ETV Bharat / city

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు: కేసీఆర్​

author img

By

Published : May 18, 2021, 5:18 AM IST

ప్రభుత్వ చర్యలతోపాటు... లాక్‌డౌన్, ఫీవర్‌ సర్వే, తదితర కారణాల వల్ల కొవిడ్ అడ్మిషన్లు తగ్గడం.. డిశ్చార్జిలు పెరగడం సంతోషకరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్న వారి శాతం మెరుగ్గా ఉండటం మంచి పరిణామమన్నారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని సూచించారు. భవిష్యత్‌లో ఆక్సిజన్ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా... 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

cm kcr review on corona
కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్​ సమీక్ష

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి హరీశ్​రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్... ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమావేశమైన సీఎం... కరోనా పరిస్థితి, బ్లాక్ ఫంగస్, చికిత్స, ఔషధాలు, టీకాల విషయమై పూర్తి స్థాయిలో సమీక్షించారు.

డబ్బులు పోగొట్టుకోవద్దు..

సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం.. 6,926 పడకలు ఖాళీగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఆక్సిజన్ పడకలు 2,253, ఐసీయూ పడకలు 533... సాధారణ పడకలు 4,140 ఖాళీగా ఉన్నాయని వివరించారు. కరోనా వైద్యం విషయంలో ప్రభుత్వరంగంలో పూర్తిగా ఉచిత వైద్యం.. భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని ముఖ్యమంత్రి కోరారు. పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ మందులు సహా... అన్నీ అందుబాటులోనే ఉన్నందున ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.

బ్లాక్ ఫంగస్ కోసం..

ఎక్కడైనా ఒకే వైద్యం ఉందని, కొవిడ్ చికిత్సకు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని... సీఎం ప్రజలను కోరారు. కరోనా రోగులకు తర్వాతి దశలో సోకుతున్న బ్లాక్ ఫంగస్ కోసం.. కోఠి ఈఎన్‌టీ, గాంధీ ఆసుపత్రితో పాటు జిల్లాలోని వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో అవసరమైన సామగ్రి.. మందులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన 25 మైక్రో డీబ్రైడర్ యంత్రాలు... హెచ్‌డీ ఎండోస్కోపిక్ కెమెరాలను తక్షణమే తెప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

టీకాల కోసం..

ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి 57,30,220 డోసుల టీకాలు మాత్రమే వచ్చాయని.. కోవాక్సిన్, కొవిషీల్డ్ కలిపి ప్రస్తుతం 1,86,780 డోసులు ఉన్నాయని అధికారులు.. సీఎంకు తెలిపారు. అందులో కోవాక్సిన్ 58,230 డోసులు.. కొవిషీల్డ్ 1,28,550 డోసుల స్టాకు ఉన్నట్లు వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన టీకాల కోటా విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తెప్పించుకోవాలని.. అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా టీకాల సరఫరా కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని సూచించారు.

అన్ని ఆస్పత్రులు వినియోగంలోకి..

ఆక్సిజన్ సరఫరాలో ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని.. అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న 200 పడకల ఆసుపత్రిని తక్షణమే కరోనా చికిత్సకు ఉపయోగించాలని.. సింగరేణి, ఆర్టీసీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులను... కొవిడ్ సేవలు అందించేందుకు వినియోగంలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

కరోనా అడ్మిషన్లు తగ్గాయి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు... లాక్‌డౌన్, జ్వర సర్వే, కొవిడ్ కిట్ల పంపిణీ తదితర కారణాల వల్ల కరోనా అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జిలు పెరగడం సంతోషకరమని ముఖ్యమంత్రి అన్నారు. కరోనా రోగుల్లో కోలుకుంటున్న వారి శాతం... మెరుగ్గా ఉండటం మంచి పరిణామమని అన్నారు. జ్వర సర్వేలో లక్షణాలు గుర్తించిన వారిని... వైద్య బృందాలు నిరంతరం సంప్రదిస్తూ, కనిపెట్టుకుంటూ ఉండాలని సీఎం సూచించారు. కరోనా విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ పడకలు కేటాయించే విషయంతో పాటు... నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే ప్రభుత్వం 248వ ఉత్తర్వును జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు ఇదే తరహా నిబంధనలను అమలు చేస్తున్నాయని... అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ రాష్ట్రాల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో... రోగులే బిల్లులు చెల్లిస్తున్నట్లు తమ పరిశీలనలో తెలిసిందని అధికారులు వివరించారు.

ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు..

రాష్ట్రంలో కొవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను... 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్‌లో ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును... హైదరాబాద్​లో ఏర్పాటు చేయాలని తెలిపారు. 16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు... 8 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 15 యూనిట్లు... 4 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 27 యూనిట్లు హైదరాబాద్‌లో, జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక్కొక్కటి 20 టన్నుల సామర్థ్యం కలిగిన... 11 ఆక్సిజన్ ట్యాంకర్లను పది రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను కోరారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సీఎం స్పష్టం చేశారు.

6 వైద్య కళాశాలలు..

సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్​లలో కొత్తగా వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని.. అనుమతులు వచ్చిన నర్సింగ్ కళాశాలల మంజూరు ప్రతిపాదలను వెంటనే పరిశీలించాలని సూచించారు.

ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం... కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల కేంద్రాల్లో మందులు, తదితర మౌలిక వసతుల రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ రీజినల్ సబ్ సెంటర్ల పరిధిలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన మందులు అందించేందుకు అద్దె లేదా సొంత ప్రాతిపదికన వాహనాలను తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పారు. మందులు నిల్వ చేసేందుకు సబ్ సెంటర్లలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు... ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇవీచూడండి: బ్లాక్‌ ఫంగస్ చికిత్స ఏర్పాట్లు, ఔషధాలపై వివరాలు ఇవ్వాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.