కలగలిపే వాళ్లు ఇస్లాం మతాన్ని ఆరాధిస్తారు. వాళ్లకి మతం కేవలం ఆచారం కాదు, ఓ జీవనవిధానం. ఎంతపెద్ద పంచాయతీనైనా 'దేవుడి మీద ఆన' అన్న ఒక్కమాటతో పరిష్కరించేస్తారు. గిరిజన సంస్కృతిలో స్త్రీలపైనున్న ఆంక్షల్ని... మతమే తెచ్చిందన్నది వాళ్ల విశ్వాసం. కానీ ఆ దృక్పథాన్ని మార్చడం పెద్ద కష్టమేం కాదు. టర్కీ, పర్షియాలాంటివి అలా సంస్కరణల్ని తెచ్చి ప్రజల్ని ఒప్పించిన రాజ్యాలే! అయితే 'అలాంటి సంస్కరణలకి ముందు ప్రజలకి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. అప్పుడుకానీ మంచి మార్పులు రావు' అంటాడు కార్ల్‌ మార్క్స్‌. అమానుల్లా అది చేయడమే మరిచాడు. అతని పాలనలో గ్రామీణుల ప్రతి చిన్న ఆదాయంపైనా పన్నులుండేవి. ఓ దశలో పన్నులు కట్టేవాళ్లకంటే వాళ్లని జలగల్లా పీల్చే అధికారుల సంఖ్యే ఎక్కువుండేదట. వీళ్లతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌ జనాలకి... మంచోచెడో వాళ్లు ప్రాణప్రదంగా భావిస్తున్న కట్టుబాట్లని వదులుకోండని చెబితే ఏం మింగుడుపడుతుంది? అందుకే, గొప్ప సంస్కరణలను తీసుకొచ్చినా-అమానుల్లాఖాన్‌కి వ్యతిరేకంగా తిరుగుబాటు రేగి అతణ్ని దేశభ్రష్టుణ్ని చేసింది.

చైతన్యమే కానీ...

అప్పటి నుంచి అఫ్గాన్‌లోకి వచ్చిన ప్రతిరాజూ అఫ్గాన్‌లోని వివిధ తెగలవాళ్లని చూసి భయపడి పోయారంటే అతిశయోక్తి కాదు! అధికారం కోసం ఓ తెగని మచ్చికచేసుకుని మిగతావాళ్లని ఊచకోత కోసేవారు. ఆ గిరిజన తెగల యువకులు 1990లలో- అక్కడ యూనివర్సిటీలూ, కాలేజీలూ ఏర్పడ్డ తర్వాత- నగరాలకీ రావడం మొదలుపెట్టారు. వాళ్లలో కొందరు సోషలిజం వైపూ, మరికొందరు ఇస్లాంమతం వైపూ వెళ్లారు. చదువులు పెరిగినా... అందుకు తగ్గ ఉద్యోగాల్లేక యువతలో నిస్పృహ పెరిగింది. ప్రజల్లోని ఆ నిస్పృహని ఆధారం చేసుకుని దావూద్‌ అనే అధికారి... 1973లో నాటి 'షా' పాలనని కూల్చేసి తొలిసారి అఫ్గాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు! అయితే అతని నిరంకుశ వైఖరి నచ్చక అతణ్ణి కూలదోసి కమ్యూనిస్టు పీడీపీఏ (పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌) అధికారాన్ని చేజిక్కించుకుంది. మళ్లీ వాళ్లలోవాళ్లకి కుమ్ములాట మొదలైంది! అందులోని ఓ వర్గం అమెరికా వైపు వెళుతోందని అనుమానించిన రష్యా అఫ్గాన్‌ని హస్తగతం చేసుకుంది! తనదైన భూ సంస్కరణల్ని అమలు చేయడం మొదలుపెట్టింది. సంస్కరణలు తర్వాత... 'అసలు ఓ పరాయిదేశం మమ్మల్ని పాలించడం ఏమిటం'టూ అఫ్గాన్‌ ప్రజలు ఎదురుతిరిగారు. అదే అఫ్గాన్‌లో అతిపెద్ద అంతర్యుద్ధానికి దారితీసింది...

పాకిస్థాన్‌, అమెరికాలు...

