ETV Bharat / city

cm kcr speech: 'కేంద్రంపై ఇక సమరమే.. రైతు సమస్యలపై దేశాన్ని ఏకం చేస్తాం..'

author img

By

Published : Nov 19, 2021, 4:45 AM IST

యాసంగిలో వరి వేయాలని చెబుతారా?రైతులకు తప్పు చెప్పామని ముక్కు నేలకు రాస్తారా? వారిని బతకనిస్తారా? లేదా? కేంద్రం ధాన్యం తీసుకోకపోతే.. ఊరూరా చావుడప్పు మోగిస్తాం. పండించిన వడ్లను దిష్టితీసి భాజపా కార్యాలయంపై కుమ్మరిస్తాం. తెలంగాణ రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, వారి ప్రయోజనాలను రక్షించుకోవాలని మేం సమరానికి సిద్ధమయ్యాం. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. అవసరమయితే దిల్లీ యాత్ర చేస్తాం. మేం యుద్ధం ప్రారంభిస్తే చివరిదాకా కొట్లాడుతాం. దేనికీ భయపడం. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుంటాం. వారికి అండగా ఉంటాం. కేంద్రం దిగొచ్చేవరకు ధర్నాలు చేస్తామని.. మహాధర్నాలో సీఎం కేసీఆర్​ ప్రసంగించారు.

cm kcr speech in trs maha dharna for paddy procurement in telangana
cm kcr speech in trs maha dharna for paddy procurement in telangana

రైతు సమస్యలపై దేశాన్ని ఏకం చేస్తామని.. దీనిపై జరిగే పోరుకు నేతృత్వం వహిస్తామని ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం తన చివరి రక్త బొట్టున్నంతవరకు కొట్లాడుతానన్నారు. కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని, వరి ధాన్యం కొనుగోళ్లలో దాని వైఖరి రైతులకు జీవన్మరణ సమస్యగా, నష్టదాయకంగా మారిందన్నారు. పండించిన పంట కొంటారా.. కొనరా అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం కళ్లు తెరిపించడానికే యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది ఈ రోజుతో అయిపోదని, కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసేవరకు సాగుతుందని, ఉద్ధృతమై.. ఉప్పెనలా మారుతుందన్నారు. కేంద్రం తీరు వల్ల మాకు ఇష్టం లేకున్నా తెలంగాణ రైతులను వరి వేయొద్దని, దానికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కోరామన్నారు. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రాష్ట్రసమితి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

మహాధర్నా వేదికపై వరి కంకులు, నాగలితో ముఖ్యమంత్రి కేసీఆర్‌

‘‘తెలంగాణ పోరాటాల గడ్డ.. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలుసు. పరాయి పాలకుల విష కౌగిలి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ అద్భుత పథంలో ముందుకు సాగుతుంటే.. రైౖతులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఈ సమస్యకూ పరిష్కారం కనుగొంటాం. దానికోసం ఎక్కడిదాకైనా వెళ్తాం.. ఎవరితోనైనా పోరాడతాం. రణం చేయడంలో తెరాసకు మించిన పార్టీ దేశంలోనే లేదు. దాని ద్వారానే తెలంగాణను సాధించుకున్నాం. అన్నదాతల కోసమైతే అసలు తగ్గేదేలేదు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కానీ ఇప్పుడు కేంద్రం రాష్ట్ర రైతులకు నష్టం చేకూర్చాలని ప్రయత్నిస్తోంది. పంజాబ్‌ తరహాలోనే రాష్ట్రంలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరి 50 రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేదు. నిన్ననే స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశాను. కేంద్రం కళ్లు తెరిపించడానికే ఈ యుద్ధం. 2006లో నాటి గుజరాత్‌ సీఎం.. ఇప్పటి ప్రధాని మోదీ కూడా 51 గంటల పాటు ధర్నా చేశారు. ఇవాళ ప్రధాని హోదాలో ఉన్న ఆయన.. ఏ రాష్ట్రంలోనూ ఆ పరిస్థితి రాకుండా చేయాల్సింది పోయి.. పోరాటానికి దిగిన వారిపై విమర్శలు చేస్తున్నారు.

వేదిక ముందు కూర్చుని కేంద్ర విధానాలపై నిరసన తెలుపుతున్న మంత్రి కేటీఆర్‌

పిచ్చికూతలు మానాలి

కేసీఆర్‌కు భయమంటే ఏందో చూపిస్తనని ఒకడు అంటున్నాడు. కేసీఆర్‌ భయపడతాడా? నేను భయపడితే తెలంగాణ వచ్చేదా?ఎన్ని రోజులు కొట్లాడినం.. ఎక్కడిదాకా కొట్లాడినం... కాబట్టి ఈ పిచ్చికూతలు మానుకోవాలి. ఒకటే ఒక మాట.. మీకు దమ్ము, చిత్తశుద్ధి ఉంటే.. మీ పార్టీ ప్రజలకు నాయకత్వం వహిస్తుందని నమ్మితే, సూటిగా చెప్పండి.. వర్షాకాలంలో వచ్చే వడ్లు కొంటారా? కొనరా? గత యాసంగిలో ఇచ్చిన ధాన్యం గోదాముల్లో మూలుగుతున్నది. దాన్ని కొంటారా? కొనరా? సమాధానం చెప్పాలి.

