ETV Bharat / bharat

ఆమె హస్తకళా నైపుణ్యానికి విజయం దాసోహం

author img

By

Published : Mar 17, 2020, 2:42 PM IST

చేతితో మట్టిబొమ్మలకు జీవం పోస్తూ దేశ, విదేశాల్లో ఖ్యాతిని సంపాదించుకుంది రాజస్థాన్​కు చెందిన ఓ గిరిపుత్రిక. ఒంటరిగా ప్రారంభించి హస్తకళ నైపుణ్యంతో.. ఇప్పుడు సుమారు 70 మందికి ఉపాధి కల్పిస్తోంది. సృజనా, సంకల్పం ఉంటే ఏదైనా సాధిస్తామంటూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతోంది.

womens-day-special-story-of-skilled-craftsman-mrs-tipu
ఆమె హస్తకళను విజయం వెతుక్కుంటూ వచ్చింది

ఆమె హస్తకళను వెతుక్కుంటూ విజయం వచ్చింది

'ఈ ఊర్లోనే ఉంటే ఏం సాధిస్తాం? జీవితంలో విజయం పొందాలంటే.. నగరాలకు పోవాలి. విదేశాలకు వెళ్లాలి' అని అపోహపడేవారికి సమాధానమిస్తోంది రాజస్థాన్​ సిరోహీ జిల్లాకు చెందిన టీపు. సొంత గ్రామంలోనే హస్తకళ పరిశ్రమను స్థాపించి 70 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. యావత్​ ప్రపంచానికి గిరిజనుల సత్తా చాటుతోంది.

ప్రతిభ ఆమె ఆయుధం..

ఆబురోడ్​ ఆదివాసి బహుల్​లోని సియావా అనే మారుమూల గ్రామంలో నివసిస్తోంది టీపు. ఊరిని విడిచి కనీసం పొలిమేర కూడా దాటలేదు. సంప్రదాయాలను విస్మరించలేదు. 18 ఏళ్ల క్రితం తన చేతిలో ఉన్న ప్రతిభనే ఆయుధంగా చేసి మట్టికి జీవం పోసింది. అందమైన బొమ్మలుగా మలచింది. ఒంటరిగా ప్రారంభించిన ఈ వృత్తిలో క్రమంగా స్వయం సహాయక బృందంలోని మహిళలనూ భాగస్వాములను చేసింది. ఇప్పుడు టీపు కుటీర పరిశ్రమలో దాదాపు 70 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.

"మేము మట్టిబొమ్మలు తయారు చేస్తాం. విగ్రహాలు, ఆదివాసీ రూపాలు, ఏనుగులు, గుర్రాలు, దేవతా మూర్తులు వంటి అన్నిరకాల బొమ్మలను తీర్చిదిద్దుతాం. సుమారు 18 ఏళ్ల నుంచి ఈ పని చేస్తున్నా."

-టీపు

ఇక్కడ పని చేసే మహిళలు రోజుకు కనీసం 10 బొమ్మలను తయారు చేస్తారు. ఒక్కో బొమ్మ 100-150 రూపాయల ధర పలుకుతుంది.

నలు దిశలా గుర్తింపు..

టీపు హస్తకళ బొమ్మలు కేవలం రాజస్థాన్​లోనే కాదు, దేశ విదేశాల్లోనూ పేరుపొందాయి. శ్రమను నమ్ముకుని హస్తకళకు జీవం పోస్తున్న ఈ మహిళలకు రాజస్థాన్​ ప్రభుత్వం, నాబార్డ్​ ప్రోత్సాహం అందిస్తున్నాయి. జాతీయ హస్తకళ ప్రదర్శన వంటి ఎగ్జిబిషన్లలో వీరి మట్టిబొమ్మలకు ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది.

ఇదీ చదవండి:హాకీనే జీవితం అనుకున్నాడు.. ఇప్పుడు చెప్పులు కుడుతున్నాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.