ETV Bharat / bharat

ప్రాంతీయ పార్టీల ఆదాయం డబుల్.. BRSపై కనకవర్షం!.. మిగిలిన పార్టీల లెక్కలివే!

author img

By

Published : Apr 8, 2023, 10:56 PM IST

ఎలక్టోరల్ బాండ్స్​ రూపంలో తమిళనాడుకు చెందిన డీఎం​కే పార్టీ భారీగా విరాళాలు వచ్చాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)​ సంస్థ గణాంకాలు వెల్లడించింది. డీఎం​కే తర్వాతి స్థానంలో బీజేడీ, బీఆర్​ఎస్​ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయంటే?

regional parties electoral bonds
regional parties electoral bonds

ఎలక్టోరల్​ బాండ్స్​ రూపంలో తమిళనాడుకు చెందిన డీఎం​కే(ద్రవిడ మున్నేట్ర కజగం) పార్టీకి భారీగా విరాళాలు అందాయి. 2021-22 మధ్య దేశంలోని ప్రాంతీయ పార్టీలలో డీఎం​కే పార్టీ రూ.318 కోట్ల విరాళాలతో అగ్రస్థానంలో నిలిచింది. రూ.307 కోట్లతో ఒడిశాకు చెందిన బీజేడీ(బిజూ జనతా దళ్), రూ. 218 కోట్లతో బీఆర్​ఎస్(భారత్​ రాష్ట్ర సమితి)​ తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ మేరకు దేశంలోని 10 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా.. రూ.852 కోట్ల విరాళాలు వచ్చినట్టు.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)​ గణాంకాలు వెల్లడించాయి.

2021- 22 ఏడాదిలో డీఎం​కే, బీడేడీ, వైకాపా, భారాస, జేడీయూ వంటి 10 ప్రాంతీయ పార్టీలకు పెద్ద మెుత్తంలో విరాళాలు వచ్చినట్లు.. ఏడీఆర్​ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1213 కోట్లు అని ఏడీఆర్​ చెప్పింది. ఈ మేరకు రాజకీయ పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయని తెలిపింది. ఇక, ఏడీఆర్​ విశ్లేషణల ప్రకారం అన్ని పార్టీల ఆదాయంలో డీఎం​కే వాటా 26.27 శాతంగా ఉంది. ఇక, టాప్​ 5 పార్టీల ఆదాయం లెక్కేస్తే.. రూ.1024.42 కోట్లు అని.. ఇది మొత్తం విరాళాల్లో 84.44 శాతమని ఏడీఆర్ పేర్కొంది.

2020-21, 2021- 22 సంవత్సరాల్లో 36 పార్టీలలో 35 పార్టీల గణాంకాల అందుబాటులో ఉన్నాయి. అందులో 20 పార్టీల ఆదాయం పెరిగింది. 15 పార్టీల ఆదాయానికి గండిపడింది. ఈ 35 పార్టీ ఆదాయం 2020-21లో రూ.565.42 కోట్ల నుంచి 114.8 శాతం పెరిగి 2021-22లో రూ.1,212.70 కోట్లకు చేరింది. కాగా, ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీకి అత్యధికంగా రూ.233.94 కోట్ల మేర విరాళాలు పెరిగాయి. బీఆర్ఎస్​కు రూ.180.45 కోట్ల విరాళాలు పెరగ్గా.. డీఎం​కేకు గతేడాది కంటే రూ.168.79 కోట్లు అధికంగా విరాళాలు వచ్చాయి.

వీటిలో 21 ప్రాంతీయ పార్టీలు 2021-22 సంవత్సరంలో తమ ఆదాయంలో కొంత భాగాన్ని కూడా ఖర్చు చేయలేదని ఏడీఆర్ తెలిపింది. 15 ప్రాంతీయ పార్టీలు.. తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయని వివరించింది. డీఎంకే పార్టీ తన మొత్తం ఆదాయంలో రూ.283 కోట్లు ఖర్చు చేయలేదు. అలాగే బీఆర్​ఎస్​, బీజేడీ కూడా రూ. 278 కోట్లు, రూ. 190 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇక, అన్ని పార్టీలు కలిపి రూ.288 కోట్లు ఖర్చు చేశాయి. అందులో టాప్​ 5 పార్టీలు సమాజ్​వాదీ పార్టీ (రూ.54 కోట్లు), డీఎం​కే (రూ.35 కోట్లు), ఆప్​ (రూ.30 కోట్లు), బీజేడీ రూ.(28 కోట్లు), ఏఐడీఎమ్​కే (రూ.28 కోట్లు) రూ.176.77 కోట్లు ఖర్చు చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.