ETV Bharat / city

CORONA THIRD WAVE: రద్దీ ప్రాంతాల్లో నిబంధనలు మరిస్తే ముప్పే

author img

By

Published : Aug 13, 2021, 10:00 AM IST

Updated : Aug 13, 2021, 10:14 AM IST

CORONA THIRD WAVE
మూడోదశ ముప్పు

కరోనా రెండోదశ మనుషుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు మూడోదశ ముప్పు పొంచి ఉంది. కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదు అంటున్నారు నిపుణులు. టీకా తీసుకున్నప్పటికీ స్వీయ జాగ్రత్తలు మరిచిపోవద్దంటున్నారు.

హైదరాబాద్​లోని మార్కెట్లు, జనసమ్మర్థ ప్రదేశాల్లో కరోనా గంట మోగుతోంది. తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రెండో దశ పూర్తిగా తగ్గలేదని.. కొనసాగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చింతల్‌బస్తీ, బోయిన్‌పల్లి, ముషీరాబాద్‌, అమీర్‌పేట, కార్వాన్‌ తదితర ప్రాంతాల్లో జనం తాకిడి ఎక్కువ. మార్కెట్లతోపాటు ఇళ్లు దగ్గర దగ్గరగా ఉండటం.. జాగ్రత్తల్లో నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాంతాల్లో నిత్యం ఒకరిద్దరు పాజిటివ్‌గా తేలుతున్నారు. నగరంలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. 90 కేంద్రాల్లో నిత్యం పరీక్షలు చేస్తున్నారు. రెండో దశ ఉద్ధృతిలో ఒక్కో కేంద్రంలో 30-40 శాతం కేసులు నమోదయ్యేవి. తీవ్రత తగ్గడంతో పాజిటివ్‌ కేసుల్లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం ప్రతి కేంద్రంలో 40-70 వరకు ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు చేస్తున్నారు. కొన్నింట్లో అసలు కేసులు నమోదు కావడం లేదు. కొన్ని చోట్ల 1-5 వరకు బయట పడుతున్నాయి.

ఈ ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికం

తగ్గని కేసుల శాతం

సరాసరి కేసుల శాతం చూసుకుంటే అనేక ప్రాంతాల్లో 3-9 శాతం వరకు నమోదవుతున్నాయి. సమీపంలో మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలున్నచోట్ల కొన్నిరోజులు 10-15 శాతం కేసులు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం బోయిన్‌పల్లిలో 29 మందికి పరీక్షలు చేయగా... అయిదుగురికి పాజిటివ్‌గా తేలింది. ఇటీవలి పరిస్థితులు చూస్తే ఓ ప్రాంతంలో ఇవే అత్యధిక కేసులు. జూబ్లీహిల్స్‌లో 61 పరీక్షలకు గాను ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. కింగ్‌కోఠి యూపీహెచ్‌సీ పరిధిలో తాజాగా 589 మందికి యాంటీజన్‌ పరీక్షలు చేయగా...అందరికీ నెగెటివ్‌ వచ్చింది. తీవ్ర లక్షణాలున్నవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మరోవైపు అమీర్‌పేట యూపీహెచ్‌సీ పరిధిలో 365 పరీక్షలకు ముగ్గురిని, శ్రీరాంనగర్‌ యూపీహెచ్‌సీలొ 361 యాంటీజన్‌ పరీక్షలు చేస్తే...నలుగురు పాజిటివ్‌గా తేలారు.

మార్కెట్లలో

టీకా తీసుకుంటే సరిపోదు

చాలామంది టీకా తీసుకున్నామనే ధీమాతో జాగ్రత్తలు విస్మరిస్తున్నారు. తొలి దశ తరవాత కేసులు తగ్గడంతో చాలామంది విచ్చలవిడిగా బయటకు వచ్చారని, మూడు నెలల్లోనే రెండో దశ ఉద్ధృతంగా దాడి చేసిందనే సంగతి గుర్తించాలని సూచిస్తున్నారు. టీకా తీసుకున్నప్పటికీ స్వీయ జాగ్రత్తలు మరిచిపోవద్దంటున్నారు. ఉద్యోగాలకు, ఉపాధికి, ఇతర అవసరాలకు బయటకు వచ్చేవారు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా మాస్క్‌లు ధరించడం, చేతి శుభ్రత పాటించడం, ఎడం పాటించడం చేయాలంటున్నారు. మార్కెట్లకు వెళ్లే సందర్భంలో మాస్క్‌, గ్లౌజులు పెట్టుకొని... ఎడం పాటించాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

మాస్కు, శానిటైజర్‌ తప్పనిసరి

ప్రజా శౌచాలయాలకు వెళ్లినప్పుడు తలుపు గుబ్బలు, కడ్డీలు, కుళాయిలు, ఫ్లషింగ్‌ యంత్రాలను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి వెలుతురు ప్రసరిస్తోందా లేదా గమనించాలి. రద్దీ తక్కువ ఉన్నప్పుడు వెళ్లాలి. మాస్కుతోపాటు, కళ్లద్దాలు పెట్టుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఏటీఎంలు, షాపింగ్‌ మాళ్లలో ఎడం మరువద్ధు క్షౌరశాలల్లో తగు జాగ్రత్తలతో క్షవరాలు చేయించుకోవాలి. పరికరాలను శుభ్రం చేశారో లేదో గమనించాలి. కాలక్షేపం కోసం వచ్చేవారిని రానివ్వొద్ధు.

- డా.గోవర్ధన్‌, జనరల్‌ ఫిజీషియన్‌

వాహకాలుగా ప్రజా మరుగుదొడ్లు!

అత్యవసరమైతే జాగ్రత్తలతో వినియోగించాలి

మరుగుదొడ్ల నుంచి వ్యాప్తి అధికం

ప్రజా మరుగుదొడ్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని ఇటీవల అమెరికా ఫ్లోరిడాలోని అట్లాంటిక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప వాటిని వినియోగించొద్దని, వాడాల్సి వస్తే తగు జాగ్రత్తలతో వెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మూడో దశ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధ్యయనం ఏం చెప్పింది: ప్రజా శౌచాలయాల్లో ఫ్లష్‌ ద్వారా నీళ్లు వదిలినప్పుడు వేల సంఖ్యలో తుంపర్లు గాల్లోకి విడుదలవుతాయి. మలమూత్రాలు, వాంతుల ద్వారా వైరస్‌ బయటకు వస్తుందని, నీటిని ఫ్లష్‌ చేసినప్పుడు వైరస్‌ అసంఖ్యాకంగా గాల్లోకి లేస్తుంది. తద్వారా వైరస్‌ సోకే అవకాశం ఉంది. తుమ్మినా, చీదినా, దగ్గినా, సూక్ష్మస్థాయి తుంపర్లు గాల్లోకి విడుదలవుతాయని, ఆ సమయంలో వారికి అత్యంత సమీపంలో ఉన్నవారి శరీరంలోకి వైరస్‌ చేరుతుంది. గాలి ప్రసరణను బట్టి 20 సెకన్ల పాటు ప్రయాణం సాగిస్తుంది.

ఇదీ చూడండి: భయపెడుతున్న కరోనా వేరియంట్లు.. ఎలా జాగ్రత్తపడాలి?

'కొవిడ్ టీకా పూర్తి రక్షణ ఇవ్వకపోవచ్చు.. కానీ'

Last Updated :Aug 13, 2021, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.