ETV Bharat / international

అఫ్గాన్ నుంచి పౌరుల తరలింపునకు అమెరికా​ కొత్త స్కెచ్​

author img

By

Published : Sep 7, 2021, 6:11 PM IST

బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత అఫ్గానిస్థాన్​లో చిక్కుకున్న తమ పౌరుల తరలింపునకు(american evacuation from afghanistan) అమెరికా కొత్త స్కెచ్​ వేసిందా? అందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుందా? తాలిబన్ల(Afghan Taliban) కళ్లుగప్పి నలుగురు పౌరులను సరిహద్దు దాటించటం చూస్తే ఔననే అనిపిస్తోంది.

evacuation
అఫ్గాన్ నుంచి పౌరుల తరలింపునకు అమెరికా​ కొత్త స్కెచ్​

అఫ్గానిస్థాన్​ నుంచి ముందుగా నిర్ణయించిన గడువులోపే తమ బలగాలను ఉపసంహరించుకుంది అమెరికా(america evacuation). గడువులోపు పూర్తిస్థాయిలో తమ దేశ పౌరులను తరలించలేకపోయింది. అయితే.. అఫ్గాన్​లో చిక్కుకుపోయిన తమ పౌరుల తరలింపు కోసం కొత్త స్కేచ్​ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా నలుగురు తమ దేశ పౌరులను భూమార్గం ద్వారా మూడో దేశానికి సురక్షితంగా పంపించినట్లు అమెరికా వెల్లడించింది. ఆగస్టు 31 తర్వాత అఫ్గాన్​ నుంచి తరలించిన తొలి బృందంగా అగ్రరాజ్య విదేశాంగ శాఖ పేర్కొంది.

"అఫ్గాన్​ సరిహద్దు దాటి మూడో దేశానికి సురక్షితంగా వెళ్లిన తమ పౌరులకు మా ఎంబసీ శుభాకాంక్షలు తెలిపింది" అని విదేశాంగ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నట్లు సీఎన్ఎన్​ మీడియా వెల్లడించింది. అయితే.. అమెరికా పౌరులను తరలించిన ఆ మూడో దేశం వివరాలను అధికారులు బయటపెట్టలేదని తెలిపింది.

మరోవైపు.. అఫ్గాన్​ నుంచి భూమార్గం ద్వారా సరిహద్దు దాటేందుకు అతిదగ్గరగా ఉన్న దేశం పాకిస్థానేనని తన కథనంలో పేర్కొంది డాన్​ న్యూస్​పేపర్​. 'వాళ్లు ఏ మార్గాన్ని ఉపయోగించారనేది మాకు తెలియదు. కానీ, అఫ్గాన్​ నుంచి అమెరికా పౌరులను తరలించేందుకు మాకు ఎలాంటి సమస్య లేదు. అఫ్గాన్​ నుంచి పౌరుల తరలింపునకు పాకిస్థాన్​ అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుంది. పాకిస్థాన్​ మీదగా ఇప్పటి వరకు 9వేల మందిని తరలించారు. ఈ విషయంలో ఇప్పటికీ అంతర్జాతీయ సమాజానికి పాక్​ మద్దతుగా నిలుస్తోంది.' అని అమెరికాలోని పాక్​ రాయబారి డాక్టర్​ అసద్​ మజీద్​ ఖాన్​ డాన్​ పత్రికకు తెలిపారు.

తాలిబన్లతో చర్చలు..

మరోవైపు... అఫ్గానిస్థాన్​ను వీడాలనుకుంటున్న వారిని తరలించేందుకు కాబుల్​కు ప్రత్యేక ఛార్టర్డ్​ ఫ్లైట్స్​ నడిపేందుకు తాలిబన్లతో(Afghan Taliban) చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​. సరైన పత్రాలు ఉండి దేశాన్ని వీడాలనుకుంటున్న వారిని సురక్షితంగా తరలించేందుకు తాలిబన్లు భరోసా కల్పించారని గుర్తు చేశారు. ఆ మాటకు తాలిబన్లు కట్టుబడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అఫ్గాన్​లో మరో 100 మంది వరకు అమెరికా పౌరులు ఉంటారని అంచనా వేశారు.

అంతకు ముందు విదేశాంగ శాఖ అంచనా ప్రకారం 100-200 మంది ఇంకా అఫ్గాన్​లో ఉన్నారు. ప్రస్తుతం యూఎస్​ విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్​, రక్షణ శాఖ మంత్రి లాయిడ్​ ఆస్టిన్​ ఖతార్​ పర్యటనలో ఉన్నారు.

వారికి తాలిబన్ల అనుమతి..

చెల్లుబాటు అయ్యే వీసాలు, పాస్​పోర్టులు ఉండి.. మజర్​ ఏ షరీఫ్​ నగరంలో చిక్కుకున్న అఫ్గాన్​ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించారు తాలిబన్లు. పౌరుల తరలింపునకు సిద్ధంగా ఉన్న నాలుగు విమానాల్లో ఏదో ఒకదాన్ని పట్టుకుని దేశాన్ని వీడాలని చాలా మంది అఫ్గాన్​ పౌరులు చూస్తున్నారని, కానీ, పాస్​పోర్టు, వీసా ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు విమానాశ్రయ అధికారి మవ్​లావీ హఫీజ్​ మన్సూర్​. అయితే.. ఎంత మంది వద్ద వీసా, పాస్​పోర్టులు ఉన్నాయి, ఎంత మంది వద్ద లేవు అనే విషయాన్ని వెల్లడించలేదు.

బగ్రామ్​ ఎయిర్​బేస్​ వార్తలు ఫేక్​..

అఫ్గానిస్థాన్​లోని కీలకమైన వైమానిక స్థావరం బగ్రామ్​ ఎయిర్​బేస్​ను(bagram airfield) చైనాకు అప్పగించాలని తాలిబన్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా తప్పని కొట్టిపారేసంది డ్రాగన్​. ఈ విషయంపై విలేకరులు అడగగా.. ' ఇది పూర్తిగా అసత్య వార్త​ అని మీకు చెబుతున్నా' అని తెలిపారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్​ వెన్​బిన్​.

అమెరికా సాగించిన రెండు దశాబ్దాల పోరాటంలో బగ్రామ్​ ఎయిర్​బేస్​ కీలక పాత్ర పోషించింది. ఇటీవలే దానిని అగ్రరాజ్య బలగాలు వీడిన క్రమంలో తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి: తాలిబన్ సర్కారు ఇదే.. దేశాధిపతి ఎవరంటే...

Haqqani Taliban: పాక్‌ స్క్రీన్‌ ప్లే.. హక్కానీల హైడ్రామా!

పాకిస్థాన్​కు వ్యతిరేకంగా అఫ్గాన్​లో ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.