ETV Bharat / business

టాటా, రిలయన్స్‌ తర్వాత అదానీయే!

author img

By

Published : Apr 7, 2021, 10:19 AM IST

గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు.. 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను అధిగమించిన మూడో భారతీయ గ్రూపుగా రికార్డు సృష్టించింది. కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి 106.8 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.
Adani Group emerges as a group with a market value of over $ 100 billion
టాటా, రిలయన్స్‌ తర్వాత అదానీయే

ఓడరేవుల నుంచి విద్యుదుత్పత్తి వరకు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న, గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు 100 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.30 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువను అధిగమించిన మూడో భారతీయ గ్రూపుగా రికార్డు సృష్టించింది. అదానీ గ్రూపునకు చెందిన ఆరు నమోదిత కంపెనీల్లో నాలుగు కంపెనీల షేర్లు మంగళవారం జీవనకాల గరిష్ఠానికి చేరడంతో ఇది సాధ్యమైంది.

స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న గణాంకాల ప్రకారం.. ఈ ఆరు నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం ట్రేడింగ్‌ ముగిసేనాటికి రూ.7.84 లక్షల కోట్లు (106.8 బిలియన్‌ డాలర్లు)గా నమోదైంది. తద్వారా 100 బిలియన్‌ డాలర్లకు పైగా మార్కెట్‌ విలువున్న గ్రూపుగా టాటా గ్రూపు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ల సరసన అదానీ గ్రూపు చేరింది. ప్రస్తుతం టాటా గ్రూపు మార్కెట్‌ విలువ 242 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.17.76 లక్షల కోట్లు)కాగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ 171 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.12.55 లక్షల కోట్లు).

  • 1980లో కమొడిటీ ట్రేడర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతమ్‌ అదానీ.. రెండు దశాబ్దాల వ్యవధిలోనే గనులు, ఓడరేవులు విద్యుత్‌ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్‌, రక్షణ లాంటి పలు రంగాల వ్యాపారాలు నిర్వహించే ఓ దిగ్గజ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగారు.
  • గత రెండేళ్లలో ఏడు విమానాశ్రయాల్లో యాజమాన్య నియంత్రణ వాటాలను అదానీ గ్రూపు చేజిక్కించుకుంది.
  • ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం, కృష్ణపట్నం పోర్టు సహా దేశంలోని ఓడరేవుల పరిశ్రమలో 30% వరకు నియంత్రణ అదానీ పోర్ట్స్‌ చేతిలోనే ఉంది.

ఇదీ చూడండి: ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బెజోసే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.