ETV Bharat / city

రాష్ట్రానికి నిజాం నగలు తేవడానికి అభ్యంతరం లేదు... కానీ : కిషన్‌రెడ్డి

author img

By

Published : Feb 15, 2022, 7:19 PM IST

Kishan Reddy On Nizam Jewels: గత ఏడేళ్లుగా కొత్త మ్యూజియాల నిర్మాణంపై దృష్టి సారించామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 5, ఏపీలో 6 మ్యూజియాలకు గ్రాంట్‌ ఇస్తామని తెలిపారు. నిజాం నగలు రాష్ట్రానికి తేవడానికి అభ్యంతరం లేదని.. నగలకు భవనం కేటాయిస్తే తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్‌కు సైన్స్ సిటీని కేంద్రం మంజూరు చేసిందని పేర్కొన్నారు. ట్రైబల్‌ మ్యూజియంనూ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

kishan reddy
kishan reddy

Kishan Reddy On Nizam Jewels: మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను జరుపుకొంటున్న తరుణంలో.. మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, శాశ్వతంగా కొనసాగించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. దేశంలోని వెయ్యికి పైగా మ్యూజియాలు సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. హైదరాబాద్​లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో రిమేజినింగ్‌ మ్యూజియమ్స్‌ ఇన్‌ ఇండియా సమ్మిట్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

పెద్ద మొత్తంలో ఖర్చు

నిజాం ఆభరణాలను ఇక్కడే భద్రపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవనం కేటాయిస్తే తీసుకురావడానికి మాకు అభ్యంతరం లేదన్నారు కిషన్ రెడ్డి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చొరవ చూపాలని సూచించారు. గత ఏడేళ్లుగా కొత్త మ్యూజియాల నిర్మాణంపై కూడా దృష్టి సారించామని తెలిపారు. ఇప్పటికే ఉన్న మ్యూజియాలను కొత్త తరానికి అనువుగా ఉండేలా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో 10 నూతన మ్యూజియాలను కేంద్రం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నంలో మ్యూజియాలను ఏర్పాటు చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.

‘ఏపీలో 6, తెలంగాణలో 5 కొత్త మ్యూజియాలకు గ్రాంట్‌ ఇస్తాం. ఇప్పటికే రూ.కోటి మంజూరు చేశాం. ఏపీలో రూ.35 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. అల్లూరి జయంతి రోజున ప్రారంభిస్తాం. హైదరాబాద్‌కు సైన్స్‌ సిటీని కేంద్రం మంజూరు చేసింది. సైన్స్‌ సిటీకి 25 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నగలను భద్ర పరిచేందుకు భవనం కేటాయిస్తే తీసుకురావడానికి మాకు అభ్యంతరం లేదు.’ - కిషన్‌రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి

ఇదీ చదవండి : 'అమరుల గురించి మాట్లాడే నైతికత కిషన్‌రెడ్డికి ఉందా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.