ETV Bharat / business

'ట్విట్టర్​ మొత్తాన్ని కొనేస్తా'.. మస్క్ ఆఫర్​.. అగర్వాల్​ ఏం చేసేనో?

author img

By

Published : Apr 14, 2022, 4:39 PM IST

Updated : Apr 14, 2022, 5:37 PM IST

Elon Musk twitter invest: దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్​లోని షేర్లు అన్నింటినీ కొనేసి, ఆ సంస్థను తన సొంతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ట్విట్టర్​కు ఆఫర్​ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ట్విట్టర్ తెలిపింది.

elon musk twitter invest
'ట్విట్టర్​ మొత్తాన్ని కొనేస్తా'.. మస్క్ ఆఫర్​.. అగర్వాల్​ ఏం చేసేనో?

Elon Musk twitter invest: "ట్విట్టర్​లో ఇప్పటికే నాకు 9శాతానికి పైగా షేర్లు ఉన్నాయి. మిగిలిన షేర్లన్నీ నాకు అమ్మేయండి. ఒక్కో షేరుకు 54.2 డాలర్లు చెల్లిస్తా."... సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ ఇచ్చిన తాజా ఆఫర్​ సారాంశమిది. మొత్తం షేర్ల కోసం 41.39 బిలియన్ డాలర్లను నగదు రూపంలో చెల్లిస్తానని ప్రతిపాదన చేస్తూ బుధవారమే మస్క్​ లేఖ పంపినట్లు గురువారం స్టాక్​ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది ట్విట్టర్. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే ఆ సంస్థ షేర్లు 12శాతం ఎగబాకాయి.

బోర్డ్​లో చేరేందుకు నో చెప్పి..: ట్విట్టర్​లో ఇప్పటివరకు 9.2శాతం వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు మస్క్. ఆ తర్వాత ఆయన ట్విట్టర్​ బోర్డులో సభ్యునిగా చేరతారని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా అందుకు నిరాకరించారు మస్క్. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. "బోర్డ్​లో చేరడం లేదని మస్క్​ నాకు చెప్పారు. ఇది కూడా మంచికే అనుకుంటున్నా. బోర్డ్​లో సభ్యునిగా ఉన్నా లేకపోయినా భాగస్వామ్యపక్షాల సలహాలు, సూచనలు మేము స్వీకరిస్తాం. మస్క్​ మన అతిపెద్ద వాటాదారు కాబట్టి ఆయన ఇన్​పుట్స్​కు ఎప్పుడూ విలువ ఉంటుంది. కొన్ని అవాంతరాలు ఎదురైనా.. మన లక్ష్యాలు, ప్రాథమ్యాలు మారవు. నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే అధికారం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి మన పనిపైనే దృష్టిపెడదాం" అని ట్విట్టర్​ ఉద్యోగులకు జారీ చేసిన నోట్​లో పేర్కొన్నారు పరాగ్.

బోర్డ్​లో చేరకూడదన్న మస్క్ నిర్ణయం.. వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. డైరెక్టర్​గా చేరితే.. ఆ సంస్థలో 15శాతం కన్నా ఎక్కువ షేర్లు కొనరాదన్న నిబంధన ఉందని, అది నచ్చకే మస్క్ బోర్డ్​కు దూరంగా ఉన్నారన్న విశ్లేషణలు వినిపించాయి. ట్విట్టర్​లో మెజార్టీ వాటాను దక్కించుకుని, ఆ సంస్థపై పూర్తి ఆధిపత్యం సాధించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోందన్న ఊహాగానాలు వినిపించాయి.

ఇప్పుడు ఆ వార్తల్ని నిజం చేస్తూ ట్విట్టర్​కు ఈ ప్రతిపాదన చేశారు మస్క్. "ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు వేదిక కాగలదన్న శక్తి ఉందన్న నమ్మకంతో నేను ట్విట్టర్​లో పెట్టుబడులు పెట్టా. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఎంతో కీలకమన్నది నా విశ్వాసం. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సంస్థ వృద్ధి చెందదని, సమాజం కోసం పాటుపడలేదని పెట్టుబడులు పెట్టాక నాకు అర్థమైంది. అందుకే ట్విట్టర్​ను ప్రైవేటు కంపెనీగా మార్చాల్సిన అవసరముంది." అని ట్విట్టర్​ కొనుగోలు ప్రతిపాదన లేఖలో పేర్కొన్నారు మస్క్.

Last Updated :Apr 14, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.