నగరాల్లో ఉన్నవాళ్లే కాకుండా వివిధ గ్రామాల్లోని గిరిజన తెగలకి చెందినవాళ్లూ ఈ అంతర్యుద్ధంలో పాల్గొన్నారు! ఒకప్పటి కమ్యూనిస్టు పార్టీ పీడీపీఏ కూడా రష్యాకి వ్యతిరేకంగా రంగంలోకి దిగింది. అక్కడి గిరిజన యువతని సోషలిస్టు సిద్ధాంతాలకన్నా... మతగురువుల ఇస్లాం తత్వమే ఎక్కువగా ఆకర్షించింది. 'అసలుసిసలు ముస్లిందేశమైన అఫ్గాన్‌ని నాస్తికవాద రష్యా నుంచి రక్షించండి' అంటూ పాకిస్థాన్‌లోని రాజకీయనాయకులు ఎలుగెత్తారు. వాళ్ల నేతృత్వంలోనే నాలుగు రకాల ముజాహిదీన్‌(పవిత్ర యుద్ధవీరులు) పార్టీలు ఏర్పడ్డాయి. వాళ్లకి అమెరికా ఇతోధికంగా ఆయుధాల్నీ, డబ్బునీ అందించింది. సౌదీ అరేబియా కూడా కొన్ని వర్గాలని సృష్టించింది. మొత్తానికి రష్యాకి వ్యతిరేకంగా జరిగిన ఈ యుద్ధంలో పది లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. ఓ దశలో అఫ్గాన్‌పైన పోరాటానికి బిలియన్‌లకొద్దీ ఖర్చుపెట్టడం వృథా అనుకున్న రష్యా... 1989లో 'మీ రాజ్యం మీరే ఏలుకోండి!' అంటూ వెళ్లిపోయింది. 'ఉమ్మడి శత్రువు' రష్యా అలా వెళ్లగానే అప్పటిదాకా ఐక్యంగా పోరాడుతున్నవాళ్ల మధ్య విభేదాలు రచ్చ కెక్కాయి. ఒకర్నొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. పీడీపీఏ కొంతకాలం పాలించినా అదీ కూలిపోయింది. ముజాహిదీన్‌లు ఎవరికివారే వేరై తమదైన సైన్యాన్ని ఏర్పరచుకుని కాబుల్‌లో ఒకరూ, కాందహార్‌లో ఒకరు, హిరాత్‌ నగరంలో ఒకరూ పాగా వేశారు తప్ప ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయారు. రాజ్యం ఉంది, ప్రజలూ ఉన్నారు... కానీ పాలకులెవ్వరూలేని విచిత్ర పరిస్థితి అది! ఆ ఖాళీనే భర్తీ చేయడానికొచ్చారు తాలిబన్‌లు!(Afghanistan Taliban)

Afghanistan
1989 తర్వాత అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు

ఎవరు వీళ్లు...?

