ETV Bharat / bharat

"యూట్యూబ్​లో బూతు యాడ్స్​.. చదవలేక నా ర్యాంక్ మిస్​".. పిటిషన్​ వేసిన యువకుడికి కోర్టు షాక్

author img

By

Published : Dec 9, 2022, 4:22 PM IST

యూట్యూబ్​ నుంచి రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. యూట్యూబ్​ చూస్తుంటే అసభ్యకరమైన ప్రకటనలు వస్తున్నాయని ఆ యువకుడు వేసిన దావాను పరిశీలించిన కోర్టు.. తమ సమయం వృథా చేశారంటూ పిటిషనర్​కు రూ.25వేలు జరిమానా విధించింది.

man petition against youtube ads and fined
యూట్యూబ్ ప్రకటనలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్

"నేను యూట్యూబ్​ చూస్తుంటే అసభ్యకరమైన ప్రకటనలు వస్తున్నాయి. దీంతో నేను చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నాను. పోటీ పరీక్షల్లో నెగ్గలేకపోతున్నాను. తద్వారా నేను నష్టపోయాను. అందుకు నాకు యూట్యూబ్​ నుంచి రూ.75 లక్షలు పరిహారం ఇప్పించండి" అంటూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువకుడు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని, వాటిపైనా నిషేధం విధించాలని సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆ యువకుడు కోరాడు.

శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు.. విచారణకు నిరాకరించింది. పిటిషనర్​కు చీవాట్లు పెట్టి, కోర్టు సమయం వృథా చేశారంటూ లక్ష రూపాయలను జరిమానా విధించింది. "నీకు ప్రకటనలు నచ్చకపోతే చూడకు. యూట్యూబ్​లో ప్రకటనలు చూడాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే." అని సుప్రీం కోర్టు పిటిషనర్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

"నీలాంటి వాళ్లు కేవలం పబ్లిసిటీ కోసమే ఈ తరహా పిటిషన్లు దాఖలు చేస్తారు" అని పిటిషనర్​పై న్యాయస్థానం మండిపడింది. లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని అతడ్ని ఆదేశించింది. అనంతరం హిందీలో తన వాదనలు వినిపించాడు ఆ యువకుడు. క్షమించాలంటూ కోర్టును కోరాడు. తాను నిరుద్యోగినని, అంత సొమ్ము తాను కట్టలేనని వేడుకున్నాడు. కోర్టు స్పందిస్తూ.. ఫైన్​ తగ్గిస్తాము కానీ నిన్ను మాత్రం క్షమించము అని వ్యాఖ్యానించింది. మళ్లీ ఇలాంటి పనులు చేయకంటూ జరిమానాను రూ.25 వేలకు తగ్గించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.