ETV Bharat / business

అంకురం... దిశ మారింది, దశ తిరిగింది!

author img

By

Published : Jul 26, 2020, 1:50 PM IST

ఉపాయం లేనివాణ్ని ఊళ్లోనుంచి వెళ్లగొట్టాలనేవారు పెద్దలు. అవును మరి, అదొక్కటి ఉంటే చాలు- ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడొచ్చు. అంకుర పరిశ్రమలూ ఇప్పుడు దాన్నే నమ్ముకున్నాయి. నష్టాల నుంచి తాము బయటపడటమే కాదు, కొవిడ్‌ ధాటికి విలవిల్లాడుతున్న సమాజానికి మేమున్నామంటూ ధైర్యాన్నిస్తున్నాయి. సమయానికి తగిన సరికొత్త ఆవిష్కరణలతో ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి.

corona effect on startups future as government implied lock downcorona effect on startups future as government implied lock down
అంకురం... దిశ మారింది, దశ తిరిగింది!

నాలుగు నెలల కిందటి సంగతి. అవినాష్‌కి పొద్దున్నే ఫోన్‌ వచ్చింది. తన వ్యాపార భాగస్వాములు అరవింద్‌, సంతోష్‌, గురురాజ్‌ ముగ్గురూ జూమ్‌లో లైన్‌లోకి వచ్చేశారు. పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లుంది. అందరి ముఖాల్లోనూ ఆందోళన. రాత్రికి రాత్రి వ్యాపారం సున్నాకి పడిపోయింది మరి. నలుగురు స్నేహితులూ కలిసి ఏడాదిన్నర కిందట పెట్టిన ఆ అగ్రిటెక్‌ కంపెనీ మంచి పేరు తెచ్చుకుని తొలివిడతగా నిధులూ సంపాదించుకుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు వేసుకుంటూ ముందురోజు దాకా ఉత్సాహంగా ఉంది వ్యవస్థాపక బృందం.

అంతలోనే పిడుగుపాటులాంటి వార్త... లాక్‌డౌన్‌.. అన్నీ బంద్‌!

‘మన పంటని ఏం చేద్దాం’ భాగస్వాముల ప్రశ్న. అవినాష్‌కీ గుబులుగానే ఉంది. గ్రీన్‌హౌస్‌లో పంటలు పండించి హోటళ్లూ రెస్టరెంట్లకు సరఫరా చేసే సంస్థ వాళ్లది. లాక్‌డౌన్‌ వల్ల అన్నిటినీ మూసేయ డంతో పంట దిగుబడిని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏ గోడౌన్‌లోనో పడేస్తే నిల్వ ఉండే ఉత్పత్తులు కావవి.

పైకి గంభీరంగానే ఉన్న అవినాష్‌ తక్షణ కర్తవ్యం ఏంటని ప్రశాంతంగా ఆలోచించాడు. ప్రత్యామ్నాయాలు ఆలోచించమని స్నేహితులకూ చెప్పాడు. అలా మరో వారం జూమ్‌ మీటింగుల తర్వాత నలుగురూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇన్నాళ్లూ వ్యాపార సంస్థలకు అమ్మిన ఉత్పత్తుల్ని ఇక నేరుగా వినియోగదారులకే అమ్మాలనుకున్నారు. అందుకు మరో డెలివరీ సంస్థ సాయం తీసుకోవాలనుకున్నారు. అంతే, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడమూ రెండు నెలలు తిరిగేసరికల్లా వ్యాపారం కరోనాకి ముందు ఉన్న లాభాలస్థాయికి చేరడమూ జరిగిపోయాయి. జరిగిన మార్పల్లా ఒక్కటే!.. వ్యాపారం మోడల్‌ని మార్చడం. ఎలా అయితేనేం... కావాల్సింది ఉత్పత్తులకు మార్కెట్‌. పరిస్థితులకు తగినట్టుగా స్పందించారు. సరైన మార్గాన్ని కనిపెట్టారు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

ఆ సంస్థ పేరు క్లోవర్‌. బెంగళూరు వరకే ఉన్న వ్యాపారాన్ని ఇప్పుడు హైదరాబాదుకీ విస్తరించింది అవినాశ్‌ బృందం.

