ETV Bharat / crime

ఈ సమాజానికి ఏమైంది..? మహిళలపై ఆగని నరరూప రాక్షసుల అకృత్యాలు

author img

By

Published : Sep 12, 2021, 7:20 AM IST

దేశమంతటా ఓవైపు అమృతోత్సవాలను జరుపుకొంటున్నా.. మహిళలపై నరరూప రాక్షసుల అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. పసి మొగ్గలనూ చిదిమేస్తున్నారు. ముంబయి నగరంలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం వెలుగు చూసింది. తమిళనాడులో పొట్టచేత పట్టుకుని వచ్చిన ఓ నిరుపేద యువతిపై దుర్మార్గులు అత్యాచారానికి ఒడిగట్టారు. హైదరాబాద్‌లో.. పొరిగింటిలోనే పొంచిఉన్న కామాంధుడు అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, దారుణంగా హతమార్చాడు.

murder
murder

ముంబయి శివారులోని సాకీనాకా ప్రాంతంలో ‘నిర్భయ’ తరహా దుర్ఘటన చోటు చేసుకొంది. రోడ్డు పక్కన నిలబెట్టి ఉన్న టెంపోలో 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగుడు అనంతరం ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో ఒక రోజంతా మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. శుక్రవారం వేకువజామున రక్తపు మడుగులో ఉన్న ఆమెను పోలీసులు రాజవాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తొలుత ఖైరానీ రోడ్డు పక్కన ఓ మహిళను ఒకడు తీవ్రంగా కొడుతున్నాడంటూ వచ్చిన ఫోన్‌ ఆధారంగా పోలీసులు పది నిమిషాల్లోనే అక్కడికి వెళ్లారు. అప్పటికే టెంపోలో తీవ్రంగా గాయపడి ఉన్న ఆమెను చూసి ఆసుపత్రిలో చేర్పించి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. ఆమె రహస్య అవయవాలతో పాటు, పలుచోట్ల ఇనుప రాడ్డుతో దారుణంగా కొట్టి, కత్తితో పొడిచినట్లు తేలింది. అధికంగా రక్తస్రావం జరగడం వల్లనే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా మోహన్‌ చౌహాన్‌ (45) అనే నిందితుడ్ని గుర్తించి గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా ఈ నెల 21 వరకు పోలీసు కస్టడీకి పంపించింది. అతనిది ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌గా గుర్తించారు. డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, ఫుట్‌పాత్‌లే అతడి నివాసమని పోలీసులు తెలిపారు. నిందితుడు, బాధితురాలి మధ్య 10-12 ఏళ్లుగా పరిచయం ఉందని, వారిద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతుండేవని.. దుర్ఘటన జరిగిన రోజున కూడా వారిద్దరి మధ్య వాదన చోటు చేసుకుందని చెప్పారు.

హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం...

ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపి, హతమార్చాడు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ స్థానికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌ ఠాణా పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి ఐఎస్‌ సదన్‌ ఠాణా పరిధిలోని ఓ బస్తీలో ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె (6), ఇద్దరు కుమారులు. గురువారం సాయంత్రం ఆ చిన్నారి ఆడుకుంటుండగా ఇంటి పక్కనే ఉంటున్న నిందితుడు పల్లకొండ రాజు (27) చాక్లెట్‌ ఆశ చూపించి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. అత్యాచారం జరిపి.. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత పాప మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి ఓ మూలనపెట్టి ఇంటికి తాళంవేసి వెళ్లిపోయాడు.

చిన్నారి కనిపించక పోవడంతో బస్తీ అంతా వెతికిన తల్లిదండ్రులు రాత్రి 7 గంటలకు సైదాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. చుట్టుపక్కల గాలించిన పోలీసులు.. అనుమానంతో అర్ధరాత్రి తర్వాత రాజు ఇంటి తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లగా దుప్పట్లో చిన్నారి మృతదేహం కనిపించింది. చిన్నారి తల్లిదండ్రులతోపాటు కొందరు స్థానికులు ఆమె కోసం గాలిస్తున్న సమయంలో నిందితుడు రోడ్డుపై పానీపూరీ తింటూ కనిపించాడు. పాప కోసం వెతుకుతున్నారా? అంటూ అతడు ఆరా తీసిన తీరుపై సందేహం కలిగిందని.. పోలీసులకు చెప్పినా పట్టించుకోకుండా సీసీ ఫుటేజీల కోసం అర్ధరాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో గాలించారని స్థానికులు ఆరోపించారు. ముందుగానే రాజు ఇంట్లో సోదా చేసుంటే పాప బతికేదంటూ ఆందోళనకు దిగారు. తమకు నిందితుడిని అప్పగిస్తేనే.. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష కోసం అనుమతిస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు పూనుకోగా ఆగ్రహించిన స్థానికులు కారంపొడి, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. చివరికి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పెద్ద ఘర్షణ జరిగింది. అడ్డుగా వచ్చినవారిని పక్కకు తోశారు. కొందరిపై లాఠీఛార్జి చేశారని స్థానికులు తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ.. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిన్నారి కుటుంబసభ్యులు, స్థానికులు చంపాపేట - ఐఎస్‌ సదన్‌ రహదారిపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు వారికి మద్దతు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టపరిహారంతోపాటు రెండు పడక గదుల ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇద్దరు కుమారులకు మెరుగైన విద్యను అందజేస్తామని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శర్మణ్‌ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

నిందితుడు మహబూబ్‌నగర్‌ జిల్లావాసిగా పోలీసులు తొలుత పేర్కొన్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ప్రాంతవాసిగా చెప్పారు. చివరకు జనగామ జిల్లా కొడకండ్లకు చెందిన వాడిగా తేల్చారు. అడ్డగూడూరులో నిందితుడి అక్క, బావలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్క ఇంటికి వెళ్లిన నిందితుడిని శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు.

తమిళనాడులో..

తమిళనాడులో ఓ నిరుపేద యువతికి మాయమాటలు చెప్పి.. ఐదుగురు దుండగులు కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. పెద్ద కాంచీపురం ప్రాంతానికి చెందిన యువతి (20) ఉపాధిని వెతుక్కుంటూ కాంచీపురంలోని అనేక ప్రాంతాల్లో తిరుగాడుతుండగా.. గమనించిన గుణశీలన్‌ (23) అనే వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఈ నెల ఒకటో తేదీన కారులో ఆమెను ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో అతడి స్నేహతులు గుణశేఖరన్‌ (24), జపనేసన్‌ (28), అజిత్‌ (23), కామరాజ్‌ (25) కూడా వాహనంలో ఎక్కారు. ఆమెకు శీతల పానీయంలో మద్యం కలిపి ఇచ్చి తాగించిన వారంతా అత్యాచారానికి పాల్పడ్డారు. అటువైపుగా వచ్చిన స్థానికులు కారులో నుంచి శబ్దం వినిపించడంతో అద్దాలను తట్టారు. దీంతో నిందితులు అక్కడి నుంచి వాహనంతో సహా ఉడాయించారు. బాధిత యువతి మరుసటి రోజే బాలిచెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి: MURDER CASE: ప్రేమ పెళ్లి వద్దందని.. పెంచిన తల్లిని చంపించింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.