ఒకప్పుడు మన అగ్రహారాల్లో గురుకులాలుండేవి. అక్కడికొచ్చి చదువుకునే విద్యార్థులకి స్థానికులు రోజుకొకరి లెక్కన భోజనం పెట్టేవారు. ఈ విద్యార్థులే వారాలబ్బాయిలు. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బండిలోని మదర్సాలు ఇదే పద్ధతిని ముస్లిం విద్యార్థుల కోసం అమలు చేసేవి. అందులోని వారాలబ్బాయిల్నే 'తాలిబ్‌'లు అనేవారు. ఇది పాకిస్థాన్‌కీ పాకింది. అప్పటి అధ్యక్షుడు జియా ఉల్‌ హక్‌ దీన్ని ఓ వ్యవస్థగానే మార్చాడు. నిరుపేద విద్యార్థుల్ని చేరదీసి మదర్సాల్లో ఉచితంగా చదువు చెప్పించాడు. అఫ్గానిస్థాన్‌ అంతర్యుద్ధంతో పొట్టచేతపట్టుకుని పాకిస్థాన్‌కి వచ్చినవాళ్ల పిల్లలూ మదర్సాల్లో ఎక్కువగా చేరారు. ఈ చిన్నారులకి జిహాదీ భావజాలాన్ని నూరిపోసిన పాకిస్థాన్‌... వాళ్లకి పోరాటాన్నీ నేర్పింది. రష్యాపై యుద్ధం తర్వాత- తాను సాయం చేసిన ముజాహిదీన్‌లు... పాలకులుగా బలపడకుండా పరస్పరం దాడులకు తెగబడుతుండడంతో పాకిస్థాన్‌కి ఈ తాలిబన్‌లే ప్రత్యామ్నాయంగా కనిపించారు. ఫలితంగా తమ ఆధ్యాత్మిక గురువు 'ఒంటికన్ను' ఒమర్‌ అబ్దుల్లా మార్గదర్శకత్వంలో కాందహార్‌ని చేజిక్కించుకున్న తాలిబన్‌లు... 1996కల్లా మొత్తం అఫ్గాన్‌ని ఆక్రమించేశారు. వీళ్ల రాకతోనైనా అఫ్గాన్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని సంతోషించారు సగటు అఫ్గాన్‌వాసులు. వాళ్ల ఆశలు కల్లలవడమే... 21వ శతాబ్దంలో అఫ్గాన్‌ విషాద చరిత్ర! తాలిబన్‌లు పష్తూన్‌ గిరిజన తెగకి చెందినవాళ్లని చెప్పుకున్నాం కదా. పక్క తెగ అంటే ఇంతకూడా పడని అక్కడి గిరిజన సంస్కృతికి... పాకిస్థాన్‌ ప్రచారం చేసే తీవ్ర మతభావజాలం తోడై ఏర్పడ్డ రాక్షస రూపమే తాలిబన్‌ అని చెప్పాలి. ఈ ముష్కర ముఠా తొలిసారి అధికారం చేపట్టేటప్పటికి కాబుల్‌కి పశ్చిమంలోని హిరాత్‌ నగరం, ఉత్తరంలోని పంజ్‌షీర్‌, మజార్‌-ఇ-షరీఫ్‌ ప్రాంతాలు వాళ్ల చేతుల్లోకి రాలేదు. ఇవన్నీ కూడా పష్తూన్‌ తెగకి శత్రువులైన హజారా, తారీక్‌ వంటి తెగలవి! అందుకే ఈ ప్రాంతాల్లోని ప్రజల్ని ఊచకోత కోయడం మొదలుపెట్టారు. ఊరికే తుపాకులతో కాల్చడంతోనే ఊరుకోలేదు... ప్రాణాలతో దొరికినవాళ్ళని కాళ్ళూ చేతులూ నరికి... సజీవంగా చర్మాన్ని వలిచి వీధుల్లో పడేశారు! మరోవైపు పాకిస్థాన్‌ ప్రభావంతో ఇస్లాం షరియత్‌కి తమదైన భాష్యం చెప్పారు. 'స్త్రీ బురఖాతోనే బయటకు అడుగుపెట్టాలి, వచ్చినా తన సమీప బంధువుతోనే రావాలి. పరాయివాళ్లతో కనిపిస్తే అది వ్యభిచారమే!' అంటూ ప్రకటించారు. అప్పటిదాకా అఫ్గాన్‌ విద్యాసంస్థల్లో 80 శాతం మంది మహిళా టీచర్లు ఉంటే... వాళ్లలో ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని హుకుం జారీ చేశారు. ఆడపిల్లల బడులన్నింటినీ బాంబులుపెట్టి మరీ కూల్చారు. బిడ్డలకి పోలియో వ్యాక్సిన్‌ వేయడమే పాపమంటూ... ఆ పనికోసం వచ్చిన విదేశీ వనితల్ని కాల్చిచంపారు. వీటితో- నగరాల్లో అభ్యుదయ భావాలున్న పష్తూన్‌ తెగవాళ్లూ తిరగబడితే... తాలిబన్‌లు వాళ్లనీ హతం చేయడం మొదలుపెట్టారు. ఇలా ఆరేళ్ల తాలిబన్‌ల పాలనలో పదిలక్షలమందికి పైగా చంపేసినట్టు అంచనా!

