ETV Bharat / international

Taliban on Kashmir: కశ్మీర్​పై మాట మార్చిన తాలిబన్లు!

author img

By

Published : Sep 3, 2021, 1:07 PM IST

కశ్మీర్​ విషయంలో జోక్యం చేసుకోమని ప్రకటించి తాలిబన్లు(Afghan Taliban) మాటా మార్చారా? వారి ప్రతినిధి మాటలు వింటే నిజమే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్​లోని(Taliban on Kashmir) ముస్లింల కోసం పోరాడతామని, అది తమ హక్కు అని అతడు ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

Taliban on Kashmir
కశ్మీర్​పై మాట మార్చిన తాలబన్లు!

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు(Afghan Taliban) అధికారంలోకి వస్తే భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు ఆ దేశం నిలయం అవుతుందేమోననే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కశ్మీర్​ విషయంలో(Taliban on Kashmir) జోక్యం చేసుకోబోమని తాలిబన్లు(Taliban News) చేసిన ప్రకటనతో కాస్త ఉపశమనం లభించింది. అయితే తాజాగా తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ చేసిన ప్రకటన భారత్​ను కలవరానికి గురిచేస్తోంది. కశ్మీర్​లోని ముస్లింల కోసం తాము పోరాడతామని బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు స్పష్టం చేశాడు. అయితే ఏ దేశంపైకి ఆయుధాలు ఎత్తబోమని పేర్కొన్నారు.

"మాకు ఆ హక్కు ఉంది. కశ్మీర్​లోని ముస్లింల కోసం గళమెత్తుతాం. భారత్​ సహా ఏ ఇతర దేశంలోని ముస్లింల కోసమైనా పోరాడతాం. ముస్లింలు కూడా మీ సొంత ప్రజలే. మీమీ చట్టాల మేరకు వాళ్లకు కూడా సమాన హక్కులు కల్పించాలి. " అని షహీన్ పేర్కొన్నాడు.

అయితే షహీన్ చేసిన ప్రకటన కాబుల్​ను(Kabul News) ఆక్రమించుకున్న అనంతరం తాలిబన్లు చేసిన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉంది. కశ్మీర్ భారత్ అంతర్గత, ద్వైపాక్షిక అంశమని, మేం జోక్యం చేసుకోమని వారు ప్రకటించారు. కానీ ఇప్పుడు షహీన్ స్టేట్​మెంట్​ను​ గమనిస్తే వారు మాట తప్పే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

భారత్ భయమదే..

అఫ్గానిస్థాన్(Afghanistan News)​ ఉగ్రకార్యకలాపాలకు కేంద్రబిందువు కాకుండా చూడటమే తమ లక్ష్యమని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందర్ బాగ్చీ గురువారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్​ తాలిబన్లతో కతర్ వేదికగా తొలిసారి అధికారిక చర్చలు జరిపింది. మంగళవారం జరిగిన ఈ భేటీలో తాలిబన్ల నాయకుడు మహమ్మద్​ అబ్బాస్ స్తానెక్​జాయ్​ పాల్గొన్నారు. భారత్​ వ్యతిరేక కార్యకలాపాలు, తీవ్రవాదానికి అప్గాన్​ నిలయం కావొద్దని చర్చ జరిగింది. అఫ్గాన్​లో ఇంకా ఉన్న భారతీయులు, అక్కడి నుంచి భారత్​ రావాలనుకుంటున్న అఫ్గాన్ పౌరుల అంశపైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

తాలిబన్ల ప్రభుత్వం(Taliban Rule in Afghan) వస్తే ఇస్లామిక్ తీవ్రవాదానికి అఫ్గాన్ కేంద్రంగా మారుతుందని భారత్ ఆందోళనతో ఉంది. ఐసిస్, అల్​ఖైదా గతంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాయి. సున్నీ, వహాబి ఉగ్ర సంస్థలు కూడా తాలిబన్ల రాకతో బలపడతాయనే భయాలున్నాయి.

ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలోనే కశ్మీర్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని, పాకిస్థాన్​కు చెందిన ఉగ్రసంస్థలు అఫ్గాన్​ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం కొంతమేర ఉందని అధికారిక వర్గాలు గతవారం తెలిపాయి. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్​ఐకి అఫ్గాన్​తో మంచి సంబంధాలున్నాయని, తాలిబన్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరగవచ్చని అభిప్రాయపడ్డాయి. అయితే తాలిబన్లు ఇప్పుడు ఎంతో బలమైన స్థితిలో ఉన్నందున ప్రభావితం కాకపోవచ్చని పేర్కొన్నాయి.

పాకిస్థాన్ అధికార పార్టీ పీటీఐ నాయకుడు ఇటీవల ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. కశ్మీర్​ విషయంలో పాక్​కు సాయం చేస్తామని తాలిబన్లు మాటిచ్చారని అతను ప్రకటించాడు.

అమెరికా విదేశాంగ మంత్రితో శ్రింగ్లా భేటీ..

అఫ్గాన్​ పరిణామాల నేపథ్యంలో మిత్ర దేశాలతో చర్చలు ముమ్మరం చేసింది భారత్. అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా.. బైడెన్ పాలకవర్గంలోని కీలక సభ్యులను వాషింగ్టన్​లో గురువారం కలిశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​, సహాయ మంత్రి వెండీ షెర్మన్​తో భేటీ అయ్యారు. అఫ్గాన్ పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అఫ్గాన్​ను తాలిబన్లు తమ వశం చేసుకున్న తర్వాత.. భారత్-అమెరికా ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారి. శ్రింగ్లా బుధవారం అమెరికా వెళ్లారు.

ఇదీ చదవండి: 3 రోజుల్లో తాలిబన్‌ సర్కార్- సుప్రీం లీడర్‌గా అఖుంద్‌ జాదా

India Taliban Talks: 'కశ్మీర్ కోసం తాలిబన్లతో భారత్ డీల్​!'

Pak Taliban: 'కశ్మీర్​ విషయంలో పాక్​కు తాలిబన్ల సాయం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.