తెలంగాణకు ఏమీ చేయలేదు

శాసనసభ తీర్మానం చేసి పంపినా రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణపై మాట్లాడరు. ఇక్కడ గిరిజనుల శాతం పెరిగింది. వారికి రిజర్వేషన్‌ ఇవ్వమని అడిగితే దిక్కు లేదు. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. బీసీ కుల గణన చేయాలని తీర్మానం పంపితే జవాబే లేదు. ఇక్కడి ఏడు మండలాలు, సీలేరు పవర్‌ ప్రాజెక్టులను ఏపీకి అప్పగించారు. ఐటీఐఆర్‌ ఇవ్వలేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. ఇలా అనేక రకాలుగా కేంద్రం ఇబ్బంది పెట్టింది. కానీ ఓపికకు హద్దు ఉంటుంది. అనేక ప్రజా సమస్యలు పక్కన పెట్టి, ఎన్నికలు వచ్చినప్పుడుల్లా నాటకాలాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్‌తో మీరు రాజకీయం నడుపుతున్నారు. కాలం చెల్లిపోయింది. అందరూ గమనిస్తున్నారు. అందరికీ అర్థమైపోయింది. మీ సర్జికల్‌స్ట్రైక్‌లు, మీరు సరిహద్దుల్లో ఆడే నాటకాలు, చేసే మోసాలు మొత్తం బట్టబయలయ్యాయి.

ధర్నాలో ప్లకార్డు ప్రదర్శిస్తున్న మంత్రి హరీశ్‌రావు

అన్నదాతలపై ఎందుకీ కక్ష?

కేంద్రంలో చలనం లేదు. ఆందోళన చేస్తున్న రైతులపైకి కార్లు ఎక్కించి చంపుతున్నారు.ఉత్తర భారత్‌ను వదిలి ఇప్పుడు కేంద్రం చూపు దక్షిణ భారత్‌ వైపు పడింది. తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మన రాష్ట్రంలో తప్ప నిరంతరవిద్యుత్‌ ఎక్కడా ఇవ్వట్లేదు. ఇది ఎవరి చేతగానితనం..? ఎవరి అసమర్థత..?. విద్యుత్‌ ఇవ్వడం చేతకాక మోటార్లు పెడతామంటారు. రాష్ట్రంలో మీటర్లు లేవు.. నీటి తీరువా లేదు. రైతుబంధు ఇచ్చేది మేమే. తెలంగాణలో పంట విస్తీర్ణంపై మేం అబదాలు చెబుతున్నామని కేంద్రం అంటోంది. పంట పండకపోతే.. కల్లాల వద్దకు భాజపా నేతలు ఎందుకు వెళ్తున్నారు? దేశానికి అన్నం పెడతామంటే తీసుకునే తెలివి లేక గోల్‌మాల్‌ చేస్తున్నారు. ఆరాచకం సృష్టిస్తున్నారు. గోల్‌మాల్‌ గాళ్లకు, సన్నాసులకు చరమగీతం పాడితేనే ఈ దేశానికి నిష్కృతి. దీని కోసం కచ్చితంగా జెండా లేవాల్సిందే. మరో పోరాటానికి తెలంగాణ నేడు నాయకత్వం వహించాల్సిందే. మన సమస్యలకు పరిష్కారం బతిమాలితే దొరకదు. బిచ్చమెత్తుకుంటే దొరకదు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదు. మనం కూడా బిచ్చగాళ్లం కాదు.

కేంద్రం వరికి ఉరి వేసిందంటూ మహిళా కార్యకర్త నిరసన

ప్రధాని స్పందించాలి

నరేంద్రమోదీని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. ఈ సభలో కూడా మీ సీఐడీలు ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. పావు గంటలో మీ టేబుల్‌ మీదకు నా మాటలు వస్తాయి. మీకు దండం పెట్టి, రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా అడుగుతున్నాను. మేం యాసంగిలో వరి వేయాలా? వద్దా? ఒకటే మాట చెప్పండి. మీరు తీసుకుంటారా? తీసుకోరా? మా సావు ఏదో మేం చస్తాం. ఏ దారి పట్టాలో ఆలోచిస్తాం. అది చెప్పకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. రెండు, మూడు రోజులు వేచి చూస్తాం.. ఆ తర్వాత యుద్ధాన్ని ప్రజ్వలింపజేస్తాం. ఎక్కడిదాకా తీసుకుపోవాలో అక్కడిదాకా తీసుకుపోతాం. కేంద్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నా.. ఈరోజు పోరాటం ప్రారంభమైంది. మేం పదవుల కోసమో.. ఇంకో దాని కోసమో కాదు. మేం అడిగేది ప్రజల సమస్యల గురించి. రాజకీయాలు ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు దీనికి సమాధానం చెప్పండి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