అమెరికా రంగప్రవేశం

ఇవన్నీ ఒకెత్తు... అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదాకి సాయపడటం మరొకెత్తు! అఫ్గాన్‌ నేలపై నుంచే అమెరికా జంట భవనాలని అల్‌-ఖైదా కూల్చడంతో... దెబ్బతిన్న పులిలా అమెరికా అఫ్గాన్‌పైన పంజా విసిరింది. పెద్దగా పోరాడకుండానే కాబుల్‌ని వదిలి తాలిబన్‌లు దక్షిణాదికి పారిపోయారు. 2001లో అఫ్గాన్‌లో నవశకం మొదలైంది! అప్పుడు రెండు అద్భుతాలు చోటుచేసు కున్నాయి. తమపైన ఏ పరాయిదేశం దాడి చేసినా సహించలేని అఫ్గాన్‌ తెగలు... తొలిసారి అమెరికాకి మద్దతు తెలపడం మొదటిది. ఇక రెండో అద్భుతం... తెగల మధ్య ఉన్న పగలన్నీ మరచి దాదాపు దేశంలోని ప్రధాన రాష్ట్రాలన్నిటికీ ప్రాతినిధ్యం లభించేలా... హమీద్‌ కర్జాయ్‌ నేతృత్వంలో ప్రజాస్వామ్య పాలన ఏర్పడటం, ఆ తర్వాతి ఎన్నికల్లో దానికి భారీ మెజార్టీ లభించడం! కానీ పదేళ్లు తిరగకుండానే ఆ కల కరిగిపోయింది. కొత్త పాలనలోని అవినీతి ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది. అధ్యక్షుడు- ఆయన కింద రాష్ట్ర గవర్నర్లు-వాళ్ల కింద జిల్లా గవర్నర్లు... ప్రభుత్వం ఇక్కడికే పరిమితమై గ్రామాలకి చేరుకోనేలేదు. పట్టణాల్లో నిరుద్యోగం పెరిగిపోయింది. విదేశీ నిధులతో ఎన్నో కాలేజీలూ, ఆసుపత్రులూ నిర్మించారుకానీ వాటి కోసం అధ్యాపకుల్నీ వైద్యుల్నీ తయారుచేసుకోలేకపోయారు. భారీ నిర్మాణ కాంట్రాక్టుల్ని చేపట్టినా... విదేశీయులకి తప్ప అఫ్గాన్‌ వాసులకెవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. దాంతో 2001 నాటి ప్రజాస్వామ్య స్ఫూర్తి నీరుగారిపోయింది! ఆ పరిస్థితిని కొన్ని తెగల ప్రముఖులు వాడుకున్నారు. యువతని కూడగట్టుకుని ప్రభుత్వంపైన దాడికి దిగారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న తాలిబన్‌ల పంచన చేరారు కొందరు. దాంతో పదేళ్లు తిరక్కుండానే తాలిబన్‌లు మళ్లీ పుంజుకున్నారు. విదేశీ సేనలతో తలపడటం మొదలుపెట్టారు. అఫ్గాన్‌లాంటి తీవ్రమైన పరిస్థితులున్న గడ్డపైన తమ సేనలు ఉండాలంటే ఏడాదికి వేలకోట్ల రూపాయలు అమెరికా ఖర్చుచేయాల్సి వచ్చింది! ఆ ఖర్చుని భరించలేక- ట్రంప్‌ హయాంలోనే తిరిగివెళ్లాలని(troops evacuation) నిర్ణయించుకుంది!

తాలిబన్‌ అఫ్గాన్‌కి(Afghan taliban) పట్టిన క్యాన్సర్‌లాంటిదే! కానీ ఆ క్యాన్సర్‌ని శస్త్రచికిత్స చేసి పూర్తిగా తొలగించలేకపోయింది అమెరికా. దానిపైన పోరాడే తాత్కాలిక ఔషధాలన్నట్టే సైన్యాన్ని ఉంచింది. స్థానిక మద్దతుతో గట్టి రోగనిరోధక శక్తిలా పనిచేయాల్సిన అఫ్గాన్‌ ప్రభుత్వమూ అవినీతితో బలహీనమైంది. ఆ మందులు వేయడం మానగానే... మళ్లీ క్యాన్సర్‌ తిరగబెడుతుందన్న విషయం తెలిసినా- రకరకాల కారణాల వల్ల మిలటరీని వెనక్కి తీసుకుంది. అందరూ భయపడినట్టే తాలిబన్‌లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్నారు.

ఇదీ చూడండి: ISIS Kabul Attack: ఏంటీ ఐసిస్​-కే? తాలిబన్లకు శత్రువా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.