మనది మూడోస్థానం

కరోనాకు ముందు మన దేశంలో అంకుర పరిశ్రమల పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉండేది. 2008లో దేశంలో ఏడు వేల వరకూ అంకురాలు ఉండగా- ఏటా దాదాపు 15శాతం వృద్ధి రేటును నమోదుచేస్తూ 2019 చివరి నాటికి యాభై వేలకు పైగా సంస్థలు ఏర్పాటయ్యాయి. నిరుడే 1300లకు పైగా స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. దేశంలో ఉన్న మొత్తం అంకురాల్లో దాదాపు రెండు లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా. ప్రపంచంలో అంకురాల ఏర్పాటులో అమెరికా, చైనాల తర్వాత మన దేశం మూడో స్థానంలో ఉంది. దేశీయ పెట్టుబడు లతోపాటు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ఇవి ముందుంటున్నాయి. ఫేస్‌బుక్‌, వాల్‌మార్ట్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలన్నీ ఇప్పుడు భారత అంకురాలతో కలిసి పనిచేస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలూ వీటికోసం ప్రత్యేక విధానాలను రూపొందించాయి. ఇలా ఆశావహంగా సాగిపోతున్న అంకుర పరిశ్రమల రంగం కరోనా కారణంగా ఊహించని కుదుపునకు లోనైంది.

ఎంత నష్టం..

వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌లతో వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. పెద్ద పెద్ద సంస్థలే తీవ్రంగా నష్టపోయాయి. ఇక, చిన్న చిన్న అంకురాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫిక్కి సంస్థ ఇండియా ఏంజెల్‌ నెట్‌వర్క్‌తో కలిసి చేసిన అధ్యయనంలో స్టార్టప్‌ల పరిస్థితి బయటపడింది. డెబ్భై శాతం అంకుర పరిశ్రమలు కొవిడ్‌ వల్ల ప్రభావితం కాగా, 12 శాతం పూర్తిగా మూతపడ్డాయి. ఓ అరవై శాతం పడుతూ లేస్తూ కొనసాగుతున్నాయి. మూడో వంతు పరిశ్రమలకు రావాల్సిన పెట్టుబడులు నిలిచిపోయాయి. పదిశాతం పెట్టుబడుల ఒప్పందాలు రద్దయ్యాయి.

పెట్టుబడులు పెట్టే సంస్థల ప్రాధాన్యాలూ మారిపోయాయి. ఆరోగ్యం, విద్య, కృత్రిమ మేధ, ఫిన్‌టెక్‌, అగ్రి... సంస్థల ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గదు కాబట్టి ఆ రంగాల్లో పెట్టుబడికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతో చాలావరకూ అంకుర సంస్థలు ఉద్యోగుల్నీ, ఖర్చుల్నీ తగ్గించుకుని బండి నడుపుతున్నాయి. ఇంకో మూడు నెలల వరకూ పరిస్థితి చక్కబడకపోతే ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. నాస్కామ్‌ నివేదిక ప్రకారం నలభై శాతం దాకా టెక్‌ స్టార్టప్‌లు తాత్కాలికంగా పని ఆపేశాయి. లేదా మూసివేతకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. 54 శాతం మాత్రం తమ దిశను మార్చుకుని పనిచేస్తున్నాయి.

నిలదొక్కుకున్నదెవరూ అంటే...

