ETV Bharat / bharat

గోద్రా రైలు దహనకాండ.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్‌

author img

By

Published : Dec 15, 2022, 4:59 PM IST

గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దహనం కేసులో 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అతడికి బెయిల్‌ మంజూరు చేసింది.

supreme court grants bail to convict in godhra train coach burning case
సుప్రీంకోర్టు

Godhra Train Case Convict: గుజరాత్‌లోని గోద్రా రైలు దహనకాండకు సంబంధించిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ దోషికి సుప్రీంకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆ వ్యక్తి 17 ఏళ్ల పాటు జైల్లోనే ఉన్న కారణంగా అతడికి బెయిల్‌ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో మరికొందరు దోషులు కూడా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

2002, ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పంటించడంతో ఎస్‌-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన సమయంలో బోగీపై రాళ్లదాడికి పాల్పడినందుకు గానూ ఫారుక్‌ సహా మరికొందరికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాగా.. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ కొందరు దోషులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై సీజేఐ జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 17 ఏళ్ల పాటు అనుభవించిన జైలు శిక్షను పరిగణనలోకి తీసుకుని, బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఫారుక్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనను అంగీకరించిన ధర్మాసనం.. అతడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే మిగతా పిటిషన్లపైనా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.

కాగా.. దోషుల బెయిల్‌ పిటిషన్లను అంతకుముందు గుజరాత్‌ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. దోషులు చేసింది సాధారణ రాళ్లదాడి కాదని, వీరివల్ల బోగీలోని ప్రయాణికులు బయటకు రాలేకపోయారని కోర్టుకు వివరించారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన అగ్నిమాపక సిబ్బందిపైనా వీరు రాళ్లు విసిరారని తెలిపారు. గోద్రా రైలు దహనకాండ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అల్లర్లకు దారితీసింది. ఈ ఘటన అనంతరం చెలరేగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.