ETV Bharat / bharat

మెడికల్ డ్రోన్లతో వైద్య సేవల్లో భారీ మార్పులు!

author img

By

Published : Sep 22, 2021, 12:11 PM IST

Updated : Sep 22, 2021, 2:40 PM IST

Medical drone
మెడికల్ డ్రోన్ నమూనా

మారుమూల ప్రాంతాలకు ఔషధాల సరఫరా కోసం డ్రోన్లను వినియోగించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దేశంలో ఇటీవల చేసిన చేపట్టిన ప్రయోగాత్మక వినియోగంలో సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించేందుకు కసరత్తు జరుగుతోంది. మెడికల్ డ్రోన్ల వినియోగంపై ప్రముఖ నిపుణులు డాక్టర్​ 'తమోరిశ్​ కోలే' 'ఈటీవీ భారత్'​తో పంచుకున్న పలు కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల కాలంలో మెడికల్ డ్రోన్ల వినియగం కోసం ముమ్మర కసరత్తు జరుగుతోంది. మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు, ఔషధాల సరఫరా కోసం డ్రోన్​ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధానం రానున్న రోజుల్లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

వీటిని వాడటం ఎంత వరకు సురక్షితమనే విషయంపై కూడా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు పలు పరిశోధనలు కూడా జరిగాయి. ఈ అంశంపై ఏషియన్​ సొసైటీ ఆఫ్​ ఎమర్జెన్సీ మెడిసిన్​ అధ్యక్షుడు డాక్టర్​ తమోరిశ్​ కోలే 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెడికల్ డ్రోన్ల వినియోగంపై చేసిన పలు పరిశోధనల వివరాలను ఆయన విశ్లేషించారు.

దేశీయంగా 2015లోనే టాయ్​ డ్రోన్ ద్వారా హైదరాబాద్​లోని అపోలో హెల్త్​ సిటీ విజయవంతంగా ట్రయల్​ రన్ నిర్వహించిందని గుర్తు చేశారు కోలే.

'డ్రోన్లకు అమర్చిన టెంపరేచర్ కంట్రోల్ బాక్సుల్లో.. ఎర్ర రక్త కణాలు, ప్లేటెట్​ యూనిట్లు, ప్లాస్మా యూనిట్లను 24 గంటల్లో కావాల్సిన ప్రాంతానికి సరఫరా చేసినా.. ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదు. 2017లో అముకేలి అనే సంస్థ చేసిన ఓ పరిశోధనలో ఇది స్పష్టమైంద'ని డాక్టర్​ కోలే వివరించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలు కాపాపడేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా, కొవిడ్​ 19 టీకాలను పంపించడమే కాకుండా.. కరోనా టెస్ట్​ శాంపిళ్లను కూడా సురక్షితంగా సేకరించే వీలుందన్నారాయన. ఎక్కువ మంది చేతులు మారకుండా ఆ శాంపిల్స్ నేరుగా పరిక్షా కేంద్రానికి తరలించేందుకు వీలవుతుందని వివరించారు.

ఈ సానుకూలత నేపథ్యంలో దేశీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెడికల్ డ్రోన్ల వినియోగం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే 'మెడిసిన్​ ఫ్రం ది స్కై' పేరుతో డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మారుమూల ప్రాంతాలకు మెడిసిన్, కరోనా వ్యాక్సిన్​ను​ డెలివరీ చేయడం ఈ ప్రాజెక్ట్​ ముఖ్య ఉద్దేశం.

ట్రయల్​ ఇలా..

తెలంగాణలోని వికారాబాద్​ జిల్లాలో సెప్టెంబర్​ 11న డ్రోన్ల ద్వారా ఔషధాల పంపిణీ ప్రయోగాత్మంగా ప్రారంభమైంది. ఔషధాలు నింపిన రెండు డ్రోన్లు (బ్లూ డాట్‌, టెక్‌ ఈగల్‌) 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి 5 నిమిషాల్లో మందులను తీసుకెళ్లాయి. మెడిసిన్​ ఫ్రం ది స్కై ప్రాజెక్ట్ ట్రయల్స్​​ ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి.

ఈ మెడికల్ డ్రోన్​ ట్రయల్​ విజయవంతమైన నేపథ్యంలో.. మరిన్ని ప్రాంతాల్లో ట్రయల్స్ నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ.. ఐసీఎంఆర్​ (భారత వైద్యపరిశోధన మండలి)కు అనుమతులు ఇచ్చింది.

ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ క్లిష్టంగా ఉండే.. అండమాన్​ అండ్​ నికోబార్ దీవులు, మణిపూర్​, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో ట్రయల్స్​కు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. 3 కీలో మీటర్ల దూరం వరకు డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసేందుకు ఐసీఎంఆర్​ సముఖత వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'ఆర్' వ్యాల్యూతో ఊరట.. తగ్గుతున్న కరోనా కేసులు!

Last Updated :Sep 22, 2021, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.