ETV Bharat / bharat

బ్రిటీష్​పై ధిక్కార స్వరం- ఉద్యమానికి బాటలు ఇలా..

author img

By

Published : Aug 8, 2021, 8:30 AM IST

Updated : Aug 8, 2021, 9:40 AM IST

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చిట్టచివరిది అతిపెద్ద ప్రజా పోరాటంగా పేరొందింది క్విట్‌ ఇండియా ఉద్యమం. బ్రిటీష్‌ వారి పాలనపై తీవ్రవ్యతిరేకత తెలియజేసిన ఉద్యమం. భారత ప్రజలు నాయకుల అభిప్రాయాలకు విలువలేకుండా తమపై పెత్తనం చెలాయించడమే కాకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే బ్రిటీష్ వారి అరాచకాలను ధిక్కరించిన ఉద్యమం. తక్షణమే భారత దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని మహాత్ముడి పిలుపు వెనుక కారణాలు చూస్తే బ్రిటీష్ వారి ఏకపక్ష నిర్ణయాలు ఆయన సహనాన్ని అహింసవాదాన్ని ఎంతగా పరీక్ష పెట్టాయో తెలుస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమాన్నే ఆగస్ట్ క్రాంతి ఉద్యమంగానూ పిలిచినా ముఖ్య ఉద్దేశం బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సహాయనిరాకరణ చేయడమే. గాంధీజీ పిలుపుమేరకు 1942 ఆగస్ట్ ఎనిమిదిన ప్రారంభమైన ప్రజాపోరాటంలో తొలిసారిగా హింసకు దారితీసింది. ఈ ఉద్యమం వెనుక బలమైన కారణం ప్రజా ప్రభుత్వాల అభిప్రాయాలతో పనిలేకుండా బ్రిటీష్‌ పాలకులు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడమే.

quit india
క్విట్ ఇండియా

భారత జాతీయోద్యమంలో కీలకమైన క్విట్‌ఇండియా ఉద్యమం అప్పటివరకూ గాంధీజీ అహింసామార్గాన్నే చూసిన బ్రిటీష్ పాలకులకు కొత్తఅనుభవం కలిగించింది. సహనానికి పరీక్ష పెడితే ఎలా ఉంటుందో రుచిచూపించింది. అహింసామార్గంలో వందేమాతరం అంటూ సాగిన ఉద్యమం ఒక్కసారిగా 'డూ ఆర్ డై'.. సాధించు లేదా మరణించు అన్న స్థాయికి వచ్చిందంటే అందుకు కారణం బ్రిటీష్ పాలకుల ఏకకపక్ష ధోరణే. అప్పటివరకూ అహింసా మార్గంలో సాగుతున్న ఉద్యమం ఒక్కసారిగా రూపు మార్చు కోవడానికి నేపథ్యం జర్మనీ బ్రిటన్ మధ్య యుద్ధం.

1939లో ప్రపంచయుద్ధం ప్రారంభమైనప్పుడు వారికి మద్దతుగా పోరాడేందుకు భారత్‌నూ భాగస్వామురాలిగా చేస్తూ బ్రిటన్‌ నిర్ణయం తీసుకుంది. అది కూడా ప్రజల ద్వారా ఎన్నికైనా కాంగ్రెస్ ప్రభుత్వాలతో సంప్రదించకుండానే. గవర్నర్ జనరల్ లిన్ లిత్‌గో భారతదేశాన్ని యుద్ధంలో భాగస్వామురాలిగా చేస్తూ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నాడు.

రొట్టె అడిగితే రాయి ఇచ్చినట్టు..

అప్పుడే.. జర్మనీ దుందుడుకు చర్యలు ఖండిస్తూ 1939 అక్టోబర్ 10న తీర్మానం చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. తమను సంప్రదించకుండా యుద్ధంలోకి లాగుతూ బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయాన్నీ అంగీకరించలేమంటూ అదే తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానంపై స్పందించిన అప్పటి వైస్రాయ్... ప్రపంచ శాంతికోసం బ్రిటన్‌ పోరాడుతుంది కాబట్టి భారత్‌ కూడా సహకరించాలని ప్రకటన చేశారు. యుద్ధం తర్వాత భారత ప్రజల మనోభావాలకు అనుగుణంగా 1935నాటి చట్టంలో మార్పులు తెస్తామన్నారు. ఆ ప్రకటనపై తీవ్రంగా స్పందించిన గాంధీజీ.. విభజించు పాలించూ సూత్రం ఇంకా పాటిస్తున్నారని.. తాము రొట్టె కోసం అడిగితే రాయి ఇచ్చినట్టుగా బ్రిటీష్ వారి వ్యవహరశైలి ఉందన్నారు.

అధికార మార్పు...

