ETV Bharat / bharat

అత్యాచారానికి నిరాకరించిందని ఆరేళ్ల చిన్నారి హత్య.. టీనేజర్ల దారుణం

author img

By

Published : Jun 22, 2023, 10:00 PM IST

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు ఇద్దరు టీనేజర్లు. ప్రతిఘటించి గట్టిగా అరవడం వల్ల.. ఆమె గొంతుగొలిమి గోడకేసి కొట్టి చంపేశారు. ఇంటి ముందు మ్యాగీ తింటున్న చిన్నారిని ఎత్తికెళ్లి.. ఈ దారుణానికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

girl-killed-for-refusing-to-raped-by-two-teenegers-in-uttarpradesh
ఆరేళ్ల చిన్నారి హత్య

ఇంటి ముందు మ్యాగీ తింటున్న ఆరేళ్ల చిన్నారికి.. మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లారు ఇద్దరు టీనేజర్లు. అభం శుభం ఎరుగని ఆ బాలికకు.. మిఠాయిలు ఇస్తామని ఆశచూపి తమ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించారు. బాలిక ప్రతిఘటించి గట్టిగా అరవడం వల్ల.. ఆమెను హత్యచేసి, ముఖంపై యాసిడ్ పోశారు. అనంతరం అర్ధరాత్రి రోడ్డుపై బాలిక మృతదేహాన్ని పడేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని సిందూరియా స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. మంగళవారం ఇంటిముందున్న ఆరేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. ఎంతకీ చిన్నారి ఆచూకీ లభించని కారణంగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా చిన్నారిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అయినా ఫలితం లేకపోయింది.

అనంతరం బుధవారం అదే గ్రామంలో ఓ రెండు ఇళ్ల మధ్యలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు గ్రామస్థులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనపై అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు.. డాగ్ స్వాడ్​లను సైతం రంగంలోకి దించారు. అనంతరం గ్రామానికి చెందిన ఇద్దరు టీనేజర్లు.. ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధరణకు వచ్చారు. చివరిసారిగా బాధితురాలిని వాళ్ల నిందితుల వద్దే చూసినట్లు పోలీసుల దర్యాప్తులోనూ తేలింది. దీంతో ఇద్దరు టీనేర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది.

"జూన్​ 20న ఉదయం 11 గంటల ప్రాంతంలో.. నిందితుల ఇంటిపక్కనే ఓ చిన్నారి మ్యాగీ తింటూ కూర్చుంది. ఆ సమయంలో చిన్నారి ఇంట్లో ఎవ్వరు లేకపోవడాన్ని గమనించిన నిందితులు.. స్వీట్లు ఆశచూపి చిన్నారిని ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో చిన్నారి గట్టిగా అరవటం ప్రారంభించింది. నిజం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డ నిందితులు.. చిన్నారిని గొంతునులుముతూ.. ఆమె తలను గోడకేసి గట్టిగా కొట్టారు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది" అని తమ విచారణలో నిందితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

చిన్నారి మృతి చెందిందని గుర్తించిన నిందితులు.. అనంతరం ఆమె మృతదేహాన్ని నిందితుల్లో ఒకరింటి పూజ గదిలో దాచిపెట్టారని పోలీసులు పేర్కొన్నారు. చిన్నారిని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ముఖంపై యాసిడ్​ పోశారని వారు వెల్లడించారు. అర్ధరాత్రి వరకు ఆమె మృతదేహాన్ని పూజ గదిలోనే ఉంచారని తెలిపారు. అనంతరం రాత్రి ఒంటిగంట సమయంలో.. చిన్నారి మృతదేహాన్ని నిందితులు వీధిలో పడేశారని పోలీసులు వివరించారు. ఆ సమయంలో విపరీతంగా వర్షం కురుస్తోందని వారు పేర్కొన్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించామని తెలిపిన పోలీసులు.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.