ETV Bharat / bharat

రాజకీయం లెక్కలు మార్చిన మినీ సమరం- 2024లో ఏం జరగనుంది?

author img

By

Published : Mar 10, 2022, 7:33 PM IST

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ దుమ్మురేపింది. మోదీ-షా ద్వయం ఉత్తర్​ప్రదేశ్​లో మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాసింది. ఉత్తరాఖండ్​లో సరికొత్త ట్రెండ్​ సృష్టించింది. పంజాబ్​లో ఆప్​ ప్రభంజనానికి కాంగ్రెస్​ విలవిల్లాడి.. అధికారాన్ని దూరం చేసుకోగా.. యూపీలో రెండు స్థానాలకు పరిమితమైంది. ఈ విజయం దేశ రాజకీయాల్లో భాజపా స్థానాన్ని మరింత సుస్థిరం చేసిందా? ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై ఈ ఎన్నికలు ప్రభావం చూపుతాయా? మమత వ్యూహాలపైనే విపక్షాల రాజకీయం ఆధారపడి ఉంటుందా? 2024 ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారనున్నాయి?

BJP wins solid victory in five state assembly elections
మినీపోరులో కమల వికాసం

అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయాన్ని సాధించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకు మించి.. మోదీ-షా జోడీ బ్లాక్​ బస్టర్​ హిట్​ కొట్టింది. 2024లో జరగనున్న సార్వత్రిక పోరుకు సెమీఫైనల్​గా భావించిన ఈ ఎన్నికల్లో.. ఆమ్​ ఆద్మీ పార్టీ పంజాబ్​లో ఏకపక్ష విజయం సాధించగా.. యూపీ సహా ఉత్తరాఖండ్​, గోవా మణిపుర్​లో భాజపా తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే కాంగ్రెస్​ మాత్రం తన ఓటమి పరంపరను కొనసాగించింది. యూపీలో రెండు సీట్లను రాబట్టకోవడానికే ఆపసోపాలు పడింది. పంజాబ్​లో అధికారాన్ని కోల్పోయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రాష్ట్రాల్లో( రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​ )నే అధికారానికి పరిమితమైంది.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​లో యోగి నాయకత్వంలో మరోసారి భాజపా అధికారంలోకి వచ్చి.. ఉత్తరాఖండ్, మణిపుర్​లో రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకొని.. గోవాలో అతి పెద్ద​ పార్టీగా అవతరించి.. దేశ రాజకీయాల్లో కాషాయ దళానికి తిరుగులేదని మరోసారి చాటిచెప్పింది. భాజపా సాధించిన విజయం.. కమలనాధుల్లో జోష్​ నింపగా.. కాంగ్రెస్​ను మరింత కుంగదీసింది. దేశంలో ప్రత్యామ్నాయ కూటమి కోసం పావులు కదుపుతున్న ప్రాంతీయ పార్టీలకు షాక్​ ఇచ్చింది.

భాజపా స్థానం మరింత సుస్థిరం!

ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని ఘటనలు భాజపా విజయావకాశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా రైతుల ఉద్యమం, లఖింపుర్​ ఘటన.. దేశవ్యాప్తంగా భాజపాను వేలెత్తి చూపేలా చేశాయి. ఎన్నికల సమయంలో అలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి.. పక్కా వ్యూహంతో ఓటర్లను తమవైపు తిప్పుకున్న భాజపా.. నాలుగు రాష్ట్రాల్లో సాధించిన విజయంతో.. దేశ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

2024 ఎన్నికలకు సెమీఫైనల్​గా భావించిన ఈ ఎన్నికల్లో విజయంతో.. ప్రత్యామ్నాయ కూటమి ఆశలపై నీళ్లు చల్లింది. సార్వత్రిక ఎన్నికల ఫలితం ఎలా ఉండనుందో సంకేతాలిచ్చింది.

సంస్కరణల అజెండాకు పదును!

నవ భారత నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ.. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదం స్ఫూర్తితో దేశంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత.. తమ సంస్కరణల అజెండా అమలును మరింత వేగవంతం చేసే అవకాశముంది. తాజా విజయాన్ని ప్రజలు ఇచ్చిన ఆమోదముద్రగా భావించి.. 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా.. భవిష్యత్​లో మరిన్ని నూతన సంస్కరణలు తీసుకురావచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది.