సియట్‌ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది వాహనాల టైర్లు. ఆ కంపెనీ మొన్నటివరకూ అచ్చంగా వాటినే తయారుచేసేది మరి. అలాంటి కంపెనీ ఇప్పుడు పీపీఈలూ ఫేస్‌మాస్కులూ తయారుచేస్తోంది. వీటికీ టైర్ల కంపెనీకీ ఏంటి సంబంధం- అంటే ఏమీ లేదు. కానీ సామాజిక అవసరాన్ని గుర్తించి అవకాశాన్ని ఉపయోగించుకుంది ఆ సంస్థ. అలాగే బయటనుంచి కొనుక్కొచ్చిన కూరగాయలూ పండ్లూ కడుక్కోడానికి ‘నీమ్‌ వాష్‌’ అనే ద్రావణాన్ని మార్కెట్‌లోకి తెచ్చింది ఐటీసీ. అంత పెద్ద సంస్థలే ఇలా పూర్తిగా కొత్త రంగంలో ప్రవేశించినప్పుడు ఇక చిన్న చిన్న స్టార్టప్‌లు తమ పంథాను మార్చుకోవ డంలో విశేషం ఏముంది. చాలా అంకురాలు అదే పనిచేశాయి.

దిల్లీలో ఎలక్ట్రిక్‌ బైక్‌లను అద్దెకిచ్చేది జిప్‌ అనే స్టార్టప్‌. లాక్‌డౌన్‌తో వాహనాలన్నీ గ్యారేజ్‌కే పరిమితమయ్యాయి. అయినా కంగారు పడలేదు ఈ సంస్థ వ్యవస్థాపకులు ఆకాశ్‌ గుప్తా, రాశి అగర్వాల్‌. ప్రత్యామ్నాయం ఆలోచించారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు నిత్యావసరాలు కొనుక్కోడానికి బయటికి రాలేరు కాబట్టి వాటిని ఇంటికి సరఫరా చేయడానికి తమ వాహనాలను వాడుకోవచ్చన్న ఆలోచన వచ్చింది. వెంటనే కిరాణా, సూపర్‌ మార్కెట్లవారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. డెలివరీ బాయ్‌లను నియమించుకుని సరుకుల డోర్‌ డెలివరీ మొదలుపెట్టారు. ఆ వ్యాపారం ఎంత లాభసాటిగా సాగిందంటే కరోనాకి ముందు ఆ సంస్థకి 640 స్కూటర్లుంటే మే నాటికే వెయ్యి దాటాయి.

హైపర్‌ లోకల్‌

ఒకప్పుడు అందరి నోటా గ్లోబల్‌ అన్న మాటే విన్పించేది. అది కాస్తా ఇప్పుడు లోకల్‌ ఇంకా చెప్పాలంటే హైపర్‌ లోకల్‌ అయింది. ‘ఢెలీవరీ’ అనేది యూనికార్న్‌ కంపెనీ. సాఫ్ట్‌బ్యాంక్‌ ఆర్థిక సహాయంతో ఎదిగిన ఈ సంస్థ ఈ-కామర్స్‌ సంస్థలకూ పరిశ్రమలకూ సరకు రవాణా చేసేది. గత ఏడాది సంస్థ ఆదాయం రూ.1642 కోట్లు. కరోనా నేపథ్యంలో మార్చి మొదటివారంలోనే కార్పొరేట్‌ కార్యాలయాలన్నిటినీ మూసేసిన సంస్థ వ్యవస్థాపకులు ఆ తర్వాత వర్చువల్‌ సమావేశాల ద్వారానే వ్యాపారం దిశను మార్చుకున్నారు. ఎక్కడికక్కడ స్థానిక అవసరాలమీద దృష్టి పెట్టారు. ఫార్మా కంపెనీల నుంచీ మందులూ, పీపీఈలూ, శానిటైజర్లనూ; గోడౌన్ల నుంచి ధాన్యాన్నీ... రిటైల్‌ మార్కెట్లకు సరఫరా చేస్తూ వ్యాపారాన్ని కొనసాగించారు. జూన్‌ కల్లా లాక్‌డౌన్‌కి ముందు వ్యాపారం ఏ స్థాయిలో ఉండేదో అదే స్థాయికి తీసుకొచ్చారు.