ఇదే సమయంలో ఇంగ్లాండ్ రాజకీయాల్లో మార్పుల చోటు చేసుకున్నాయి. అక్కడ చర్చిల్ స్థానంలో కన్సర్వేటివ్‌పార్టీకి చెందిన ఛాంబర్లేన్ ప్రధాని పదవి చేపట్టాడు. వారికి కాంగ్రెస్ డిమాండ్లపై అంత సానుకూలతలేదు. కానీ యుద్ధంలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్న సమయంలో భారతదేశవాసుల్ని మచ్చిక చేసుకోవడానికి కొన్ని డిమాండ్లు అంగీకరించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే 1940 ఆగస్ట్‌లో కొన్ని ప్రతిపాదనలు తీసుకువచ్చారు. అవికూడా కాంగ్రెస్‌ వారికి నచ్చలేదు. తీవ్రస్థాయిలో అసంతృప్తి రేగింది. బ్రిటీష్ పాలకుల నిర్ణయానికి వ్యత్రిరేకంగా కాంగ్రెస్‌ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు వారి ప్రభుత్వాలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యాయి. రాజకీయాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. యుద్ధ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించినందుకుగాను ప్రతిగా ఏం ఇవ్వబోతున్నారో చెప్పకుండానే భారత్‌ను యుద్ధంలో భాగస్వామ్యం చేయడం, పైగా కీలక రక్షణ శాఖను భారతీయులకు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు.

మరో సహాయనిరాకరణకు పిలుపు

ప్రతిష్టంభన తొలగించడానికి లిన్‌లిత్‌గో చేసిన 1940 ఆగస్టు ప్రతిపాదన్నూ కాంగ్రెస్‌ తిరస్కరించింది. యుద్ధనాంతరం భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి, రాజ్యాంగ నిర్మాణ సమితి వంటి ప్రతిపాదనలకు కాలపరిమితి లేదు గనుక వాటిని అంగీకరించలేమంది. యుద్ధ నిర్వాహణ మండలిలో కీలకమైన రక్షణ శాఖను అట్టేపెట్టుకుని ఇతరశాఖలు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అర్థరహితంగా భావించి.. వాటిని తిరస్కరించింది. అదే సమయంలో వార్దాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో ప్రసంగిస్తూ మరోసారి వ్యక్తిగత సహాయనిరాకరణ చేపట్టాలని పిలుపిచ్చారు. అప్పుడే యుద్ధానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. వేలాదిమందిని అరెస్ట్‌ చేసి జైళ్లలో కుక్కారు.

జపాన్​-ఐరోపా పరిస్థితులు

1941న వైస్రాయి ఆదేశాల మేరకు అరెస్టైన సత్యగ్రహీలందరిని విడిచిపెట్టారు. అదే సమయంలో పెరల్ హార్బర్‌పై జపాన్ దాడితో యూరప్‌లో పరిస్థితులు మరింత విషమించాయి. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదం గణనీయంగా విస్తరించింది. నానాటికి విస్తరిస్తున్న జపాన్‌ సామ్రాజ్యవాదం కాంగ్రెస్‌ను కలవరపాటుకు గురి చేసింది. బ్రిటీష్‌ భారతీయ సైన్యాలను స్వచ్ఛందంగా జపాన్‌కు స్వాధీనపర్చడమూ ఆందోళనకు గురిచేసింది. భారత్‌ బ్రిటీష్ వలస కనుక దాడి తప్పదని హెచ్చరించింది. జపాన్ దురాక్రమణ జరిగితే భారతదేశ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించిన కాంగ్రెస్‌ సత్యాగ్రహా ఉద్యమాన్ని విరమించుకుంది.

ప్రత్యేక పాకిస్థాన్ ఆలోచన

1942 మార్చిలో వచ్చిన స్టాఫోర్డ్‌ క్రిప్స్ రాయబారం కూడా భారతీయ నాయకత్వాన్ని నిరాశపరిచింది. 1940 ఆగస్టు ప్రతిపాదనల్నే మళ్లీ ప్రస్తావించిన క్రిప్స్.. సమస్యల్ని మరింత ముదిరేలా చేశాడు. మైనారిటీ ముస్లింలకు భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం ఉందని ప్రకటించి.. పరోక్షంగా ప్రత్యేక పాకిస్థాన్ ఏర్పాటు ఆలోచనకు మద్దతు పలికారు. తీవ్ర నిరాశకు గురైన గాంధీ ఈ ప్రతిపాదనలను దివాళా తీసిన బ్యాంకు పోస్ట్ డేటెడ్ చెక్స్‌గా విమర్శించారు. స్వీయ రక్షణ చేసుకోలేని ఇంగ్లండ్ కనీసం భారతదేశాన్ని రక్షించుకునే బాధ్యత భారతీయులకు ఇవ్వకపోవటం మహాత్ముడిని కలవరపరిచింది. వాటన్నింటికీ పరిష్కారమార్గంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు.

ఇవీ ఉద్యమానికి కారణాలే

1942 ఆగస్టులో ముంబయిలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో గాంధీజీ సత్యాగ్రహం, అహింస ప్రస్తావన లేకుండా క్విట్‌ఇండియా తీర్మానం చేశారు. వెంటనే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా కోరుతూ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఒకసాకుగా చూపుతూ బ్రిటీష్‌ ప్రభుత్వం అధికార రహస్యాల చట్టాన్ని తేవడం కూడా క్విట్‌ ఇండియా ఉద్యమానికి దారి తీసింది. సంక్షోభ పరిస్థితుల్లో ఆ పేరు చెప్పి హక్కులు రద్దుచేయడం, యుద్ధప్రభావంతో తలెత్తిన ఆర్థికసంక్షోభం, భారతీయ సైన్యాల్ని జాతివివక్షకు గురి చేశారనే వార్తలు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అనివార్యం చేశాయి.

Last Updated :Aug 8, 2021, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.