మరింత తేలిపోయిన కాంగ్రెస్..

ఔనన్నా, కాదన్నా.. దేశంలో విపక్ష కూటమికి నాయకత్వం వహించాలంటే కాంగ్రెస్​దే అగ్రస్థానం. కానీ.. ఇటీవల కాలంలో ఆ లెక్కలు మారుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. కమలనాధుల విజృంభణతో కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. పంజాబ్​లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్​ పార్టీ.. యూపీలో అయితే కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. గోవా, ఉత్తరాఖండ్​, మణిపుర్​లో రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఇలాంటి పార్టీ.. 2024 ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందన్న చర్చ మొదలైంది.

ఫెడరల్ కూటమిపై అనుమానాలు?

కేంద్రంలో భాజపా తిరుగలేని శక్తిగా ఓ వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో.. దానికి చెక్​ పెట్టేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలని ప్రాంతీయ పార్టీలు ఊవిళ్లూరుతున్నాయి. అయితే ఆ కూటమిని నాయకత్వం వహించి.. ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరనేది ఇక్కడ ఆయా ప్రాంతీయ పార్టీలను వేధిస్తున్న అసలు సమస్య. ఈ క్రమంలో కూటమికి ఆశాదీపంగా తెలంగాణ సీఎం కేసీఆర్​ ముందుకొచ్చారు. భాజపాకు ప్రత్యామ్నాయంగా కూటమి కట్టడానికి ప్రాంతీయ పార్టీల నేతలు ముందుకు రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. అనుకున్న విధంగానే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​, ఝార్ఖండ్​ సీఎం సోరెన్​ను కూడా కలిశారు. అయితే ముగ్గురు నేతలు కాంగ్రెస్​ కూటమిలో ఉండటం గమనార్హం.

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఝార్ఖండ్ పర్యటన సందర్భంగా.. సీఎం కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలు మళ్లీ కూటమి ఏర్పాటుపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కూటమిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని.. ఏమైనా అనుకుంటే చెబుతామని రాంచీలో కేసీఆర్​ చెప్పడం వల్ల.. కూటమి సాధ్యమేనా? అనే మీమాంసలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడం వల్ల.. ఆ కూటమి ఏర్పాటుపై వెనక్కి తగ్గొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మమత రాజకీయమే కీలకం!

అయితే భాజపాకు ప్రత్యామ్నాయంగా.. కాంగ్రెసేతర కూటమి ఏర్పాటులో మమత బెనర్జీ పాత్ర కీలకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బంగాల్​లో భాజపాను ఖంగుతినిపించిన టీఎంసీ అధినేత ముందడుగు వేస్తే.. కూటమి ఏర్పాటు పెద్ద కష్టమేమీ కాదు. అయితే.. కాంగ్రెస్​ లేకుండానే విపక్ష కూటమిని ఏర్పాటు చేయడం, అందులో చేరేలా ఇతర ప్రాంతీయ పార్టీలను ఒప్పించడం ఆమె ముందున్న ప్రధాన సవాలు.

2024 నాటికి సరికొత్త సమీకరణాలు?

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 సార్వత్రిక పోరుకు రెఫరెండంగా భావించాయి. ప్రధాన రాజకీయ పార్టీలు. ఎందుకంటే.. ఈ ఐదింటిలో దేశ రాజకీయాలను శాసించే.. ఉత్తర్​ప్రదేశ్​ ఉండటం వల్ల ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యం ఏర్పాడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి.. లోక్​సభ పోరు నాటికి సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేసీఆర్​కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్​ కిశోర్​ ఉన్న నేపథ్యంలో.. ఏమైనా కొత్త పరిణామాలు సంభవించే అవకాశాలు లేకపోలేదు.

భాజపా అభ్యర్థే రాష్ట్రపతి భవన్​కు!

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా విజయం సాధిచాలంటే.. తాజగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకం. అనుకున్న విధంగా కాషాయ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో బంపర్​ మెజార్టీని సాధించింది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండానే భాజపా తమ అభ్యర్థిని రాష్ట్రపతి భవన్‌కు పంపించడానికి మార్గం సుగమమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.