కార్స్‌24... సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొని అమ్మే సంస్థ. 73 నగరాల్లో 210 దుకాణాలు ఉండేవి. డబ్బు తీసుకుని ఇంటికొచ్చి కారు రిపేరు చేసిపెట్టే విభాగం కూడా ఈ సంస్థకి ఉంది. అయితే అది మొత్తం వ్యాపారంలో ఐదు శాతం మాత్రమే ఉండేది. అలాంటిది

లాక్‌డౌన్‌ సమయంలో అసలు వ్యాపారం ఆగిపోవడంతో ఇంటికొచ్చి కార్లను పరిశీలించే పని మీద దృష్టి పెట్టింది. అది ఎంతగా ఫలితం చూపిందంటే మూడు నెలలు తిరిగే సరికల్లా కొవిడ్‌కి ముందు ఉన్న స్థాయికి పుంజుకుంది వ్యాపారం.
క్లోవియా కథ మరింత ఆసక్తికరం. 2012లో ప్రారంభమైన ఈ సంస్థ లోదుస్తులు తయారు చేసేది. లాక్‌డౌన్‌తో అమ్మకాల్లేక స్టాకు పేరుకుపోయింది. దాంతో దుస్తుల తయారీ ఆపేసి పీపీఈలూ మాస్కులూ తయారు చేయడం ఆరంభించింది. వాటి విక్రయాలతో రెండు నెలల్లోనే 80 శాతం నష్టాలను పూడ్చుకున్న సంస్థ అటు ఉద్యోగులకూ ఉపాధి పోకుండా చూడగలిగింది. మాస్కుల అవసరం ఇప్పట్లో పోయేది కాదు కాబట్టి ఇక నుంచీ అదీ తమ వ్యాపారంలో భాగమేననీ, అలా తమ ఉత్పత్తుల పరిధి విస్తరించుకున్నట్లయిందనీ అంటున్నారు వ్యవస్థాపకులు పంకజ్‌ వీర్మానీ.

ఇలాంటి గెలుపు కథలెన్నో. పరిస్థితులను చూసి ఆందోళన చెందకుండా ఆలోచనలకు రెక్కలు తొడగటమే వారి విజయ రహస్యం.

కలిసొచ్చేలా చూసుకున్నారు

ఆన్‌లైన్‌ ఫార్మా సంస్థలూ, టెలీమెడిసిన్‌ రంగానికి చెందిన అంకురాలకూ కరోనా పరిస్థితులు బాగా కలిసివచ్చాయి. అలాగే నిత్యావసరాలను ఇళ్లకు సరఫరా చేసే సంస్థలూ ఆన్‌లైన్‌ విద్య, వినోదాలను అందించే ఆప్‌లూ... పెద్ద ఎత్తున లబ్ధి పొందాయి. ఇలా లాభాల బాటన సాగుతున్న వ్యాపారాలేవో కనిపెట్టి వాటికి అవసరమైన అనుబంధ వస్తువులనూ సాఫ్ట్‌వేర్‌లనూ తయారుచేసి విక్రయించడం ద్వారా మరికొన్ని అంకురాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆన్‌గో ఫ్రేంవర్క్స్‌’ సంస్థ పదిహేను నిమిషాల్లోనే ఎవరైనా తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లోకి మార్చుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో చాలామంది తమ సేవలను ఆన్‌లైన్‌లోకి మార్చుకునేందుకు ముందుకువచ్చారు. మరోపక్క సినిమా టికెట్లను విక్రయించే బుక్‌మైషో ఇప్పుడు ఆన్‌లైన్‌ ఈవెంట్లను ఏర్పాటుచేస్తోంది. విమాన టికెట్లూ హోటల్‌ బుకింగ్‌లూ చేసి పెట్టే మేక్‌మైట్రిప్‌ నిత్యావసరాలను సరఫరా చేస్తామని ప్రకటించింది. హోటళ్లు లేకపోవడంతో స్విగ్గీ, జొమాటోలూ అదే పని చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి రైతుబజార్ల నుంచి పండ్లూ కూరగాయలను వినియోగదారుల ఇళ్లకు చేరవేశాయి. బెంగళూరుకు చెందిన క్రెడ్‌లాంటి సంస్థలు వినియోగదారులకు అప్పులిచ్చి క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపునకు సహకరించాయి.

