ETV Bharat / bharat

పాలు తాగలేదని ఐదు రోజుల శిశువుపై దారుణం.. వేడి నూనెలో వేళ్లు కాల్చిన తల్లి

author img

By

Published : Jun 16, 2023, 9:44 PM IST

Updated : Jun 16, 2023, 10:51 PM IST

Mother burns kid fingers
చిన్నారి వేళ్లు కాల్చిన తల్లి

ఐదు రోజుల వయసున్న శిశువు పాలు తాగడం లేదని ఓ తల్లి.. వేడి నూనెలో చిన్నారి వేళ్లు కాల్చింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్ ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, కర్ణాటకలో పరువు హత్య కలకలం రేపింది.

బిడ్డ పాలు తాగడం లేదని మూఢ నమ్మకాలతో.. వేడి నూనెలో చిన్నారి వేళ్లు ముంచింది ఓ తల్లి. ఈ దారుణమైన ఘటన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే జరగడం గమనార్హం. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకొని మహిళపై కేసు నమోదు చేశారు. ఉత్తర్​ప్రదేశ్ బారాబంకీ జిల్లాలో జరిగిందీ ఘటన.

ఇదీ విషయం..
ఫతేపుర్ ప్రాంతం ఇస్రౌలి గ్రామానికి చెందిన ఇర్ఫాన్, అషియా బానో దంపతులు. గర్భంతో ఉన్న అషియా బానోకు ఈ నెల 11న పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె భర్త స్థానిక ఫతేపుర్ ఆరోగ్య కేంద్రంలో చేర్చాడు. ఈ క్రమంలో అషియా అదే రోజు ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా మొదటి 3-4 రోజులు ఆరోగ్యంగా ఉన్న చిన్నారి, ఆ తర్వాత తల్లి పాలు తాగడం మానేయడం వల్ల సమస్య తలెత్తింది. బిడ్డ పాలు తాగకపోవడం పట్ల తల్లి అషియా తీవ్ర ఆందోళనకు గురైంది.

ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న అషియాకు ఆసుపత్రి సిబ్బంది వ్యక్తి ఓ వెర్రి సలహా ఇచ్చారు. ఆ సలహాను అనుసరించిన అషియా.. ముందు వెనకా ఆలోచించకుండా, వేడి వేడి నూనెలో బిడ్డ వేళ్లను ముంచింది. రాత్రిళ్లు విధుల్లో ఉన్న నర్స్​ ఒకరు రౌండ్స్ సమయంలో చిన్నారి వేళ్లకు బొబ్బలు రావడం చూసి షాక్​కు గురైంది. బిడ్డ వేళ్లు అలా అవ్వడానికి గల కారణం ఏంటని నర్స్​.. అషియాను ప్రశ్నించింది. మొదట సమాధానం చెప్పేందుకు భయపడ్డ అషియా.. నిజం చెప్పేసింది. విషయం తెలుసుకున్న నర్స్​ ఆమెను మందలించి.. ఆరోగ్య కేంద్రం ఇన్​ఛార్జ్​ డా. అవనీశ్ చౌదరీకి సమాచారం అందించింది.

ఈ ఘటన బయటపడడం ఆసుపత్రిలో కలకలం రేపింది. వెంటనే డాక్టర్లు చిన్నారికి వైద్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. అషియానే ఈ దారుణానికి పాల్పడిందని నిర్ధరించుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఫతేపుర్ స్టేషన్ అధికారి ధీరేంద్ర కుమార్ తెలిపారు. అయితే గతంలో కూడా పిల్లలు పాలు తాగకపోవడం వల్ల.. అషియా ఇద్దరు బిడ్డలను కోల్పోయింది. ఆ భయంతోనే ఈమె చర్యకు పాల్పడి ఉండవచ్చని సమాచారం.

మరోసారి పరువు హత్య..
కర్ణాటకలో పరువు హత్య ఉదంతం కలకలం రేపింది. తమ ఇష్టానికి విరుద్ధంగా ఇతర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిన కారణంగా మైనర్​ను.. ఆమె తండ్రి, అన్న, మామ కలిసి అతి కిరాతకంగా గొంతు కోసి చంపారు. అనంతరం ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మించి అంత్యక్రియలు కూడా జరిపారు. ఈ అమానుష ఘటన కర్ణాటక తుమకురులో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం..
17 సంవత్సరాల బాలిక.. ఇంటికి దూరంగా హాస్టల్​ ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో తను ఇతర కులానికి చెందిన కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. మైనర్ ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. అతడిని మర్చిపోవాలని పలుమార్లు హెచ్చరించారు. అయితే రెండు వారాల కిందట బాలిక కనిపించకుండా పోయింది. దీంతో అప్పమత్తమై.. గాలించిన కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అయినా బాలిక తను ప్రేమించిన వాడిని మర్చిపోవడానికి అంగీకరించలేదు.

ఆగ్రహించిన ఆమె తండ్రి పరశురామ బాలికకు విషం తాగించారు. ఆమె ప్రతిఘటించడం వల్ల.. సోదరుడు శివరాజు, మామ తుకారాంతో కలిసి గొంతు కోసి చంపారు. అనంతరం బాలిక విషం తాగి ఆత్మహత్య చేసుకుందని అందరిని నమ్మించి అంత్యక్రియలు చేశారు. కానీ అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో బాలికది హత్యగా తేలడం వల్ల పోలీసులు.. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్​ చేసినట్లు తుమకురు ఎస్పీ రాహుల్ కుమార్ తెలిపారు.

Last Updated :Jun 16, 2023, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.