ETV Bharat / city

రాష్ట్రానికి మరో రూ.3,000 కోట్ల రుణం.. కేంద్రం అనుమతి

author img

By

Published : Jun 25, 2022, 5:43 AM IST

loan to state govt
రూ.3,000 కోట్ల రుణం

మార్కెట్‌ రుణాలకు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్రం అనుమతించగా రూ.3వేల కోట్లు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే మంగళవారం ఆర్‌బీఐ ద్వారా బాండ్లను విక్రయించనుంది. 12, 13, 14 ఏళ్ల కాల పరిమితితో కూడిన బాండ్లను వేలం వేయనుంది. అయితే.. 2022-23 రుణాలపై నెలకొన్న సందిగ్ధత తొలగలేదు.

మార్కెట్‌ రుణాలకు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్రం అనుమతించగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మంగళవారం ఆర్‌బీఐ ద్వారా బాండ్లను విక్రయించనుంది. రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.3 వేల కోట్ల అప్పు కోసం 12, 13, 14 ఏళ్ల కాల పరిమితితో కూడిన బాండ్లను వేలం వేయనుంది. ఈ నెల మొదటి వారంలో ఇదే విధంగా రూ.4 వేల కోట్లను సమీకరించుకుంది. రాష్ట్రాలు మార్కెట్‌ రుణాల సమీకరణపై కేంద్రం కొత్త నిబంధనలు పెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ వెలుపల కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం(ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) పరిధిలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు తీసుకున్న కార్పొరేషన్ల రుణాలను ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకునే అప్పులతో కలిపి లెక్కించనున్నట్లు పేర్కొంది. నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నా ఈ అంశం కొలిక్కి రాలేదు. దాంతో ఏప్రిల్‌, మే నెలల్లో రాష్ట్రం రుణాలను తీసుకోలేకపోయింది. తాత్కాలిక ప్రాతిపదికన అయినా రుణాలకు అనుమతించాలని రాష్ట్ర ఆర్థికశాఖ కోరగా కేంద్రం అనుమతించింది.

నాలుగేళ్లకు సర్దుబాటు చేయాలని ప్రతిపాదన
" రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి దాకా తీసుకున్న కార్పొరేషన్ల రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో అప్పులుగా పరిగణించకండి. ఈ ఏడాదికి గతంలో నిర్ణయించిన మేరకు రూ.59,672 కోట్ల రుణాన్ని సమీకరించుకునేందుకు అనుమతించండి. తప్పనిసరి అయితే 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న కార్పొరేషన్ల రుణాలను ఈ ఏడాదికి కాకుండా రానున్న నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సమానంగా విభజించండి. ఆయా సంవత్సరాల ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చేర్చండి" అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో రుణాల ఆధారంగా ప్రతిపాదించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమస్య ఎదురవుతోంది. జూన్‌ నెలాఖరులోపు రూ.11 వేల కోట్ల రుణాలను సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా రూ.7 వేల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలలోనే ఖరీఫ్‌ రైతుబంధు రూ.7,600 కోట్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సొంత రాబడులు క్రమంగా పెరుగుతున్నా భారీ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ సమస్యగా మారుతోందని రాష్ట్రం అభిప్రాయపడుతోంది.

ఇదీ చూడండి: ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్​ఎస్​యూఐ కార్యకర్తల దాడి

ధాన్యం సేకరణపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్న సర్కార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.