ప్రభుత్వ అండ

కొవిడ్‌ నేపథ్యంలో అంకురాల కోసం ప్రభుత్వమూ ప్రత్యేకంగా పలు పథకాలను తీసుకొచ్చింది. వాటిని ప్రోత్సహిం చేందుకు కొత్త కొత్త పోటీలను నిర్వహించింది. విదేశీ ఆప్‌లకు ప్రత్యామ్నా యంగా దేశీయ ఆప్‌ల రూపకల్పనలో పోటీ పెట్టింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ప్యూపుల్‌లింక్‌ యూనిఫైడ్‌ కమ్యూనికేషన్స్‌ (ఇన్‌స్టావీసీ), సౌల్‌పేజ్‌ ఐటీ సొల్యూషన్స్‌ (లిబెరో)లు రూ.20 లక్షలు, రూ.15 లక్షలు బహుమతిగా గెలుచుకున్నాయి. కొవిడ్‌-19 సమయంలో కష్టాల్లో కూరుకుపోయిన అంకురాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. చైనా ఆప్‌ల నిషేధమూ దేశీయ అంకురాలకు కొత్త అవకాశాలను తెచ్చింది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం లేకుండానే అందుబాటులో ఉన్న సాంకేతికత, వనరుల తోనే ఇప్పుడు అనేక ఆప్‌లు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే వీటి డౌన్‌లోడ్లు లక్షలకు చేరుకున్నాయి. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందిన చింగారి ఒక్కసారిగా దాదాపు 18 మిలియన్ల డౌన్‌లోడ్లను నమోదు చేసుకుని దూసుకు పోతోంది. హైదరాబాద్‌కు చెందిన డబ్‌షూట్‌ 10లక్షలకు పైగా డౌన్‌లోడ్లను పొందింది.

లాక్‌డౌన్‌ ప్రారంభమైన వెంటనే ‘హ్యాక్‌ఎకాజ్‌’ పేరుతో కొత్త ఉద్యమమే ప్రారంభమయ్యింది. 48 గంటల్లో 15 వేల మంది ఆ హ్యాకథాన్‌లో పాల్గొని 2500 ఆలోచనలను పంచుకున్నారు. అందులో 30 ఆలోచనలు ప్రపంచ వేదికపైకి వెళ్లగా వాటిల్లోనుంచి అయిదు విజయం సాధించాయి. తక్కువ ధరకు వెంటిలేటర్లను తయారుచేయడం దగ్గర్నుంచి, లాక్‌డౌన్‌లో ప్రజల మానసిక స్థితిని అంచనా వేసే ఆప్‌ వరకు, యూవీ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబో, డిజిటల్‌ హాస్పిటల్‌ అండ్‌ కరోనా లేబొరేటరీస్‌ లాంటివి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ భారతీయ అంకురాల ఆలోచనా శక్తిని చాటేవే.

రహదారికి మలుపులు ఎంత సహజమో వ్యాపారానికి ఒడుదొడుకులూ అంతే సహజం. ముందున్న మలుపుని సరైన సమయంలో గుర్తించినవారే రోడ్డు మీద జాగ్రత్తగా ముందుకు సాగుతారు. ఈ అంకురాల వ్యవస్థాపకులు చేసిందీ అదే. అందుకే విజేతలుగా నిలిచారు!

ఇవీ విజయవంతమయ్యాయి!

ఆయుష్‌ క్వాత్‌తో: ఆయుష్‌ శాఖ రూపొం దిచిన వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందు ఆయుష్‌ క్వాత్‌ను జీనోమ్‌ల్యాబ్స్‌ సంస్థ ట్యాబ్లెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తోంది.