తెరాస నిర్వహించిన మహాధర్నాకు హాజరైన తెరాస శ్రేణులు, రైతులు

కుదుట పడుతున్న తెలంగాణలో కుంపటి

"రాష్ట్ర రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఏకంగా సీఎం కేసీఆర్‌ మహాధర్నాకు దిగారు. అరిగోస అనుభవించిన తెలంగాణ ప్రాంతం రాష్ట్రంగా ఆవిర్భవించిన ఈ ఏడేళ్లలో క్రమంగా కుదుటపడుతోంది. సాగునీరు, పెట్టుబడి, విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో రైతు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. దీన్ని చూడలేని భాజపా పాలకులు తలాతోకా లేకుండా మాట్లాడి గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎడ్లు లేవు. బండి సంజయ్‌కి బండి లేదు. రాష్ట్రాన్ని బద్‌నాం చేయడం పచ్చి రైతు వ్యతిరేక చర్య." --వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

ఈ కుట్రలు కేసీఆర్‌ను ఆపలేవు

"కేంద్రం బియ్యం కొనుగోలు చేయబోమని అన్నప్పుడు రాజకీయం చేయాలని, నిందించాలని కేసీఆర్‌ అనుకోలేదు.కానీ భాజపా నాయకులు కుట్రలకు తెరలేపారు. ఒకనాడు 600 కల్లాలు ఉన్నచోట ఇప్పుడు 6600 అయ్యాయి. ఇలాంటప్పుడు సేకరణలో జాప్యం కాదా? కుట్రలు కేసీఆర్‌ ప్రయాణాన్ని ఆపలేవు." -- గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి

సీఎం అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
"వ్యవసాయంలో విప్లవం సృష్టించిన రాష్ట్రాన్ని అభినందించాల్సింది పోయి అవమానిస్తున్నారు. యాసంగిలో వరి వేసుకోవాలని ఇక్కడి నాయకులు చెబుతున్నారు, ఎంత మేరకు కొనుగోలు చేస్తారో చెప్పండి అంటూ సీఎం మూడు ప్రశ్నలతో రాసిన లేఖకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రం, భాజపాలపై ఉంది." - కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి

ఎక్కడికెళ్లినా రైతులు నిలదీసి అడుగుతారు
"ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర ఎక్కడ అని బండి సంజయ్‌ అడుగుతున్నాడు రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డను అడుగు..ఆయన ఎవరో చెబుతారు.నల్గొండ జిల్లా పర్యటనలో అడుగడుగునా రైతులు నిన్ను అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడికిపోయినా నిన్ను నిలదీసి అడుగుతాం. " - పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు

బాధ్యత కేంద్రానిదే
"దేశానికి అన్నం పెట్టే బాధ్యత కేంద్రానిది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ఇదే చెబుతోంది. ధాన్యం సేకరణ, పంపిణీ బాధ్యత కేంద్రానిదే. దీని నుంచి వైదొలగడం కుదరదు. రాజ్యాంగం ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ యాసంగిలో వరి సాగు చేయరు. తెలంగాణలో మాత్రమే సాగవుతుంది. ఇక్కడుంది ప్రజా ప్రభుత్వం." -కె.కేశవరావు, రాజ్యసభ సభ్యుడు

కేంద్రంపై పోరాటం తప్పదు
"తెలంగాణ కోసం చేసిన పోరాటం ఎంత ముఖ్యమైనదో రైతుల కోసం ఇప్పుడు చేస్తున్న ఉద్యమం కూడా అంతే ముఖ్యమైనది. తెలంగాణ రైతుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న కేంద్రంపై పోరాటం తప్పదు. దీనికి రాజకీయాలకు వ్యతిరేకంగా మద్దతు తెలపాలి." - సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే

రైతు ప్రభుత్వం ఇది
"సీఎం కేసీఆర్‌ది రైతు ప్రభుత్వం. చెరువులు నిండటంతో బోర్లలోకి నీళ్లు చేరాయి. ఒకప్పుడు 22 లక్షలు ఉన్న బోర్లు ఇప్పుడు 30 లక్షలకు చేరాయి. పంజాబ్‌ మాదిరి రాష్ట్రంలోని ప్రతి గింజా కొనుగోలు చేయాలి." - గొంగిడి సునీత, ఎమ్మెల్యే ఆలేరు

మూడు చట్టాలతో రైతులను ముంచుతున్నరు
"రైతు వ్యతిరేకమైన మూడు చట్టాలను తీసుకొచ్చిన ప్రధాని మోదీ రైతులను ముంచుతున్నారు. సామ్రాజ్యవాద మోదీకి తెరాస వేడి తప్పక తగులుతుంది." - రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్యే, మానుకొండూరు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.