CORONA POSITIVITY : ఏపీలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. జనవరి 10న 4శాతంగా ఉన్న పాజిటివిటీ, 23వ తేదీ నాటికి 31 శాతానికి చేరింది. అంటే 14 రోజుల్లో 27 శాతం వరకు పెరిగింది. శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల మధ్య 46,650 మందికి పరీక్షలు చేయగా.. 14,440 మందికి పాజిటివ్గా నిర్ధారించారు. గత ఆదివారం పాజిటివిటీ రేటు 15.22%తో పోలిస్తే రెట్టింపు అయ్యింది. కేసుల సంఖ్య కూడా 10వేల వరకు అధికంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖపట్నంలో ఆదివారం 2,258 కేసులు నమోదయ్యాయి.
ఎనిమిది జిల్లాల్లో సగటున వెయ్యిపైనే
వారం కిందటి వరకు 2 జిల్లాల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కృష్ణా మినహా.. మిగిలిన 12జిల్లాల్లోనూ సగటున కేసుల సంఖ్య 500పైనే ఉన్నాయి. ఇందులో ఎనిమిది జిల్లాల్లో సగటున వెయ్యిపైనే నమోదవుతున్నాయి. ఆదివారం పరిశీలిస్తే.. విశాఖపట్నం తర్వాత స్థానంలో అనంతపురం 1,534, గుంటూరు 1,458, ప్రకాశం 1,399, కర్నూలు 1,238, చిత్తూరు 1,198, నెల్లూరు 1,103, తూర్పుగోదావరి 1,012 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
* అనంతపురం జిల్లాలో ఈ నెల 18న 462 కేసులు నమోదవ్వగా 23న 1,534కి పెరిగాయి. గుంటూరు జిల్లాలోనూ 758నుంచి 1,458కి చేరాయి. చిత్తూరు జిల్లాలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం అక్కడ 2,338 కేసులు నమోదవ్వగా ఆదివారంనాటికి 1,198కి తగ్గాయి.
* కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం చూస్తే.. జనవరి 16 నుంచి 22 మధ్య వారంలో సగటున చిత్తూరు జిల్లాలో 46.51%, విజయనగరం 41.29, విశాఖపట్నం జిల్లాలో 40.96% చొప్పున పాజిటివిటీ రేటు నమోదైంది.