నిఘా కోసం: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగేవారినీ, అనారోగ్యంగా ఉన్నవారినీ గుర్తించి అప్రమత్తం చేసే పరికరం ‘సేఫ్‌ విజన్‌’. కంప్యూటర్‌ మేధ సాయంతో సీసీటీవీలు, డ్రోన్ల అనుసంధానంతో పనిచేసే ఈ పరికరాన్ని బైట్‌ఫోర్స్‌ రూపొందించింది. టెరిక్‌సాఫ్ట్‌ టెక్నాలజీస్‌ కూడా ఇలాంటిదే మరో పరికరాన్ని తయారుచేసింది.

కార్యాలయాల కోసం: ఉద్యోగులు, బ్యాంకుల్లోకి వెళ్లే ఖాతాదారులకు శానిటైజర్‌ ఇవ్వడమే కాక, ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వారి ఫొటోను తీసి, సంస్థ మానవ వనరుల విభాగానికి పంపిస్తుంది అర్వి అభివృద్ధి చేసిన పరికరం.
స్మార్ట్‌గా: యూవీ కిరణాలతో పాటు రసాయనాలను చల్లుతూ డిస్‌ఇన్ఫెక్టింగ్‌ చేసే స్ప్రేయర్లనూ, స్మార్ట్‌ వెంటిలేటర్లనూ తయారు చేస్తోంది మాస్టర్‌ పీసీబీ సంస్థ.

కరోనాపై పోరులో మన అంకురాలు!

సంస్థ నెలకొల్పినప్పటి ఆశయం ఏదైనప్పటికీ పరిస్థితులకు తగినట్లుగా సత్వరం స్పందించి సమయానికి తగిన ఉత్పత్తులతో విజయపతాకం ఎగరేశాయి తెలుగు రాష్ట్రాల్లోని పలు అంకురాలు. వాటిల్లో కొన్ని...

కియోస్క్‌తో: ఏ దుకాణంలోకి వెళ్లాలన్నా ఇప్పుడు మాస్క్‌, శానిటైజర్‌తో పాటు శరీర ఉష్ణోగ్రత పరిశీలనా తప్పనిసరి. మనిషితో అవసరం లేకుండా ఈ పనులన్నీ చేసే కియోస్క్‌, టన్నెల్‌లను రూపొందించింది ఐ-మార్జన్‌ హెల్త్‌ టెక్‌ ఇన్నొవేషన్స్‌ సంస్థ. ఏటీఎం మాదిరి ఉండే కియోస్క్‌తో ఉష్ణోగ్రత నమోదు, శానిటైజేషన్‌కు తోడు మన జేబుల్లో ఉండే వాలెట్‌, మొబైల్‌, పెన్‌ వంటి వాటినీ అల్ట్రా వయొలెట్‌ కిరణాల సాయంతో స్టెరిలైజ్‌ చేయొచ్చు. హాజరు నమోదు చేయొచ్చు. అదే టన్నెల్‌తో అదనంగా ఫ్యూమిగేషన్‌ చేయొచ్చు. ఇళ్లలోకి తెచ్చుకునే వస్తువులను నిమిషం పాటు ఉంచితే, యూవీ కిరణాల ద్వారా శానిటైజ్‌ చేసే ఓవెన్‌ను కూడా వీరు రూపొందిస్తున్నారు.

మనుషులకే ప్రత్యేకం: నిజానికి ఇప్పుడు వాడుతున్న థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరాలు యంత్ర పరికరాల వేడిని తెలుసుకోడానికి రూపొందించినవి. వాటికి ప్రత్యామ్నాయంగా మనుషుల శరీర ఉష్ణోగ్రతను 99.5శాతం కచ్చితత్వంతో గుర్తించే విధంగా ‘సెన్స్‌’ అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది బ్లూసెమి సంస్థ. కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో వేడిని గుర్తించే సెన్సర్లను తయారు చేసే ఈ కంపెనీ ఇప్పుడు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ‘సెన్స్‌’ని రూపొందించింది. తన ముందుకు వచ్చిన వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా గుర్తించే పరికరం ఇది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.