ETV Bharat / crime

attack on car driver news: ఎస్సై అభ్యర్థిని కోమాలోకి పంపారు..

author img

By

Published : Aug 9, 2022, 10:50 AM IST

attack on car driver news: నిరుపేద కుటుంబ నేపథ్యం. డిగ్రీ పూర్తి చేసి తండ్రికి అండగా ఉండాలనుకున్నాడు. పోలీసు కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబానికి భారం కావొద్దనే ఉద్దేశంతో క్యాబ్‌ నడుపుతూనే ఎస్సై రాత పరీక్ష శిక్షణ పూర్తి చేశాడు. అంతా బాగుంటే.. ఆదివారం జరిగిన ఎస్సై పరీక్షకు హాజరయ్యేవాడే..! ఇంతలోనే పరీక్ష రాయాల్సిన అభ్యర్థి.. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో క్యాబ్‌ కిరాయి అడిగినందుకు ఇటీవల దాడికి గురైన వెంకటేశ్​ నేపథ్యమిది.

attack on car driver news
attack on car driver news

attack on car driver news: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్​.. బీఎన్‌రెడ్డి నగర్‌లో ఉంటూ క్యాబ్‌ నడుపుతున్నాడు. అతనిపై దాడి జరగడంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద విలపిస్తున్నారు. వెంకటేశ్​కు చికిత్స కోసం ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చయిందని.. ఆర్థికంగా భారమవడంతో సోమవారం మరో ఆసుపత్రికి మార్చామని కుటుంబసభ్యులు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు చెప్పారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బాధితుడు పర్వతాలు కోలుకుంటున్నట్లు తెలిపారు.

వెంకటేశ్​....

తప్పించేందుకు రాయబారాలు..: వెంకటేశ్​పై దాడి అనంతరం కోర్టులో లొంగిపోయిన వివేక్‌రెడ్డిని రాజేంద్రనగర్‌ పోలీసులు రెండ్రోజులు విచారించి సోమవారం తిరిగి రిమాండ్‌కు తరలించారు. దాడికి పాల్పడిన 12 మంది పేర్లను వివేక్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. దాడి చేసిన మరికొందరిని తప్పించడానికి వివిధ పార్టీల పెద్దలు రంగంలోకి దిగి రాయబారం చేస్తున్నట్లు తెలిసింది. సుమారు 20 మంది వరకు దాడి చేస్తున్నట్లు సీసీ పుటేజీలలో కనిపిస్తోంది. దాడిలో కొన్ని పుటేజీలను పోలీసులకు దొరక్కుండా స్థానికంగా కొందరు తొలగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దాడి ఘటన ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ ద్వారా వెలుగులోకి రావడం.. పోలీసు ఉన్నతాధికారుల దృష్టి పడటంతో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్న పలువురిని సోమవారం ప్రశ్నించారు. వారందరిపైనా కేసులు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ నాగేంద్రబాబు తెలిపారు. దాడిలో గాయపడ్డ వెంకటేశ్​ తండ్రి అంజయ్య సోమవారం రాజేంద్రనగర్‌ ఠాణాకు వచ్చి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నాడు.

ఇదీ జరిగింది...

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లికి చెందిన వివేక్‌రెడ్డి.. గత నెల 31 రాత్రి 11.30 గంటలకు బీఎన్‌రెడ్డినగర్‌ నుంచి ఉప్పర్‌పల్లికి కారు బుక్‌ చేసుకున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేశ్​ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు కారుతో వివేక్‌ ఉన్న చోటుకు చేరుకున్నాడు. మార్గమధ్యలో వెంకటేశ్​.. కారు యజమాని పర్వతాలును వాహనంలో ఎక్కించుకున్నాడు. ఉప్పర్‌పల్లి చేరాక.. మద్యం మత్తులో ఉన్న వివేక్‌రెడ్డి రూ.600 కిరాయి ఇవ్వకుండా కారు దిగి వెళ్లబోయాడు. డబ్బులు గురించి డ్రైవర్‌ అడిగినా.. సమాధానం చెప్పకుండా గొడవకు దిగాడు. అడ్డుకోబోయిన యజమాని పర్వతాలుపై చేయి చేసుకున్నాడు.

attack on car driver in Hyderabad: అనంతరం ఈ విషయాన్ని వివేక్‌.. ఫోన్‌ ద్వారా తన స్నేహితులకు చేరవేశాడు. కొద్ది సమయంలోనే కొంతమంది యువకులు అక్కడకు చేరుకొని డ్రైవర్‌, యజమానిని చితకబాదారు. డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదంటూ కాళ్లమీద పడినా.. కనికరం చూపలేదు. క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా కొట్టారు. రెండు గంటల పాటు పరుగెత్తించి దాడి చేశారు. పెట్రోలింగ్‌ వాహనంలో వచ్చిన పోలీసులు బాధితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినా.. నిందితులు వారి ముందే దాడి చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు వాపోయారు.

ఇవీ చూడండి..

కారు డ్రైవర్‌పై 20 మంది మూకదాడి.. కాళ్లమీద పడినా కనికరించలే..

'సీత'.. ఆ పేరులో ఉన్న మ్యాజిక్కే వేరు.. అన్నీ సూపర్​హిట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.