Different Names of Navratri 2023 Across India : దేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో దసరా ఒకటి. మొత్తంగా పది రోజులు, తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం అందుకే వీటిని 'నవరాత్రులు, శరన్నవరాత్రులు'(Shardiya Navratri 2023) అని పిలుస్తాం. అశ్వియుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులపాటు 9 రూపాలలో మహాశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని అత్యంత నియమ నిష్ఠలు, భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. మహిషాసురుడిని అంతం చేసిన మహిషాసురమర్ధినిగా అమ్మవారిని కొలుస్తాం. చెడుపై శక్తి సాధించిన విజయానికి గుర్తుగా పదోరోజున 'విజయదశమి(Vijayadashami)'ని జరుపుకుంటాం.
When is Shardiya Navratri 2023 : అయితే ఈ ఏడాది నవరాత్రి 2023 వేడుకలు అక్టోబర్ 15న ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు నవరాత్రులకు ముస్తాబవుతున్నాయి. అక్టోబర్ 4 వరకు ఈ దేవీ నవరాత్రులు కొనసాగనున్నాయి. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా జగదంబను ఆరాధించేవారికి సర్వ శుభాలూ సంప్రాప్తిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నవరాత్రుల సమయంలో అమ్మవారిని కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకూ వివిధ రూపాలు, పద్ధతుల్లో ఆరాధిస్తారు. దుష్టశక్తుల ప్రభావం నుంచి తమను రక్షించమంటూ దుర్గామాతను స్తుతిస్తారు.
Navratri 2023 : భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా నవరాత్రులను వివిధ రాష్ట్రాల్లో జరుపుకుంటున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో వీటిని వివిధ పేర్లతో పిలుస్తారు. అలాగే రకరకాల సంప్రదాయాలతో భక్తులు జగన్మాతను ఆరాధిస్తారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో నవరాత్రులను ఏయే పేర్లతో పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
దుర్గా పూజ(Durga Puja) : పశ్చిమ బెంగాల్లో నవరాత్రులను దుర్గాపూజగా జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుపుకునే వేడుకల్లో దుర్గాపూజ ఒకటి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలలో కూడా నవరాత్రులను ఇదే పేరుతో జరుపుకుంటారు.
నవరాత్రులు(Navratri) : ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండగ నవరాత్రులు. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నవరాత్రుల పేరుతో జరుపుకుంటారు. నవరాత్రి అనే పేరు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఆలోచన నుంచి వచ్చింది.
కులు దసరా(Kullu Dussehra) : హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయ ప్రాంతంలో నవరాత్రులను 'కులు దసరా' పేరుతో జరుపుకుంటారు. ఆ ప్రాంతం వారు ఈ ఉత్సవాలును చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో వేడుకల పదో రోజున రాముడు, ఇతర దేవతలతో 'రథయాత్ర' బయలుదేరుతుంది.
మైసూర్ దసరా(Mysore Dussehra) : నవరాత్రులను కర్ణాటకలో 'మైసూర్ దసరా' పేరుతో జరుపుకుంటారు. ఉత్సవాలలో భాగంగా పదో రోజు ఆభరణాలు ధరించిన ఏనుగులపై చాముండి దేవి విగ్రహాన్ని ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఇది మైసూర్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
బొమ్మై కోలు(Bommai Kolu) : తమిళనాడులో నవరాత్రులను బొమ్మై కోలు పేరుతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇది స్త్రీలు మాత్రమే జరుపుకునే పండుగ. దీంట్లో భాగంగా అక్కడి మహిళలు దేవతలు, గ్రామాలు లేదా వివాహ దృశ్యాల బొమ్మలను ఒక దగ్గర పేర్చి పూజిస్తారు. వాటిని కళ, దైవత్వానికి ప్రతీకగా ఆరాధిస్తారు.